Monday 19 September 2011

నరసింహ క్షేత్రాలు

అహొబిల మహత్యం

ఈ పుడమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసిం హ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి.రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సం హరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు, ఉద్భవించిన స్ధలమే ఈ అహోబిలక్షేత్రము. ఈ స్ధల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతం నందు "బ్రహ్మండపరాణం" అంతర్గతంలో 10 అధ్యాయాలు.1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడినది.

కృతయుగం నందు హిరణ్యకశ్యపుని సం హర అనంతరం పేట్రేగిన కోపంతో నున్న ఉగ్ర నరసిం హ స్వామిని శాంతింప చేయుటకు పరమశివుడు, నృసిం హ మంత్రరాజుమును "మంత్రరాజ పద స్తోత్రం" గా స్తుతించి నృసిం హుని శాంతింపజేసినట్లు "బ్రహ్మాడపురాణం" లో కలదు. అందుకే ఎగువ అహోబిలం నందు గర్భగుడి ప్రక్కగుహలో జ్వాలా నరసిం హ స్వామిని పరమశివుడు ఆరాధించినట్లుగా మనకు దర్శనమిస్తున్నారు.

"విష్ణుపురాణం" నందు శేషధర్మము 70 అధ్యాయం లో "విరుద్ధ ధర్మ ధర్మిత్వం" లో త్రేతాయుగమున శ్రీరాముల వారు దండకారణ్యమున సీతాన్వేషణకై వెళ్ళినప్పుడు అహోబొల నరసిం హస్వామిని దర్శించి 'నృసిమ్హ పంచామృత స్తోత్రం'తో ఆరాధించినట్లు పురాణం చెబుతుంది.

"శ్రీ మద్భాగవతము" నందు ద్వాపర యుగమున పంచపాండవులు అహోబిల నరసిం హుని పూజించునట్లు పురాణము చెబుతున్నది.

కలియుగం నందు "అర్భావతారము"గా వేంకటేశ్వరస్వామి, పద్మావతి దేవికి విళంబి నామ సం వైశాఖ శుద్ధదశమిలు, శుక్రవారం నాడు వివాహ సమయమున తమ వివాహనికి చేసిన ప్రసాదములను శ్రీ అహోబిల నరసిం హస్వామికి నివేదించవలసినదిగా బ్రహ్మడేవుడు పలికెను.

"శ్రీ వేంకటేశేనా వివాహ కాలే సంపూజితం సర్వవిదోప చారైహిః అనునట్లు వేంకటేశ్వర స్వామి లక్ష్మీనరసిం హ స్వామిని ప్రతిష్టించి, ప్రసాదాలను నివేదించి మహమంగళారతులు చేసినట్లు "వేంకటాచల మహత్యం" చెబుతుంది. వేంకటేశ్వరుడు దిగువ అహోబిలానికి వేంచేసి స్వామిని ప్రతిష్ఠించి వివాహం చేసుకున్నాడు కావున ఈ నాటికి శ్రీ నృసిం హ స్వామి వారి కళ్యాణోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం వారు పట్టు పీతాంబర వస్త్రములు అహోబలేశ్వరునికి ప్రతి సంవత్సరం సమర్పిస్తున్నారు.

ఈ క్షేత్రానికి ముఖ్యమైన ఆళ్వారులు కూడా వచ్చి అహోబలేశ్వరుని దర్శించినట్లు తెలియుచున్నది. గురుపరం పరాధీనలో వైష్ణవ సాంప్రదాయాన్ని అభివృద్ధి చేయుటకు రామానుజాచార్యుల వారు 11వ శతాబ్దంలో అహోబిలం వేంచేసి నరసిం హ స్వామిని దర్శించి అనుగ్రహన్ని పొందినారు. ఆ తరువాత వైష్ణవ పరంపరాధీనతోనే శ్రీ నిగమాంత దేశిక స్వామి అను పండితునకు ఉత్తర భారత దేశ యాత్ర చేసినప్పుడు అహోబిల క్షేత్రమును దర్శించునట్లు ఆధారములు కలవు.

దేవతలకు మాత్రమే ప్రవేశించడానికి సాధ్యమైన ఎగువ అహోబిల క్షేత్రాన్ని 8వ శతాబ్దంలో వైష్ణవ సన్యాసి అయిన తిరుమంగై ఆళ్వార్ దర్శించి నరసిం హ సార్వభౌముని 10 పాశురములతో కీర్తించినారు. ఈ పది పాశురములు "నా లాయిర దివ్య ప్రభంధం" నందు కలవు.

ఈ క్షేత్రానికి వివిధ సామ్రాజ్యాలకు చెందిన రాజులు దర్శించినట్లు శాసనాలు కలవు. విక్రమాదిత్య అను మహరాజు (1076-1106) పశ్చిమ తీరపు రాజులు, చాళక్యులు, కాకతీయులు, విజయనగరాదీసులు, రెడ్డిరాజులు ఈ మూల విగ్రహం ను దర్శించినట్లు ఆధారాలు కలవు. కాకతీయ వంశంలో చివరి రాజైన ప్రతాప రుద్రుడు అహోబిలం వేంచేసి ముఖ్యమైన బంగారు విగ్రహాలు మంటపాలు దేవాలయం నిర్మించినట్లు ఉత్సవల కోసం తగు నిధిని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నాయి.

ఆది శంకరాచార్యుల వారు "పరకాయ ప్రవేశం" చేసినప్పుడు తన చేతులు లేకుండా పోయినందున, ఉగ్ర నరసిం హ స్వామిని "కరావలంబ స్తోత్రము" చేయగా ఆయన చేతులు తిరిగి వచ్చినవి. ఈ స్తోత్రము "20" శ్లోకాలలో నరసిం హ స్వామిని వర్ణించాడు. ఈ సన్నివేశం అహోబిలం నందు (788-820)లో జరిగింది.


అహోబిల నవనారసింహ వైభవం :

అహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ, దిగువ అహోబిల చుట్టు ప్రక్కల వెలసియున్నారు. అవి ముక్తి కాంత విలాసాలు. అహోబిల క్షేత్రం లో నవ నారసింహులకు ప్రత్యేక సన్నిధానములున్నవి. నిసర్గ రమణీయమైన నల్లమల అడవులకే సింగారమై నిలిచినారు. తొమ్మిదిమంది నరసింహ మూర్తులు అహోబిల మొదటి పీఠాధిపతి "ఆదివణ్‌ శఠగోపయతి" బోధనలతో ఆవేశాన్ని పొందిన అన్నమాచార్యులు గానం చేసిన నవనారసింహాకృతి మనకు శృతి భూషణం.


నవనారసింహ - నమో నమో

భవనాశి తీరయహో - బల నారసింహ ||నవ||

జ్వాలాహోబల, మాలోల క్రోడ,కారంజ, బార్గవహ:,

యోగానంద, చ్చత్రవట, పావన నవమూర్తయ:


ఈ మంత్రము నవనారసింహుల మంత్రము, అన్నమయ్య తన పద కవితల యందు అహోబిల, జ్వాలా, యోగానంద కానుగమాని, (కారంజ), భార్గవ, వరాహ, నరసింహుల పేర్లు శ్లోకం లో సంప్రదిస్తున్నవి. మట్టెమళ్ళ, ప్రహ్లద, శ్రీ నారసింహులు, చత్రవట మాలోల, నృసింహులను ఉద్దేశించినవి. పావన నవ నారసింహులలో అన్నమయ్య నవరసాలను ఉగ్గడించాడు. వరుసగా రౌద్ర, వీర, కరుణ, శాంత, భీభత్స, శృంగార, అద్భుత, భయానక, సంతోషం అని తొమ్మిది రసాలుగా అభివర్ణించాడు. ఈ నవనార సింహ క్షేత్రములందలి అన్ని విగ్రహములు దేవతలు ప్రతిష్ఠించినవే అని పురాణాలు చెప్పుచున్నవి.

కరుణను ప్రహ్లాదునికి, శాంతమును సకల చరాచరసృష్టికి, శృంగారమును చెంచులక్ష్మికి ప్రసాదించినాడు. ఈ అహోబిల నారసింహుడు.


  1. జ్వాలా నరసింహ క్షేత్రము
  2. అహోబిల నరసింహ స్వామి
  3. మాలోల నరసింహ స్వామి
  4. వరాహ నరసింహస్వామి (క్రోడా)
  5. కారంజ నరసింహస్వామి
  6. భార్గవ నరసింహస్వామి
  7. యోగానంద నరసింహస్వామి
  8. చత్రవట నారసింహస్వామి
  9. పావన నరసింహ స్వామి


వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీ మన్నారాయణుడు తొణకలేదు, కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహిగా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని "జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు.



ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా "స్వయంభు" తనకు తానే సాలగ్రామముగా, ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు. ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం. ఈ అహోబిలానికి దేవతలు స్తుచించినందున అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు.



వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా "మా" అనగ లక్ష్మిలోల యనగ "ప్రియుడు" అని అర్ధం. ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో ఈ ఆలయం కలదు. స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది. ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామ హస్తము లక్ష్మీదేవిని ఆ లింగనము చేసుకొన్నట్లుగా యున్నది. స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక.



వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి.



కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.

గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా" నృసింహుడు నేనే శ్రీరాముడ నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు.



పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, అసురుని ప్రేవువులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది.



యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు. యోగపట్టంతో, విలసిల్లినాడు, ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.



పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి వారికి శప విమోచనం గావించెను. కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు.



పరమపావన ప్రదేశం లో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించ గలిగే వాడని అర్ధమగుచున్నది. మరియు "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది. పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు.