Thursday 30 January 2014

మనోబుద్దులు అంటే ఏంటివి? వాటి పని ఏమి?

Subha Mantrala
మనోబుద్దులు అంటే ఏంటివి? వాటి పని ఏమి?

శుద్ధ చైతన్యమైన ఆత్మ సహాయం లేకుండా ఏ ఇంద్రియం కూడ పనిచెయ్యలేదు. ఆత్మ యొక్క శక్తి ద్వారానే ఇంద్రియాలన్ని జీవుని ద్వార నడుస్తున్నాయి. మాయ కమ్మిన ఆత్మే జీవుడు. ఆ జీవుడు నేను నాది అనే అహంకారంతో అంతఃకరణ చతుష్టయం లోనే ఉంది. మనోబుద్దులు శరీరం లోపల పని చేస్తూ ఉంటాయి, అవి నాలుగు విధాలుగా ఉన్నాయి. అవి

1. మనస్సు: ఇది సంకల్ప వికల్పాలను చేస్తుంది. ఇది బాగుంది, అది బాగుంది అని సంకల్పిస్తుంది. తర్వాత ఇది తగిందా ,కాదా అనే అనుమానాలతో, సంశయాలతో, అల్లకల్లోలంగా, ఆశానిరాశాలతో, ఊగిసలాడడం అనేటువంటి వికల్పాలతో నిలుస్తుంది.

2. బుద్ధి: ఆయా పదార్థాల స్వరూప స్వభావాలను, ధర్మాలను గత అనుభవాల సహాయంతో నిశ్చయాభిప్రయానికి వచ్చి చేయవలసిన పనిని నిర్ణిస్తుంది, ప్రణాలికలను తయారు చేస్తుంది.

3. అహంకారం: తర్వాత నేను జీవించటానికి తెలివితేటలతో తెలివిగా నడవగలుగుతున్నాను అని భావన చేసేదే అహంకారం. కార్యానికి సంబందించిన సందేహం నాకే కలిగింది, దాని నివృత్తి కూడ నేనే చేసుకున్నాను, దాని వల్ల వచ్చిన ఫలితాన్ని కూడ నేనే అనుభవించాను అనే వాటిని ఆపాదించుకుంటూ ప్రతి పనిమీద ఒకరకమైన సంతోషాన్ని పొందుతూ గర్వాన్ని ప్రకటిస్తూ అహంభావాన్ని అనుభవించే దాన్నే ‘అహంకారం’ అంటారు. నేను, నాది అనే అహాన్ని వ్యక్తం చేస్తూ జీవించే విధానాన్నే అహంకారం అన్నారు. అహంకారంలో తనను తాను అభిమానించుకొనే గుణం ప్రధానంగా ఉంటుంది.

4. చిత్తం: చిత్తం అంటే ప్రయోజనన్నే చింతిస్తుంది.ఏదైనా విషయాన్ని స్మరించేటప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారాలతో కుడి వాటిని పర్యవేక్షిస్తూ రాబోయే వాటికి సలహాలిస్తూ, అభిమాన విషయాలను ఎల్లవేళలా జ్ఞాపకం పెట్టుకుంటూ వాటి జ్ఞానంతో సక్రమంగా నడిచేటట్లు చేసేదే చిత్తం.

అందువలన సహజ సిద్దమైన మనస్సుయొక్క చంచలత్వాన్ని తొలగిస్తే మిగిలిన పనులన్నీ బుద్ది నిర్వహించ గలుగుతుంది. మనం ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని గ్రహిస్తామో అప్పుడు మనసు తన యొక్క చంచలత్వం తొలగిపోతుంది, అప్పుడు మనసు నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైన మనస్సే మనకు సాధనలో ఉపకరిస్తూ ఆ పరమాత్మ స్వరూపునిని హృదయంలో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది.

ఓం నమో పరమాత్మయే నమః