Wednesday 30 July 2014

ప్రశ్నోపనిషత్తు

4. ప్రశ్నోపనిషత్తు
108 ఉపనిషత్తులలొ కఠోపనిషత్తు తరువాత నాలుగవ ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు. ఈ ఉపనిషత్తు అంతా ప్రశ్నలతో నడుస్తుంది. ఈ ఉపనిషత్తులొ 6 ప్రశ్నలు వస్తాయి. ఆదిశంకరాచార్యులు ఈ ఉపనిషత్తు కి భాష్యం వ్రాశారు. పిప్పలాదుడు అనే బ్రహ్మవేత్తను ఆరుగు మహర్షులు వచ్చి ఆరు ప్రశ్నలు వేస్తారు. మెదటి నాలుగు ప్రశ్నలు ప్రాణానికి సంబధించినది. తరువాతి ప్రశ్నలు ప్రణవానికి సంబంధించినది.
ప్రశ్నోపనిషత్తు ఏ వేదానికి సంబంధించినది?
ప్రశ్నోపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించినది.
ప్రశ్నోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?
సుకేశుడు, సత్యకాముడు, సౌర్యాయణి, కౌసల్యుడు, భార్గవుడు, కబంధి అనే వారు ఆరుగురూ ఋషులు. వారు పిప్పలాద మహర్షి నాశ్రయించి, సృష్టి క్రమాన్ని గురించి, ఇతర గురించి మూడు ప్రశ్నలు, నిత్యమైన పరమాత్మ సంబంధమైన విషయాల మీద మూడు ప్రశ్నలు వేశారు. ఈ ఆరు ప్రశ్నలకు పిప్పలాదుడిచ్చిన సమాధానములే ఈ ఉపనిషత్తులోని విషయాలు. అందుచేత దీనికి ప్రశ్నోపనిషత్తు అని పేరు వచ్చింది.
ప్రశ్నోపనిశత్తులోని మంత్రాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయి?
ప్రశ్నోపనిషత్తు లోని మంత్రాలు 6 ప్రశ్నలకు అనుబంధంగా విస్తరించి ఉన్నాయి.
ప్రశ్నోపనిషత్తు లోని ప్రధాన పాత్రధారులెవరు?
పిప్పలాద మహర్షి, సుకేశుడు, సత్యకాముడు, సౌర్యాయణి, కౌసల్యుడు, భార్గవుడు, కబంధి - ఈ ఉపనిషత్తులో ప్రధాన పాత్రధారులు.
కబంధి అను ఋషి అడిగిన ప్రశ్న ద్వారా ఈ ఉపనిషత్తు ఏమి తెలియజేస్తోంది?
మొదట కబంధి ఈ ప్రాణి కోటి ఎక్కడ నుండి వచ్చింది? అంటే సృష్టి ఎలా జరిగిందని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా పిప్పలాదుడు, ప్రజాపతి తపస్సుచేసి 'రయి', 'ప్రాణం' అనే రెండింటిని సృష్టించాడని, 'రయి' అంటే చంద్రుడు, అన్నం అని (matter); 'ప్రాణం' అంటే సూర్యుడు, అగ్ని (life force) అని, ఇందులో 'ప్రాణం' భోక్త, 'రయి' భోజ్యమని వివరించాడు. మొదటిది స్థూలం, రెండవది సూక్ష్మం. వీటి సంయోగమే సృష్టి అని తాత్పర్యం. సూర్యచంద్రులు ఉండడానికి ఆకాశాన్ని కూడా సృష్టించాడని వేరే చెప్పనక్కర లేదు కదా!
భార్గవుడు అను ఋషి అడిగిన ప్రశ్న ఏమిటి? దానికి పిప్పలాద మహర్షి చెప్పిన సమాధానం ఏమిటి?
తరువాత భార్గవుడు ఈ శరీరాన్ని చైతన్యపరచే దేవత ఎవరు? అని ప్రశ్నించాడు. దానికి పిప్పలాదుడు - ఈ శరీరం కర్మ కారణంగా పంచభూతాత్మకమై ఏర్పడుతుందని, శరీరం, ఇంద్రియాలు అన్ని జడమైనవని, వీటన్నిటిలోనూ అంతర్వాహినిగా ప్రాణం ఉండి వాటిని నడిపిస్తూ ఉందని వివరించాడు. పరమాత్మ ఉత్క్రుష్టుడని, ఆయన మొదటి సృష్టి సమిష్టి రూపమైన హిరణ్యగర్భుడు, ప్రజాపతి లేక ఈశ్వరుడు. ఆయనే ఈ వ్యష్టిరూపమైన సృష్టిని చేశాడని, ఆయన ప్రాణంగా అన్నింటిలోను ఉంటున్నాడని వివరించాడు.
అశ్వలాయనుడు అడిగిన ప్రశ్న ఏమిటి? దానికి సమాధానం ఏమిటి?
తరువాత అశ్వలాయనుడు మూడవ ప్రశ్నగా 'ప్రాణం' ఎక్కడ నుండి వచ్చింది? అది ఈ శరీరంలో ఎలా పనిచేస్తుంది? అని ప్రశ్నించాడు. దానికి పిప్పలాదుడు - పరమాత్మ ఛాయా రూపమే ప్రాణం అని, అది ప్రాణం, సమానం, అపానం, వ్యానం, ఉదానాలనే ఐదుగా విభజించుకుని శరీరంలో ఆయా స్థానాలలో ఉండి పనిచేస్తుందని శరీర విజ్ఞాన శాస్త్రాన్ని వివరించాడు.
సౌర్యాయణి అడిగిన ప్రశ్న ఏమిటి? దానికి సమాధానంగా పిప్పలాద మహర్షి ఏమిటి వివరించాడు?
నాల్గవ వాడైన సౌర్యాయణి, శరీరంలో ఏ అవయవాలు నిద్రిస్తున్నాయి? ఏవి నిరంతరం పనిచేస్తున్నాయి? స్వప్నానుభావం ఎవరిదీ? అనే ప్రశ్నలు వేస్తే పిప్పలాదుడు - జాగ్రత్ స్థితి, స్వప్న స్థితి, శుశుప్తి స్థితి అనే అవస్థాత్రయాన్ని, వాటిలోని విశేషాలను వివరించాడు.
సత్యకాముడు ప్రణవోపాసన గురించి అడిగిన ప్రశ్న ఏమిటి? దానికి పిప్పలాద మహర్షి చెప్పిన సమాధానం ఏమిటి?
జీవితాంతం నిశ్చలంగా నిర్విరామంగా ప్రనవోపాసన చేస్తె ఏ లోకాలు లభిస్తాయి? అనే ప్రశ్నను సత్యకాముడు అడిగాడు.
సత్యకాముడు వేసిన అయిదవ ప్రశ్నకు సమాధానంగా పిప్పలాదుడు ప్రణవోపాసనకు సంబంధించిన విషయాలు వివరించాడు.
ఓంకారం అనేది అకార, ఉకార, మకారాల మేళవింపు. అందులో అకారం మీద మాత్రమే దృష్టి ఉంచి ఉపాసన చేస్తే, సదాచార సంపన్నుల గృహంలో జన్మించి, లౌకిక సుఖాలు అనుభవిస్తాడు. ఓంకారంలోని ఉకారాన్ని ఉపాసన చేస్తే, చంద్రలోకం చేరి అక్కడ సుఖాలు అనుభవిస్తాడు. ఓంకారాన్ని ఉపాసించిన సాధకుడు సూర్యలోకాన్ని చేరుకొని మోక్షాన్ని పొందుతాడు.
సుకేశుడు అడిగిన ప్రశ్న ఏమిటి? దానికి సమాధానంగా పిప్పలాద మహర్షి చెప్పినదేమిటి?
తరువాత ఆరవ ప్రశ్నగా సుకేశుడు 'పదహారు కళలతో వెలుగొందే ఆ పరమపురుషుడు ఎవరు?' అని ప్రశ్నించాడు. దానికి పిప్పలాదుడు ఆ పదహారు కళలను వివరించి, అవి పరమాత్మ వ్యక్త స్వరూపమని, అశాశ్వతాలని, పరమాత్మ వీటన్నిటికి అతీతుడని చెప్పి పరమాత్మ అమృతత్వాన్ని వివరించాడు.
ఆరుగురు జిజ్ఞాసువులు సంతృప్తి చెంది, పిప్పలాద మహర్షికి నమోవాక్కాలర్పించి నిష్క్రమించారు.
ప్రాణి కోటి విస్తరణ ఎలా జరిగింది?
ప్రాణం, దానికి కావలసిన ఆహారంతో ప్రాణికోటి విస్తరణ జరిగిందని ఈ విధంగా ఉపనిషత్తు వివరించింది.
ఆదిత్యో హ వై ప్రాణో రయిరేవ చంద్రమాః
ఈ ప్రాణికోటి ఎక్కడినుండి ఉద్భవించింది? అన్న ప్రశ్నకు సమాధానంగా, ముందుగా ప్రాణ రూపమైన సూర్యుడు; ఆ ప్రాణం యొక్క కార్యకలాపానికి కావలసిన అన్నం (రయి) రూపంగా చంద్రుడు సృష్టించ బడ్డారని చెప్తుంది ఈ ఉపనిషత్తు. సృష్టి క్రమంలో మొదటి ఘట్టం ఇది. ప్రాణం, దానికి కావలసిన ఆహారం ఉంటే సృష్టి విస్తరిస్తుందని భావం.
ఉపనిషత్తు సంవత్సరాన్ని ఎలా అభివర్ణించింది?
సంవత్సరో వై ప్రజాపతిః తస్యాయనే దక్షిణం చోత్తరం చ (1.9)
సంవత్సరం అంటే ప్రజాపతే! ఆయనకు ఉత్తరాయణ, దక్షిణాయన మార్గాలుంటాయి. సూర్యచంద్రులు కాలానికి ప్రతినిధులు. చంద్రుని వృద్ధి క్షయాల వల్ల తిథులు ఏర్పడుతున్నాయి. సూర్యుని ఉదయాస్తమయాల వల్ల అహోరాత్రాలు, ఉత్తర, దక్షిణ గమనాల వల్ల అయనాలు ఏర్పడుతున్నాయి. మరి వీరిద్దరిని సృష్టించిందెవరు! ప్రజాపతి. అందుచేత సంవత్సరం అంటే ప్రజాపతే అంటుందీ ఉపనిషత్తు. ఆయనే కాలకారకుడు. భారతీయ సంప్రదాయంలో కాలం పరబ్రహ్మ స్వరూపం.
శరీరానికి ఏది ఆధారం?
శరీరానికి ఆధారం ప్రాణం అని ఉపనిషత్తు నుదివింది.
అరా ఇవ రథనాభౌ ప్రానే సర్వం ప్రతిష్ఠితం (2.6)
రథచక్రానికి నాభి ఉంటుంది. దీన్ని కుంచం అని కూడా అంటారు. ఈ నాభి మీదే చక్రం యొక్క ఆకులు ఆధారపడి చక్రాన్ని శిథిలం కాకుండా చూస్తాయి. ప్రాణం శరీరానికి నాభి వంటిది. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు, మనస్సు కూడా ప్రాణం మీదే ఆధారపడి ఉన్నాయి. ప్రాణం ఉన్నప్పుడే కదా వేదోఛ్చారణ జరిగేది.
ప్రాణం ఎక్కడ నుండి వచ్చింది?
ఆత్మ నుండి ప్రాణం వచ్చిందని ఈ ఉపనిషత్తు చెబుతోంది.
ఆత్మన ఏష ప్రాణో జాయతే (3.2)
ప్రాణం ఆత్మ నుండే జనిస్తుంది.
పునర్జన్మ దేని మీద ఆధారపడుతుంది?
యచ్చిత్తస్తేనైష ప్రాణమాయాతి, ప్రాణస్తేజసా యుక్తః
సహాత్మనా యథా సంకల్పితం లోకం నయతి (3.10)
మరణ సమయంలో ఎటువంటి ఆలోచన వస్తుందో ఆ ఆలోచనతోనే ముఖ్య ప్రాణం సూక్ష్మ శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ ఆలోచనకు అనుగుణమైన జన్మ లభిస్తుంది. అందుచేత మన జీవితాన్ని సన్మార్గంలో నడుపుకోవాలి . మంచి వానికి చెడ్డ ఆలోచనలు, చెడ్డవానికి మంచి ఆలోచనలూ రావు.

ధ్యానము

ధ్యానము
జితాసనో జితశ్వాసో జితసఙ్గో జితేన్ద్రియః - ముందు శరీరానికి స్థిరత్వాన్ని ఏర్పరచాలి. కూర్చున్న భంగిమలో మార్పు రాకూడదు. అదే ఆసన విజయం. మన ముక్కుకు రెండు నాళికలుంటాయి, సూర్య నాళిక చంద్ర నాళిక. ప్రతీ నలుగున్నర నిముషాలకు మారుతూ ఉంటుంది. శ్వాస ఏ వైపుందో గుర్తిస్తే ఆ శ్వాస వెళ్ళే మార్గాన్ని మార్చుకోవచ్చు. సూర్య నాళం జ్ఞ్యాన మార్గమైతే చంద్ర నాళం భక్తి మార్గం. నిరాకారం యందు మనసు లగ్నం చేయాలంటే సూర్యనాళిక వాయు శ్వాసతో చేయాలి. భక్తి మార్గానికి చంద్రనాళిక. మొదట మనసు దాని మీద ఉంచడం మొదలుపెట్టాలి, కూర్చున్నా నించున్న. ఏ నాసికా రంధ్రం నుండి శ్వాస బయటకు వెళ్తొంది, ఎక్కడ శ్వాస నిలుస్తోందో, గుర్తించాలి. మరి మామూలుగా మనకు ఎందుకు ఇది తెలియట్లేదు. మనం తీస్తున్న శ్వాసే కదా? మన మనసు అక్కడ లేదు కాబట్టి.
సూర్యనాళిక నిరోధం వచ్చిన వాడు యోగి అవుతాడు, చంద్ర నాళిక యందు సాధన చేసిన వాడు భోగి అవుతాడు.
మనం అనుకున్నప్పుడు మనం అనుకున్న నాళము నుండి శ్వాస విడుచుట పీల్చుట చేయగలిగితే మనసు మనం చెప్పినట్టు వింటుంది. జ్ఞ్యాన సాధనకు అవసరమయ్యే పనులలో సూర్యనాళంలో శ్వాస తీసుకోవాలి. సూర్య నాళంలో శ్వాస తీసుకున్నప్పుడు హృదయ వేగం తగ్గుతుంది. అంటే భోగం యందు మనసు ఎపుడు లగ్నం చేసామో (చంద్ర నాళం నుండి శ్వాస తీసుకునేప్పుడు, మన కోరిక తీరుతుందో లేదో అన్న ధ్యాసలో మన హృదయస్పందన హృదయ వేగం పెరుగుతుంది).శ్వాస నియమంతో హృదయ గతి యొక్క నియమం కలుగుతుంది, మనోనియమం కలుగుతుంది, దానితో ఇంద్రియనిగ్రహం కలుగుతుంది, దానితో ధారణ కలుగుతుంది, ధ్యానం నిలుస్తుంది.

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 1

జాజి శర్మ

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 1
1. కృష్ణనిర్యాణ వార్తని మోసుకొచ్చి చెప్పడానికి సందేహిస్తున్న అర్జూనుని చూచి ధర్మ రాజు అన్నమాటలివి. మనం ఏ పనులు చేస్తే తల దించుకోవాలో చెప్తున్నాడు
కచ్చిన్నాభిహతోऽభావైః శబ్దాదిభిరమఙ్గలైః
న దత్తముక్తమర్థిభ్య ఆశయా యత్ప్రతిశ్రుతమ్
చెప్పకూడని అనుకోకూడని విషయాలయందు మనసు పెట్టావా. వినకూడని దాన్ని విన్నప్పుడు, తినకూడని దాన్ని తిన్నప్పుడు, చూడకూడని దాన్ని చూచినపుడు మనసు చిన్నబోతుంది. మనప్రమేయం లేకుండా ఇలాంటి విషయం మనకి అనుభవింపచేసాడంటే దానికి మనం చేసిన ఏ పాపం కారణమో అని అర్థం. అధర్మం ఆచరించే దగ్గర గాని, అధర్మం ఎక్కువగా ఉన్నపుడు గాని మన పుట్టుక ఉంటే మనం పాపం చేసిన వాళ్ళమే. ఇలాంటివి విన్నప్పుడో చూచినప్పుడో తిన్నప్పుడో పరమాత్మ నామాలని తలుచుకోవాలి
ఎమైనా ఇస్తానని చెప్పి ఇవ్వలేదా? వారి మనసులో ఆశ కల్పించి నీవు ఇవ్వలేదా? అభయాన్ని ఇవ్వవలసిన నీవు - బ్రాహ్మణులకు బాలురకు గోవుని వృధ్ధున్ని రోగిష్టిని స్త్రీలను. వీరు శరణు కోరితే ఇవ్వలేదా. పొందకూడని స్త్రీని వదిలిపెట్టావా. పొందవలసిన స్త్రీని వదిలిపెట్టావా. పొరబాటున దారిలో వస్తుంటే నీకన్నా తక్కువ వారితో ఓడిపోయావా. తినవలసిన వృధ్ధులు పిల్లలు ఉండగా వారిని వదిలిపెట్టి తిన్నావా. ఆకలిగొన్న వారు ఉండగా వరిని వదిలి నీవు తిన్నావా. ద్వారంలో అథితి ఉండగా ఆపోశనం, నీరు తాగితే అది మద్యంతో సమానం. పది మందీ అసహ్యించుకునే పని నీవు చేయదగని పనినీ చేసావా. నీకు బాగా ఇష్టమైన వారితో ఎడబాటు పొందావా.
2.
పరీక్షిన్మహారాజు విజయ యాత్రల కోసమని బయలు దేరి మార్గమధ్యంలో - భూమి ధర్మం. గోరూపంలో, వృష రూపం. వారిద్దరినీ దూరం నుంచి తన్న బోతున్నటువంటి విషయాన్ని చూచి, ఎవరు ఈ పని చేస్తున్నారు. అర్జనుని యొక్క కౌరవ వంశంలో ఉన్నవారి పరిపాలనలో ఇలా జరగడానికి వీలు లేదు . ఎవరిలా చేశారు
అప్పుడు ధర్మం ఇలా చెబుతుంది
ఎవరు మీకు ఇలాంటి అవస్థ కలిగించారని మీరు అడిగారు కానీ, ఒక్క మాకే కాదు ఈ ప్రకృతిలోనే సుఖాలకు గాని కష్టములకి కాని వాటిని కలిగించే కర్మలకు గాని కారణం ఇది అని చెప్పలేమి ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ఈ పని ఎందుకు జరింగింది అంటే వందమంది వంద కారణాలు చెబుతారు. కనుక మాకు కలిగిన దానికి ఇదీ కారణం అని చెప్పలేము
నీవు ధర్మానివే ఎందుకంటే - బాధ పడుతూ , నిన్ను ఇంత వేదనకు గురిచేసిన్ వాడిని శిక్షిస్తానని అన్నప్పుడు , 'దీని వల్ల కారణమని చెప్పలేను అన్నావు" వృషరూపంలో ఉన్న నీవు ధర్మానివే
ఫలానావాడు నాకు ఈ అపకారం చేసాడని నీవెందుకు చెప్పలేకపోతున్నావో నేను ఊహించగలను. వీడు అధర్మం చేసాడని సూచించిన వాడికి కూడా అధర్మ దోషం వస్తుంది.
అందుకే చేతనైతే ఎదుటివాడిన్ స్తోత్రం చేయమని ధర్మ శాస్త్రం. అందువల్ల ఆ మహాత్ములు ఆచరించిన పుణ్యంలో కొంత భాగం మనకు వస్తుంది. పొరబాటున కూడా నిందించకు విమర్శించకు. చేసిన తప్పుకు గాని చేయని తప్పుకు గాని నిందించితే అకారణంగా ఆ తప్పులోని భాగం నీకు కూడా వస్తుంది .
3. ప్రాణములేని వాటికి కూడా కోరికలు ఉంటాయి. కదలిక లేనంతా మాత్రాన జీవాత్మలేనట్లు కాదు.
పెద్దపులి గాని చిన్న పులి గాని తాను తినవలసిన జంతువు ఎదురుగా ఉంటే దాని ఎదురుగా ఉంటుంది కదలకుండా. ఎంత సేపంటే ఆ జంతువుకి ఇది ప్రాణం లేని జంతువు అని నమ్మకం కుదిరేదాక. అది ముందుకు అడుగేయగానే పులి దాని మీద పడుతుంది. ఎదుటివాన్ని తన వశం చేసుకోవడానికి తనలో ఉన్న చైతన్యాన్ని చలనాన్ని ప్రణాన్ని మరుగు పరిచి స్థావరంలాగ ఉన్న జీవులు తరువాతి జన్మలో స్థావరం గానే పుడతారు. చలనం లేని వాటికి కోరికలుండవని స్థావరములకు ఆశలుండవని అనుకోవధ్ధు. అత్రిమహర్షి ఆశ్రమానికి కొంచెం దూరం ఉండగా రాముడు చెమట పడుతున్నదని ఒక రాతిమీద కూర్చుంటాడు. లక్ష్మణుడికి ఒక అనుమానం వచ్చి 'అత్రి మహర్షి ఆశ్రమం ఇక్కడికి 10 నిముషాలే దూరం ఉంది. ఈ మాత్రానికి ఇక్కడికెందుకు కూర్చున్నారూ అని అడుగగా. 'మనం చిత్రకూటంలో ఉండగా మరీచుడు లేడి రూపంలో వచ్చాడు (రావణుడు పంపగా). నేను బాణం తీయగానే పారిపోయాడు. పారిపోతూ అలసి ఈ రాయిమీద విశ్రమించాడు. ఇక్కడ నేను కూర్చుంటే నేను వాడి దగ్గరకు వస్తున్నట్లు వాడికి సమాచరమొచ్చి తపస్సు కొంచెం పెంచుతాడు. ఈ శిల అయోధ్యా నగరంలో నా అంతపురంలో మణిమయ మండపాన్ని నిర్మించింది ఈ శిల్పియే. వాడికి మోక్షం ఇవ్వడానికి, మరీచుడికి సంకేతం ఇవ్వడానికీ ఇక్కడ కూర్చున్నా' అని అన్నాడు.
4. కలి ప్రధమ లక్షణం లోభం. లోభాన్ని పోషించుకోవడానికి అబద్దం, చౌర్యం, అనార్యం (దుర్జనత), అమ్హ (పాపం), మాయ (మోసం), కలహం, ధంభం (ఇంద్రియాలను మూసుకుని మనసుతో ఇంద్రియ విషయాలని ఆలోచిస్తూ ఉండటం ధంభం)
జ్ఞ్యానం కావలనుకున్నవాడెవ్వడు వీటిని సేవించకూడదు
1. జ్యూదం 2. పానం 3. స్త్రీ 4. పశు హింస 5. బంగారం 6. అబద్దం 7. మదం 8 కోరిక 9. రజో గుణం 10. వైరం.
సామాన్యులు సేవించడం కన్నా రాజు సేవించడం వలన ప్రమాదం ఎక్కువ
5. ఈ పరీక్షిత్తు బ్రహ్మదండంతో కూడ దండింపబడని వాడు, అత్యాశ్చర్య కరములైన పనులు చేసే కృష్ణపరమాత్మ చేత కాపాడబడ్డాడు.
ఈయన రెండు రకాల గొప్పవాడు 1. బ్రహ్మాస్త్రం చేత దహింపబడలేదు భయపడలేదు 2. బ్రహ్మ దండానికి (శాపానికీ) భయపడలేదు.
ఈయన మరణానికి భయపడలేదు. ఓంటి స్తంభం మేడలో ఉన్నడని చెప్పిన కథ వాస్తవం కాజాలదు. ఇంత ఉదాత్తంగా ప్రవర్తించినవాడు కలి పురుషున్ని శాసించినవాడు బ్రహ్మ శాపాన్నుంచి తప్పించుకోచూడ జాలడు.
6. శిష్యులు ఎప్పుడు గురువు గారి దేహాన్ని జాగ్రత్తగా చూడాలి. గురువుగారు శిష్యుడి ఆత్మను గురువు కాపాడాలి
7. తులయామ లవేనాపి న స్వర్గం నాపునర్భవమ్
భగవత్సఙ్గిసఙ్గస్య మర్త్యానాం కిముతాశిషః
ఈ శ్లోకం మనం రోజూ చదువుకోవాలి
పరమాత్మనే ఎప్పుడూ సేవించాలనే కోరిక ఉన్న మహానుభావునితో క్షణకాల కలయికతో లక్షలో లక్ష అంశలో కూడా స్వర్గం అపునర్భవం సాటి రావు. భక్తులతో ఒక్క క్షణం కలిసి ఉండే ఫలములోని కోటి యొక్క అంశతో స్వర్గము అపునర్భవమూ సాటి రావు
8. విలోమం : క్షత్రియుడి వలన బ్రాహ్మన స్త్రీకి పుట్టే వాడు. అనులోమం - బ్రాహ్మణుడి వలన క్షత్రియురాలికి పుట్టే వాడిని. సూతుడు స్త్రీ పురుష సమ్యోగంతో పుట్టినవాడు కాడు. పృధు చక్రవర్తి చేసిన యజ్ఞ్యంలో అగ్నిహోత్రునికి స్వాహాకారం ఇస్తూ ఇంద్ర మంత్రాన్ని పొరబాటున చదివాడు. ఇంద్రుడు క్షత్రియుడు అగ్ని బ్రాహ్మణుడు. క్షత్రియ బీజంతో బ్రాహ్మణ క్షేత్రంలో పుట్టినవాడు సూతుడు. ఎలాంటి పాపం చేయని నాకు ఇలాంటి జన్మ ఎందుకు ఇచ్చి శిక్షించారని అడిగితే - ప్రధానమైన అగ్ని హోత్రానికి పుట్టావు కాబట్టి, అగ్నిహోత్రం జ్ఞ్యానాన్ని అందిస్తుంది కాబట్టి అందరికీ జ్ఞ్యానాన్ని అందిస్తావు
9. నిజముగా ప్రాణాయామం చేస్తే మన చుట్టుపక్కల ఉన్న శబ్దాలు వినపడకూడదు, స్పర్శ తెలియకూడదు. అయిదు విషయాలు తెలియకూడదు. మనసును కూడా అరికట్టాలి. ఏ ఇంద్రియం పని చేయడం మానేసిందో ఆ ఇంద్రియ శక్తి మనసుకు సంక్రమిస్తుంది. మనం మానేసిన దాన్ని మనసు పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకు మనసుని అరికట్టాలి. బుధ్ధిని కూడా అరికట్టాలి. బుధ్ధి ఏమీ అలోచించకుండా మనసు ఏమి సంకల్పించకుండా ఇంద్రియాలు ఏ విషయాలలో ప్రవర్తించకుండా ఉండటం ప్రాణాయామం.
10. ఎవడు లోకాన్ని చూచి భయపడడో, లోకములు ఎవడిని చూచి భయపడవో తానే బ్రహ్మ. ఆపద కలిగించే వాడు ఆపద కలిగించేది అన్న వేరు భావన ఉన్నవాడు బ్రహ్మాత్మకం జగదిదం అనుకోలేడు. తాను ఏది కోరక ఎదుటివాడిలో భేధభావన చూపని వాడు బ్రహ్మ. పొందవలసినది ఏదీ లేక పొందాలన్న కోరిక లేని వాడు.

Monday 28 July 2014

ఆదిత్య హృదయం పరమ పవిత్రం....

ఆదిత్య హృదయం పరమ పవిత్రం.....
.
తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః
.
రామరావణ యుద్ధాన్ని చూడడానికి దేవతలతో కలసి అగస్త్య మహర్షి కూడా వస్తాడు. యుద్ధంలో అలసివున్న రాముడిని చూసిన అగస్త్య మహర్షి "రామా! ఈ సందర్భంగా నీకు వేదంవలె నిత్యమైనదీ, మంగళకరమైనదీ, పురాతనమైనదీ, ఆరోగ్యప్రదాయకమైనదీ, ఆయుర్వృద్ధిని చేసేదీ, అత్యంత ఉత్తమమైనదీ, అతి రహస్యమైనదీ, అత్యంత లాభదాయకమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాను" అని పలికి, ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు.
అగస్త్య ఉవాచ:
రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి
ఓ రామా! గొప్ప బాహువులు గల రామా! ఈ రహస్యమును విను. నీకు యుద్ధంలో విజయం కలుగును గాక!
.
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం
.
ఈ ఆదిత్య హృదయం వలన పుణ్యం, శత్రు నాశనం కలుగును. దీనిని చదువుట వలన జయం, శుభం, పరము కలుగును.
.
సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం
.
ఇది అత్యంత శుభకరమైనది, మంగళకరమైనది, అన్ని పాపములను నాశనం చేయునది. చింత, శోకం, ఒత్తిడిలను తొలగించి ఆయుర్వృద్ధి కలిగించును
..
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం
.
ప్రకాశకుడైన, దేవాసురులచే పూజింపబడిన, తన ప్రకాశంతో లోకాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ భువనేశ్వరున్ని పూజింపుము
..
సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః
.
ఈ ఆదిత్యుడు సకలదేవతలకు ఆత్మయైనవాడు. గొప్ప తేజం కలవాడు. తన కిరణాలతో లోకాలను రక్షిస్తుంటాడు. తన కిరణాలను ప్రసరింపజేయడం ద్వారా ఎండావానలను కలిగించి దేవదానవులను, సకలజనులను కాపాడుతున్నాడు.
.
ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః
.
ఇతడు సమస్త శరీరాలు గలవాడగుటచే, ఇతడే బ్రహ్మా, విష్ణువు, కుమారస్వామి, ప్రజాపతుల రూపం, దేవేంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, చంద్రుడు, వరుణుడు.
.
పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః
ఇతడే పితృదేవతలు, వసువు, పంచభూతాలు, ప్రజలు శరీరంలోని ప్రాణవాయువు. ఋతువులను కలిగించే ప్రభాకరుడు.
ఆదిత్య స్తోత్ర ప్రారంభం :
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః
.
నీవు అదితి కుమారుడవు. నీవు సూర్యుడవు. నీవు ఆకాశంలో సంచరించేవాడివి. వర్షంతో జగాన్ని పోషించేవాడవు. పసిడి కిరణములు కలవాడవు. బంగారు తేజస్సు కలవాడవు. భానుడవు, హిరణ్యం రేతస్సుగా కలవాడవు. నీవు దివాకరుడవు.
.
హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండ అంశుమాన్
.
నీవు ఆకుపచ్చ గుఱ్ఱములు కలవాడవు. సహస్ర కిరణములు కలవాడవు. చీకటిని సంహరించేవాడివి. శుభములు కలుగజేసేవాడివి. బ్రహ్మాండాన్ని మరలా జీవింపజేయువాడవు. ప్రకాశవంతమైనవాడవు.
.
హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనః
.
నీవు హితమనే రమణీయ మనస్సు కలవాడవు. చల్లనివాడవు. అగ్నిగర్భుడవు. అదితిపుత్రుడువు. సాయంకాలంలో శమించువాడవు. మంచును పోగొట్టేవాడవు.
.
వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్ యజుస్సామ పారగః
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః
.
ఆకాశానికి నాధుడవు. చీకటిని పోగొట్టేవాడవు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంల పారంగుడవు. గొప్ప వర్షాన్ని కురిపించేవాడవు. నీటికి మిత్రుడవు. ఆకాశామార్గమున శీఘ్రంగా పోయేవాడవు.
/
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః
.
ఎండ నిచ్చేవాడవు. గుండ్రనివాడవు. మృత్యువువి. ఉదయాన్నే లేతకిరణంలు కలవాడవు. మద్యాన్నం సర్వాన్ని తపింపజేయువాడవు. కవివి. మహాతేజుడవు. సమస్త కార్యాలకు కారణభూతుడవు.
.
నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే
.
నక్షత్రాలకు గ్రహాలకు నాయకుడవు. నీవే ఈ విశ్వ ఉనికికి కారణం. అన్ని తేజస్సుల కంటే తేజస్సును ఇచ్చువాడవు. ద్వాదశాదిత్యులలో అంతర్యామివైన నీకు నమస్కారం
..
నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినధిపతయే నమః
.
తూర్పుకొండతో కూడినవాడికి నమస్కారం. పడమటకొండతో కూడినవాడికి నమస్కారం. జ్యోతిర్గణాలకు అధిపతివైన నీకు నమస్కారం. పగటిని కలిగించే నీకు నమస్కారం.
.
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
.
జయుడకి నమస్కారం. జయభద్రునికి నమస్కారం. పచ్చని గుఱ్ఱములు గల నీకు నమస్కారం. సహస్రాంసునకు నమస్కారం.
.
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః
.
ఉగ్రునకు నమస్కారం. వీరునకు, వేగంగా పయనించే నీకు నమస్కారములు. కమలములను వికసింపజేయు నీకు నమస్కారం. మార్తుండునికి నమస్కారం.
.
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యోదయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః.
.
బ్రహ్మా, విష్ణు, మహేశుల అధిపతికి నమస్కారం. ఆదిత్య వర్చస్సుతో ప్రకాశించువానికి నమస్కారం. సర్వభక్షకునికి నమస్కారం.
.
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః
.
చీకటిని పోగొట్టువానికి నమస్కారం. శత్రువులను వధించేవానికి నమస్కారం. గొప్ప తేజస్సు గలవానికి నమస్కారం. స్వయంప్రకాశం గలవానికి నమస్కారం. దేవునికి, జ్యోతిషపతికి నమస్కారం.
.
తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే
.
బంగారుకాంతివంటి కాంతి కలవాడు, అగ్నిరూపునకు, జగత్తుకు కారణమైనవాడికి నమస్కారం. విశ్వకర్మకు నమస్కారం. ప్రకాశాస్వరూపునకు నమస్కారం. లోకసాక్షికి నమస్కారం.
.
నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః
.
ఈ ఆదిత్యుడే మహా ప్రళయకాలంలో ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. తిరిగి తానే జగత్తును సృష్టిస్తాడు. నాశకాలం తప్ప, తక్కిన కాలంలో చక్కగా పరిపాలిస్తాడు.ఇతడు కిరణాలతో శోశింపజేస్తాడు, ఎండా, వానలను ఇస్తాడు.
.
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం
.
సకల జీవులు నిద్రిస్తుండగా, వాటిలో అంతర్యామిగా మేల్కొని ఉంటాడు. అగ్నిహోత్రం, అగ్నిహోత్రఫలమూ ఇతడే.
.
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వన్యేషు రవి: ప్రభుః
.
వేదాలు, యజ్ఞాలు, యజ్ఞఫలమూ ఇతడే. లోకంలోగల సర్వకార్యములకు ఈ రవియే ప్రభువు.
.
ఏనమాపత్సు కృచ్చేషు కాంతారేషుభయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవః
.
రామా! ఆపదలలో, భయంకలిగించే ప్రదేశాలలో, ఈ స్తోత్రంతో సూర్యుడిని కీర్తించేవాడు అన్ని ఆపదలనుండి రక్షింపబడతాడు.
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
.
నువ్వు మనస్సును ఏకాగ్రంచేసి ఆ దేవదేవుడు జగన్నాధుడైన సూర్యున్ని ఆరాదించు. ముమ్మార్లు ఈ స్తోత్రాన్ని జపిస్తే యుద్ధంలో విజయం నీకే.
.
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్
.
'మహాపరాక్రమశాలీ! నువ్వు ఈ క్షణాన్నే రావణుని సంహరిస్తావు' అని రామునితో అగస్త్య మహర్షి చెప్పి అక్కడినుండి నిష్క్రమిస్తాడు.
.
ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్తదా
ధారయామాస సుప్రీతొ రాఘవః ప్రయతాత్మవాన్
.
అప్పుడు మహాతేజోవంతుడైన రాముడు ధైర్యంతో ఆనందమును పొంది, నిర్మల హృదయంతో ఆదిత్య హృదయంను జపించాడు.
.
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరంహర్ష మవాప్తయాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్
.
రాముడు అలా ఆదిత్య హృదయమును జపించి మహదానందభరితుడయ్యాడు. తర్వాత ముమ్మార్లు ఆచమనం చేసి, మిగుల పరాక్రమముతో విల్లు ధరించాడు.
.
రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్
.
శ్రీరాముడు రావణున్ని చూసి ఉత్సాహంతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. రావణున్ని సంహరించాలని ధృడంగా నిశ్చయించుకున్నాడు
..
అథ రవి రవదన్నిరీక్ష్య రామం
ముదితమన్యాః పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి
.
అలా తనను జపించుతున్న శ్రీరామున్ని చూసి, రాక్షసరాజు వినాశనంను గ్రహించి, చాలా ఆనందంతో 'నీవింక రావణుని వధింప త్వరపడమని, నీకు విజయం తధ్యమ'ని సూర్యభగవానుడు రామునితో చెప్పెను.
ఇతి ఆదిత్య హృదయే సంపూర్ణం.

కఠోపనిషత్తు

జాజి శర్మ

3. కఠోపనిషత్తు
కఠోపనిషత్తు ఏ వేదానికి చెందినది?
కఠోపనిషత్తు కృష్ణయజుర్వేదానికి చెందినది.
కఠోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?
కృష్ణయజుర్వేదానికి చెందిన వేదశాఖలలో ఒక వేద శాఖ పేరు 'కఠ'. ఆ కఠ శాఖకు చెందిన బ్రాహాణములో లభిస్తున్న ఉపనిషత్తు గనుక దీనికి కఠోపనిషత్తు అనే పేరు వచ్చింది.
కఠోపనిషత్తు లోని మంత్రాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయి?
కఠోపనిషత్తులోని మంత్రాలు 2 అధ్యాయాలలొ, ఒక్కొక్క అధ్యాయంలో 3 విస్తరించి ఉన్నాయి.
ఈ ఉపనిషత్తులోని ప్రధాన పాత్రధారులెవరు?
నచికేతుడు, యమధర్మ రాజు ప్రధాన పాత్రధారులు.
కఠోపనిషత్తు లోని ప్రధాన ప్రశ్న ఏమిటి? దాని ద్వారా ఈ ఉపనిషత్తు అందించిన విషయమేమిటి?
నచికేతుడనే స్నాతకుడు యముణ్ణి 'మనిషి మరణించిన తరువాత ఏమీ మిగలదని కొందరు, మిగులుతుందని మరి కొందరు అంటారు; ఇందులో ఏది నిజమో నాకు ఉపదేశించండి' అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో ప్రారంభం అయిన ఉపనిషత్తు సత్య స్వరూపాన్ని అద్భుతంగా ఆవిష్కరించి, దాన్ని దర్శించేటట్టు చేసే సాధన క్రమాన్ని కూడా వివరించింది.
ప్రేయోమార్గం, శ్రేయోమార్గం అంటే ఏమిటి?
భౌతిక స్థాయిలో సుఖంగా జీవించడం 'ప్రేయోమార్గం' అని, జీవిత సాఫల్యానికి (మోక్షానికి) కృషి చెయ్యడం 'శ్రేయోమార్గం' అని ఈ ఉపనిషత్తు పేర్కొంది. భోగలాలసత్వానికి పెద్ద పీట వేసే ప్రస్తుత సమాజానికి మార్గనిర్దేశం చేసే విధంగా ఈ మార్గాల వివరణ జరిగింది.
ఆత్మతత్త్వాన్ని గూర్చి యమధర్మరాజు చేసిన బోధ ఏమిటి?
శాశ్వతమైనది ఆత్మేనని, అది అణువుకన్నా చిన్నదని, అతి పెద్దదానికన్నా పెద్దదని, సూర్యచంద్రాదులు కూడా దాన్ని ప్రకాశింపజేయజాలరని, అది స్వయం ప్రకాశమైనదని, జీవి శరీరంలో ఉన్నప్పుడు అంగుష్టమాత్రంగా హృదయకుహరంలో జ్యోతి వలె ఉంటూ శరీరాన్ని చైతన్య పరుస్తుందని యముడు ఆత్మస్వరూపాన్ని (అది మాటలకందనిదే అయినా) వివరించాడు. అక్కడితో ఆగలేదు.
లక్ష్య సాధన కొరకు యమధర్మరాజు ఇచ్చిన సందేశం ఏమిటి?
నైతిక విలువలను పాటిస్తూ, శ్రేయోమార్గంలో పయనిస్తూ ఉంటే ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది. అప్పుడు ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి మరలించి అంతర్ముఖం చేసి సాధన చేస్తే ఆత్మావలోకనం సాధ్యమవుతుంది. అయితే ఇది అంత సులభమైనది కాదు. కత్తిమీద సాము లాంటిది. అందుచేత, 'మేలుకో! ఉద్యుక్తుడవు కమ్ము! లక్ష్య సిద్ధి అయ్యే వరకు ఆగకు!' అని ప్రబోధించి యముడు ముగిస్తాడు.
మనోబుద్ద్యహంకారాల మీద, నైతిక విలువల మీద ఇంకా అనేక మౌలిక విషయాల మీద చర్చించి సదుపదేశాన్నిచ్చిన సమగ్రమైన ఉపనిషత్తు ఇది.
చివరకు మిగిలేదేమిటి?
మరణానంతరం మిగిలేది ఆత్మ అని ఈ విధంగా ఉపనిషత్తు వివరించింది.
యేయం ప్రేతే విచికిత్సా మనుష్యే
అస్తీత్యేకే నాయమస్తీతి చైకే
ఏతద్విద్యామనుశిష్టస్త్వయాహం
వరాణామేష వరస్త్రుతీయః (1.1.20)
"మనిషి మరణించిన తరువాత 'జీవి' ఉంటాడని కొందరు, ఉండడని కొందరు అంటారు. ఏది నిజమో నీవే నాకు ఉపదేశించాలి" అని నచికేతుడనే బాల బ్రహ్మచారి, స్నాతకుడు యముణ్ణి వరంగా అడుగుతాడు. ఈ ప్రశ్నతోనే అత్యాసక్తికరమైన విషయ వివేచనకు ఈ ఉపనిషత్తు తెరలేపుతుంది.
ఈ ప్రశ్నకు ఇప్పటికి కూడా అందరికి ఆమోదయోగ్యమైన సమాధానం దొరకలేదు. చార్వాకుని వారసులైన ఆధునిక హేతువాదులు మరణించిన వ్యక్తిని దహనం చేసిన తరువాత బూడిద మిగుల్తుంది తప్ప జీవుడనే వాడు లేడంటారు. తద్విరుద్ధంగా, వేదాంతం శరీరం నశ్వరమైనదని, శరీరి అంటే ఆత్మ శాశ్వతమైనదని, శిథిలమైన శరీరం వదలి సంచిత కర్మానుభావానికి వేరొక శరీరంలోకి ప్రవేశిస్తుందని అంటారు. కొంచెం ఇంచుమించుగా ఈ వాదాన్ని అన్ని మతాలూ అంగీకరిస్తున్నాయి.
భోగాల స్వభావం ఏమిటి?
భోగములు అశాశ్వతం అని ఉపనిషత్తు వర్ణించింది.
శ్వోభావా మర్త్యస్య యదంత కైతత్
సర్వేంద్రియాణాం జరయంతి తేజః
(నీవు ఇస్తానన్న) భోగాలు శాశ్వతము కాదు. మరుసటి రోజునే నశించవచ్చు. అంతేకాక ఇవన్నీ ఇంద్రియాల సత్తువను నాశనం చేస్తాయి. నచికేతుని ద్వారా ఈ ఉపనిషత్తు భోగలాలసత్వాన్ని నిరసించింది.
సంపదలతో తృప్తి లభిస్తుందా?
సంపదలతో తృప్తి లభించదని ఉపనిషత్తు ఈ విధంగా వివరించింది.
న విత్తేన తర్పణీయో మనుష్యో
లప్స్యామహే విత్త మద్రాక్ష్మ చేత్వా! (1.1.27)
ఆత్మతత్త్వాన్ని గూర్చిన విచారణ విరమిమ్చుకుంటే అనేక సంపదలు, భోగ్య వస్తువులు ఇస్తానని యమధర్మరాజు నచికేతుణ్ణి మభ్య పెడతాడు. దానికి సమాధానంగా నచికేతుడు "సంపదతో మానవుడికి తృప్తికలుగదు. ఒక సంపద సమకూరితే మరొక సంపద కావాలనిపిస్తుంది. నీ దర్శనం సకల సంపదలూ కలుగజేసేదే కనుక నాకు సంపదల మీద ఆశలేదు" అని తన నిశ్చితాభిప్రాయాన్ని తెలియజేస్తాడు.
గమ్యాన్ని చేర్చే మార్గాలేమిటి?
శ్రేయోమార్గం - ప్రేయో మార్గం అనే రెండు మార్గాలను ఉపనిషత్తు వివరించింది.
శ్రేయస్చ ప్రేయస్చ మనుష్యమేతః
తౌ సంపరీత్య వివినక్తి ధీరః (1.2.2)
జీవన యానంలో మానవుని ముందు రెండు మార్గాలున్నాయి. మొదటిది శ్రేయోమార్గం - ఇది జ్ఞాన సముపార్జన ద్వారా శ్రేయస్సు వైపుకు నడిపించి శాశ్వతానందాన్ని, పరిపూర్ణతను చేకూరుస్తుంది. రెండవది ప్రేయో మార్గం - ఇది ప్రియం కలుగజేసేది. కర్మానుష్టానం ద్వారా కొంత అభ్యుదయం కలిగించినా అది అశాశ్వతము, దుఃఖ హేతువు అవుతుంది.
ఈ రెండు మార్గాల గుణ దోషాలను వివేచనాత్మకంగా పరిశీలించి వివేకవంతులు శ్రేయోమార్గాన్ని, మంద బుద్ధులు ప్రేయో మార్గాన్ని ఎంచుకుంటారు.
అజ్ఞానుల లక్షణం ఏమిటి?
ఆత్మ ప్రశంసకు పాల్పడడం అజ్ఞానుల లక్షణం.
అవిద్యయామన్తరే వర్తమానాః
స్వయం ధీరాః పండితంమన్యమానాః (1.2.5)
అవిద్యారూపమైన ప్రేయోమార్గాన్ని ఎంచుకున్న అజ్ఞానులు తామే ప్రజ్ఞావంతులమని ఆత్మ ప్రశంసకు పాల్పడతారు. వారి జీవితం ఒక గ్రుడ్డివాడిని మరొక గ్రుడ్డివాడు నడిపించినట్టుంటుంది.
'ఆత్మ విద్య' ఎలా లభిస్తుంది?
ఆత్మ విద్య తర్కానికి అతీతం గనుక గురువు అనుగ్రహంతోనే లభిస్తుంది.
నైషా తర్కేణ మతిరాపనేయా (1.2.9)
ఆత్మ విద్య తర్కంతో పొందరానిది. బ్రహ్మ సాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే ఉపదేశించగలడు.
ఆత్మ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి?
నాశం లేకపోవడం ఆత్మా యొక్క ప్రధాన లక్షణం.
న హన్యతే హన్యమానే శరీరే (1.2.18)
శరీరం నశ్వరం. ఆత్మ శాశ్వతం, శరీరం హతమైనా ఆత్మ హతం కాదు.
ఉపనిషత్తు ఆత్మను ఎలా వర్ణించింది?
చాలా చిన్న దాని కంటే చిన్నది - చాలా పెద్ద దాని కంటే పెద్దది - అని వర్ణిస్తుంది.
అణోరణీయాన్మహతో మహీయాన్ (1.2.20) - అని వర్ణించింది. ఆత్మ సర్వవ్యాపకమైన తత్త్వం అని దీని అర్థం.
వేదాధ్యయనం తో ఆత్మ లభిస్తుందా?
వేదాధ్యయనంతో ఆత్మ లభించదు.
నాయమాత్మా ప్రవచనేన లభ్యో
న మేధయా న బహూనా శ్రుతేన (1.2.23)
వేదాధ్యయనం వలన గాని, వేదాంత గ్రంథ పఠనం వలన గాని ఆత్మ లభించదు. సాధన ద్వారా మాత్రమే లభిస్తుంది.
ఆత్మను, శరీరాన్ని, ఇంద్రియాలను ఉపనిషత్తు వేటితో పోల్చింది?
రథం యొక్క ఉపమానంతో ఈ క్రింది విధంగా వర్ణిస్తుంది.
ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవ తు
బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ
ఇన్ద్రియాణి హయానాహుర్విషయాంస్తేషు గోచరాన్
ఆత్మేన్ద్రియమనోయుక్తమ్ భోక్తేత్యాహుర్మనీశిణః (1.3.3,4)
ఆత్మ రథికుడని తెలుసుకో. శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు, ఆ గుర్రాలు విషయాల వైపుకు పరుగులు తీస్తాయి. ఇటువంటి శరీరేంద్రియ మనస్సులతో కూడిన జీవుడు భోక్త అని పెద్దలు అంటారు.
శరీరస్థుడైన ఆత్మ మనోబుద్దుల ద్వారా ఇంద్రియాలను నియంత్రించి, అవి విషయాల వైపుకు వెళ్ళకుండా చూచుకుంటేనే గమ్యం చేరతామని - అంటే ఆ విధంగా జాగ్రత్త పడినప్పుడే ఇంద్రియాలను అంతర్ముఖం చేసి ఆత్మవైపుకు మరలించడం సాధ్యం అని ఈ ఉపనిషత్తు చెబుతోంది! వేదాంత ప్రవచనాలలో తరచుగా ఉదాహరించే మంత్రం ఇది.
మానవునిలోని స్థూల, సూక్ష్మాలు ఏవి?
ఇంద్రియాలు స్థూలం, ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం. స్థూలం నుండి సూక్ష్మాతి సూక్ష్మానికి ఆరోహణ క్రమం ఈ ఉపనిషత్తు ఇలా హృద్యంగా వర్ణించింది.
ఇంద్రియేభ్యః పరాహ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనః
మనసస్తు పరా బుద్ధిః బుద్ధే రాత్మా మహాన్ పరః (1.3.10)
ఇంద్రియాల కంటే వాటికి గోచరించే పదార్థాలు ఉత్కృష్టమైనవి; వీటికంటే మనస్సు, దాని కంటే బుద్ధి, దాని కంటే ఆత్మ సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ మైనవి; ఒక దాని కంటే ఒకటి ఉత్కృష్టమైనవి.
అలాగే మహాత్తత్త్వం కంటే (మొదట వ్యక్తమైన హిరణ్య గర్భుని కంటే) అవ్యక్తం (భీజరూపంలో నున్న అవ్యక్త విశ్వం) అంటే ప్రక్రుతి (Matter) ఉత్కృష్టమైనది, దాని కంటే పురుషుడు, అంటే ఆత్మ ఉత్కృష్టమైనది. దాని కంటే ఉత్కృష్టమైనది ఇంకేదీ లేదని ఉపనిషత్తు ఈ విధంగా వర్ణించింది.
మహతః పరమవ్యక్తం, అవ్యక్తాత్ పురుషః పరః
పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరా గతిః (1.3.11)
లక్ష్య సాధన విషయంలో ఏమి బోధించింది?
ప్రతి మానవునకు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యసాధనకు అలుపెరగని ప్రయత్నంతో ముందుకు సాగాలి. ఆ లక్ష్యం ఆత్మావలోకనమే, అయితే అది కత్తి మీద సాము వంటిది అని పెద్దలు చెప్తారు. అందుచేత మానవులారా! అవిద్య నుండి మేల్కొనండి, లేచి ఎన్ని కష్టాలెదురైనా, మహానుభావుల శిక్షణలో లక్ష్య సాధన చేసేటంత వరకు ఆగవద్దు. ముందుకు పదండి అని ఈ ఉపనిషత్తు ఈ మాదిరిగా ఎలుగెత్తి ఉత్తేజ పరుస్తుంది.
ఉత్తిష్ఠత! జాగ్రత! ప్రాప్య వరాన్నిబోధత!
క్షురస్య ధారా నిశితా దురత్యయా
దుర్గం పథస్తత్కవయో వదంతి
'Arise! Awake! And stop not till the goal is reached' అని వివేకానంద స్వామి ఈ మంత్రం వల్ల ప్రభావితమై విశ్వమానవ లోకానికి ఎలుగెత్తి ప్రవచించాడు.
ఆత్మకు ప్రకృతి లక్షణాలు ఉంటాయా?
ఆత్మకు ప్రకృతి లక్షణాలైన రూప రస గంధాలుండవని ఉపనిషత్తు ఈ విధంగా వివరించింది .
ఆశబ్దమస్పర్శమరూపమవ్యయం
తథా 2 రసం నిత్యం, అగన్ధవచ్చయత్ (1.3.15)
ఆత్మకు రూప, రస గంధాలు గాని, శబ్ద స్పర్శలు గాని ఉండవు. అది శాశ్వతమైనది.
అంతరాత్మను దర్శించడానికి ఏమి చెయ్యాలి?
ఇంద్రియాలను అంతర్ముఖం చెయ్యాలి.
పరాంఛి ఖాని వ్యయత్రుణత్స్వయంభూః
తస్మాత్పరాజ్ పశ్యతి నాంతరాత్మన్
కశ్చిద్దీరః ప్రత్యగాత్మానమైక్ష
దావృత్తచక్షురమృతత్వమిచ్చన్ (2.1.1)
ఇంద్రియాలను బాహ్య ప్రపంచంలో ప్రవర్తించే విధంగా భగవంతుడు సృష్టించాడు. అందువలన అవి అంతరాత్మను చూడలేక పోతున్నాయి. ధీరుడైన వాడు వాటిని నియంత్రించి అంతర్ముఖం చేసి అంతరాత్మను దర్శించుకుంటున్నాడు.
ఆత్మ పరిమాణం ఎంత?
పురుషుడు (ఆత్మ) అంగుష్ఠ మాత్రుడు.
అంగుష్ఠమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్ఠతి (2.1.12)
ఆత్మా బొతనవ్రేలన్త పరిమానమ్తో శరీర మధ్యంలో ఉంటుంది. అంటే కాకుండా 'జ్యోతిరివ అధూమకః' పొగలేని జ్యోతిలాగ వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రస్తావించినది జీవాత్మ (embodied soul).
ఉపనిషత్తు శరీరాన్ని దేనితో పోల్చింది?
పదకొండు ద్వారాలు గల కోట వంటిది శరీరం అని ఈ విధంగా వర్ణించింది ఉపనిషత్తు.
పురమేకాదశ ద్వారం, అజస్యావక్రచేతసః
అనుష్ఠాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే (2.2.1)
శరీరానికి పదకొండు ద్వారాలున్నాయి. ఇది కూడా ఒక కోట లాంటిదే. కోటలో రాజుగారిని దర్శించడానికి ఎంత ప్రయత్నం చేస్తారో, ఎంత తహతహ లాడుతారో అలాగే శరీరంలో అంతర్నిహితంగా ఉన్న ఆత్మను పొందడానికి కూడా అంతే ప్రయత్నం, ఆసక్తి ఉండాలని, ధ్యానం చేసి ఆత్మను తెలుసుకున్న వానికి పునర్జన్మ ఉండదని, వర్ణనా రూపకంగా వివరిస్తుంది ఉపనిషత్తు.
నేత్రాలు రెండు, కర్ణేంద్రియాలు రెండు, ముక్కు రంధ్రాలు రెండు, నోరు, నడినెత్తిన గల బ్రహ్మ రంధ్రం, నాభి, మల మూత్ర విసర్జన ద్వారాలు రెండు - మొత్తం పదకొండు ద్వారాలు శరీరానికున్నాయి. మరణ సమయంలో ఈ ద్వారాల్లో దేని నుండైనా ఆత్మ నిష్క్రమించవచ్చును. అయితే బ్రహ్మరంధ్రం గుండా నిష్క్రమిస్తే ముక్తి లభిస్తుందని అంటారు.
ఏది నిష్క్రమిస్తే మరణం సంభవిస్తుంది?
ప్రాణం పోవడం వల్ల మరణం సంభవించదు. ఆత్మ నిష్క్రమిస్తే మరణం సంభవిస్తుంది.
న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన
ఇతరేణ తు జీవంతి యస్మి న్నేతావుపాశ్రితౌ (2.1.5)
ప్రాణాపానాదులకు కూడా ఆశ్రయమైనది ఆత్మ. దాని ప్రభావం వల్లే ప్రాణ వాయువు మొదలైనవి పనిచేస్తున్నాయి. ఆత్మ నిష్క్రమిస్తే మరణం సంభవిస్తుంది. మనిషి జీవించేది ఆత్మ వలన కాని ప్రాణాపానాదుల వలన కాదు, వాటి కంటే వేరైన ఆత్మ తత్త్వం ఉందని తాత్పర్యం.
అవ్యక్తాన్ని, వ్యక్తాన్ని ఉపనిషత్తు ఏ ఉపమానంతో వర్ణించింది?
వ్రేళ్ళు ఆకాశంలో, కొమ్మలు భూమిలో గల రావి చెట్టుతో పోలుస్తుంది.
ఊర్ధ్వమూలో అవాక్శాఖః
ఏషో 2 శ్వత్థః సనాతనః (2.3.1)
జనన మరణాలతో కూడుకున్న జీవితమే సంసారం. ఇది ఒక రావి చెట్టు లాంటిది. మరి దీనికి మూలం ఎక్కడ? ఆకాశంలో. అంటే అవ్యక్త పరబ్రహ్మంలో. అందుచేత సంసారానికి వేళ్ళు ఆకాశంలో ఉన్నాయని అభివర్ణించింది. అయితే ఈ సంసార జీవితం గడపటానికి కావలసిన విశ్వం క్రింద ఉంది. అంటే సంసారానికి మూలమైన పరబ్రహ్మం పైన ఉండగా, కార్య రూపమైన విశ్వం, దానిలోని మానవులు మొదలైన జీవజాలం శాఖోపశాఖలుగా వ్యాపించి ఉంటాయి. వేదాంత పరిభాషలో కారణమైన బ్రహ్మం పైన, కార్యరూపమైన జగత్తు క్రింద అని అభివర్ణించబడింది. భగవద్గీత 15వ అధ్యాయంలో మొదటి మూడు శ్లోకాలలో ఈ మంత్రం కొంచెం మార్పుతో కనిపిస్తుంది.

Thursday 24 July 2014

శ్రావణమాసం

భక్తి సమాచారం

శ్రావణమాసం
శ్రావణమాస విశిష్టత
మహిళలు శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు . ఈ మాసంలో నెలంతా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు మహాలక్ష్మిలా వెలుగొందుతూ తమ కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయాలు శ్రావణ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడనున్నాయి.
పురాణాల కధనం:
ప్రకారం పరమ శివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడు ఐనాడు. లోకాన్ని ఉద్ధరించాడు్రావణ మాసం రాగానే గుర్తుకు వచ్చేవి నోములు, పేరంటాలు,శనగల వాయనం. పెళ్ళైన కొత్తలో నోముకున్న మంగళగౌరీ వ్రతం, శ్రావణ శుక్రవార వ్రతం, అమ్మవారి నైవేద్యాలు ... ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు సోమవారాల్లో శివుడికి అభిషేకాలు,
మంగళవారం గౌరీ వ్రతం
బుధవారం విఠలుడికి పూజలు,
గురువారాల్లో గురుదేవుని ఆరాధన,
శుక్రవారాల్లో లక్ష్మీ, తులసి పూజలు
శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి ,భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో దేవున్ని పూజించడం తర తరాల నుండి సాంప్రదాయంగా వస్తుంది. రోజు చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీపౌర్ణమి, రుషి పంచమి, గోవత్సబహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. ఒకటి తర్వాత ఒకటి పండుగలు రావడంతో కొత్త అళ్ళుల్లు, కోడళ్ళు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు రావడంతో ప్రతి హైందవ గడప సందడిగా మారుతుంది.
పరమశివుడి వారం ... సోమవారం భక్తులు హరహర మహాదేవ శంభోశంకర అంటూ కొలువగానే కొలువుదీరే శివునికి శ్రావణమాసం అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ మాసంలో వచ్చే సోమవారాలన్నింటిని శివాభిషేకానికి కేటాయిస్తారు. ఆవుపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే అభిషేకం చేసి ఉపవాస దీక్షలు చేపట్టి తాంబూళం, దక్షణ సమర్పించి భక్తులు శివుడికి హారతిస్తారు. బిలువ పత్రాలు, ఉమ్మెత, కలువతుమ్మి వంటి శివుడికి ఇష్టమైన పూలతో పూజలు చేయడం ఈ పండుగ ఆనవాయితీ.శుభాలు కలిగే .. మంగళగౌరీ వ్రతం శ్రావణమాసంలో శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. మంచి భర్త రావాలని అవివాహితులు, తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు.నాగపంచమి శ్రావణమాసం మొదలైన నాలుగవ రోజునే వచ్చే పండుగ నాగపంచమి, శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిర్యాలు, పూలనుపెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడిగెలను భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే ... పుత్రదైకాదశి సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల రోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లయితే సంతానయోగ్యత కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. బ్రాహ్మణులు ఈ మాసంలో పాత జంధ్యాన్ని త్యజించి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు.
వరాలిచ్చే తల్లి ... వరలక్ష్మి శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శనిగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగాదలిచి గౌరవిస్తారు.
మహాలక్ష్మి యెక్కడ కొలువుంటుంది?
గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పూలు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇండ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలకి నివసిస్తుంది.

ఈశావాస్యోపనిషత్తు

@.జాజి శర్మగారు.
ఈశావాస్యోపనిషత్తు
ఈశావాస్యోపనిషత్తు ఏ వేదంలో ఉంది?
ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదంలో ఉంది.
ఈశావాస్యోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?
ఈ ఉపనిషత్తు 'ఈశావాస్య' అనే పదంతో ప్రారంభం అయ్యింది ఈశావాస్యోపనిషత్తు అనే పేరు వచ్చింది. దీనినే ఈశోపనిషత్తు అని కూడా అంటారు.
ఈ ఉపనిషత్తులో ఎన్ని మంత్రాలు ఉన్నాయి?
ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి.
ఈశావాస్యోపనిషత్తు అందించిన ప్రధానమైన సందేశం ఏమిటి?
ఈ చరాచర ప్రపంచం అంతా ఈశ్వరుడి చేత ఆచ్చాదింపబడిందని, అందుచేత 'నేను', 'నాది' అనే భావాలు పరిత్యజించి, త్యాగబుద్ధితో, లోభరహితంగా, లభించిన దానితో సంతృప్తి చెంది అనుభవించడమే ఉత్తమ నైతిక జీవనమనే ఉదాత్త సందేశంతో ప్రారంభామవుతుందీ ఉపనిషత్తు.
పరమాత్మ 'విశ్వవ్యాపి' అని చెప్పే మంత్రం ఏది?
ఈశావాస్య మిదగ్ం సర్వం
యత్కించ జగత్యాం జగత్
ఈ సూక్తి ఈ ఉపనిషత్తులో మొదటి మంత్రంలో మొదటి పాదం. ఈ దృశ్యమాన విశ్వం ఈశ్వరుడి చేత కప్పబడి ఉంది - అంటే భగవంతుడు విశ్వవ్యాపకుడని అర్థం.
వివరణ: ఈ విషయం వేదంలో అనేక చోట్ల ప్రస్తావించ బడింది. ప్రసిద్ధమైన నారాయణ సూక్తంలో
"యచ్చ కించిజ్జగత్సర్వమ్ దృశ్యతే శ్రూయతే2పివా
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః"
అని ఉంది.
ఈ ప్రపంచంలో కనిపించేది, వినిపించేది ఏది ఉందో, దాని లోపల, బయట ఉన్నవాడు నారాయణుడే (అంటే బ్రహ్మమే). ఇలా అంతా బ్రహ్మ మయమే అని గ్రహించి మానవుడు ఆయన మీదే మనస్సు లగ్నం చెయ్యాలని సందేశం.
త్యాగం చెయ్యవలసిందని, పరుల ద్రవ్యాన్ని అపహరించ వద్దని చెప్పిన వచనం ఏది?
లోభం గర్హించదగింది అని చెప్పే మంత్రం ఇది.
తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనమ్
ఇది మొదటి మంత్రంలో రెండవ భాగం. ఈ చరాచర ప్రపంచమంతా భగవన్మయమే అయినప్పుడు, ఈ వస్తువు నాది, నేను సంపాదించాను అనుకోవడం అజ్ఞానం. భోగ్య వస్తువులను వేటినయినా తన ప్రయోజకత్వంతో సాధించాననే అహంకారంతో కాకుండా, భగవద్దత్తమైనవనే భావంతో, త్యాగ బుద్ధితో, అనాసక్తతతో అనుభవించుచూ ఎవరి ధనాన్ని ఆశించ వద్దు అని దీని అర్థం.
పరబ్రహ్మ పరిపూర్ణమూ లేక సంపూర్ణమూ అని చెప్పే శాంతి వచనం ఏమిటి?
బ్రహ్మ ఎప్పుడూ పూర్ణమే!
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతిః శాంతిః శాంతిః
భగవంతుడు పూర్ణం (అదః పూర్ణం), ఈ విశ్వమూ పూర్ణమే (ఇదం పూర్ణం), పూర్ణమైన ఆ భగవంతుని నుండే ఈ పూర్ణమైన విశ్వం కూడా ఆవిర్భవించింది. పూర్ణం నుండి పూర్ణమును పరిహరిస్తే మిగిలేదీ పూర్ణమే.
వివరణ: బ్రహ్మం నుండి నామ రూపాలుగా విశ్వం ఆవిర్భవించి నప్పుడు, మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు, విశ్వం బ్రహ్మంలో లీనమైనప్పుడు - అంటే అన్ని స్థితులలోనూ బ్రహ్మం పూర్ణమే. విశ్వం అశాశ్వతం. బ్రహ్మం శాశ్వతం. విశ్వం శాశ్వతం అనుకోవడమే అవిద్య. విశ్వం శాశ్వతం కాదని ఆధునిక సృష్టి సిద్ధాంతం కూడా చెపుతుంది. ఆ విషయాన్ని వేల సంవత్సరాల నాడు వేదం ఈ మంత్రం ద్వారా సూచించింది. సృష్టికి కావలసిన ద్రవ్యం ఏది అనే ప్రశ్నకు ఆధునిక శాస్త్రజ్ఞుల వద్ద సమాధానం లేదు. బ్రహ్మమే - శుద్ధ చైతన్యమే ద్రవ్యంగా విశ్వావిర్భావం జరిగిందని ఈ మంత్రం ద్వారా సూచించి ఆధునిక శాస్త్రజ్ఞుల కంటే ఒకడుగు ముందరే ఉంది వేద విజ్ఞానం.
ఈ మంత్రం పిల్లలతో సహా అందరికి రావలసిన శుభకర మంత్రం.
పరమాత్మ యొక్క విశిష్ట లక్షణాలను వర్ణించే వచనం ఏమిటి?
ఆ వాక్యం ఇది:
తదేజతి తన్నైజతి
తద్దూరే తద్వంతికే
త దంతరస్య సర్వస్య
తదు సర్వస్యాస్య బాహ్యతః
ఇది ఈ ఉపనిషత్తులో ఐదవ మంత్రం. దీని అర్థం - ఆత్మతత్వం చలిస్తుంది, చలించదు, దూరంగానూ ఉంటుంది. జగత్తు లోపలా బయటా కూడా ఉంటుంది. అలాగే పాండిత్యానికి పరిమితమైన వారికి అది దూరమే, యోగులకు దగ్గరే.
వివరణ:
ఆత్మ సర్వ వ్యాప్తం - తనలో నున్న ఆత్మతత్వం ఇతరులలో నున్న ఆత్మతత్వం ఒకటే అనే జ్ఞానం లోపించినపుడు గుడికి ఎంత దగ్గరగా నున్నా - అంటే ఎన్ని దేవాలయాలు సందర్శించినా, ఎంత పాండిత్యం సంపాదించినా దైవానికి దూరమే. గుడికి దగ్గిర - దైవానికి దూరం అనే అర్థం వచ్చే ఆంగ్ల సామెత ఉద్భవించక ముందే ఈ విషయాన్ని ఉపనిషత్తు బోధించింది. ఆత్మావలోకనం చేసిన యోగులకు మాత్రమే ఆత్మతత్వం దగ్గరగా ఉంటుంది.
సర్వ వ్యాప్తమైన ఆత్మతత్వానికి అచంచలత్వం స్వాభావికం. కాని మన ఇంద్రియాలు చలించేవి గనుక ఆ చలనం ఆత్మతత్వం మీద ఆరోపించి అది చలిస్తుందని మనం భ్రమలో ఉన్నాం. అది పొరపాటని ఈ మంత్రం మొదట వివరించింది.
సకల జీవుల యెడల సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండాలని సందేశాన్ని అందించిన వచనం ఏది?
ఆ వచనం ఇది:
యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి
సర్వభూతేషుచాత్మానం తతో న విజుగుప్సతే
యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః
తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతః
ఈ రెండు మంత్రాలు (6, 7) ఈ ఉపనిషత్తుకి గుండెకాయ వంటివి. వీటి అర్థం ఇది:
"ఎవ్వడైతే ప్రపంచంలోని అన్ని ప్రాణులను ఆత్మస్వరూపుడగు తనలో చూచుచున్నాడో, అలాగే అన్ని ప్రాణులలోను ఆత్మ స్వరూపుడగు తనను చూచుచున్నాడో అతడు ఎవ్వరినీ ద్వేషించడు. అలాగే బ్రహ్మజ్ఞాని అయినవాడు, సర్వాంతరాత్మగా ఉన్నది ఆ పరమేశ్వరుడే అని గుర్తెరిగి తనకు ఇతరులకు మధ్య భేద భావం పరిత్యజిస్తాడు. అలాంటి వానికి శోకం గాని, మొహం గాని ఉండవు"
వివరణ:
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది భేద భావమే. ఇది తొలగినపుడు వివాదాలకు, యుద్ధాలకు, ఉగ్రవాదానికి తావెక్కడుంటుంది? మత ఛాందస వాదం ఎక్కడ ఉంటుంది? సర్వ మానవ సమానత్వం అన్నది అందరిలో నున్న పరమాత్మ ఒక్కడే అన్న ఉపనిషత్సూక్తిని గ్రహించిన వాళ్లలోనే కలుగుతుంది.
ఉపనిషత్సారం హిందువుల రక్తంలో ఉంది గనుక ఎన్నడూ మనం ఇతర దేశాల మీదకి దండయాత్ర చెయ్యలేదు. అంటే కాక ఇతర దేశాల నుండి వచ్చిన అన్యమతస్తులకు ఆశ్రయం కూడా భారతదేశం కలిగించింది.
ఈశావాస్యోపనిషత్తు అందించిన సమన్వయ సిద్ధాంతం ఏమిటి?
ఏకాగ్రత సంపాదించి దేవతాజ్ఞానాన్ని అభ్యసించాలని పతిపాదించింది. అలాగే భక్తీ, జ్ఞాన మార్గాలను విడివిడిగా కాక సమన్వయము చేసి ఆచరించాలని భోధించింది. భార్య, పుత్రులు, సంపద - వీటి మీద వ్యామోహం వదలాలని ఉపదేశించింది. దీనిని ఏషణాత్రయ పరిత్యాగం అంటారు, అలాగే సమాజ ప్రగతికి ప్రవ్రుత్తి మార్గంలోనూ, ఆత్మోధరణకు నివృత్తి మార్గంలో నిస్సంగంగాను ఉంటూ, ప్రవ్రుత్తి, నివృత్తి మార్గాల సమన్వయం పాటించాలి అని ఉపదేశించింది.
ఇలా ఆధ్యాత్మిక జీవనం, లౌకిక జీవనం పరస్పర విరుద్ధాలు కావని, వీటిని చక్కగా సమన్వయము చేసి పరిపూర్ణమైన జీవనం సాగించవచ్చుననే సమన్వయ దృక్పథాన్ని ఈ ఉపనిషత్తు ఆవిష్కరిస్తుంది.
ఈశావాస్యోపనిషత్తులోని చివరి ప్రార్థన ఏమిటి?
ఈ ఉపనిషత్తులోని చివరి ప్రార్థనా మంత్రము -
అగ్నే నయ సుపథా రాయే అస్మాన్
విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోధ్యస్మజ్జుహురాణమేనో
భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ
అగ్నిదేవా! మమ్ము సరైన మార్గంలో, భాగ్యవంతులమగునట్లుగా నడిపింపుము. నీవు అన్ని మార్గములను తెలిసినవాడవు. పాపము మమ్ములను చేరకుండునట్లుగా చేయుము. నీకు అనేక ప్రార్థనా నమస్కారములను సమర్పించుచున్నాము.

సకల ఆర్థిక ఒడిదుడుకులనుండి, వ్యాపార సంబంధమైన సమస్యలనుండి రక్షించి ప్రజలలో మంచి గుర్తింపును & గౌరవాన్ని ప్రసాదించే"శ్రీ భువనేశ్వరీ అమ్మవారు"


సకల ఆర్థిక ఒడిదుడుకులనుండి, వ్యాపార సంబంధమైన సమస్యలనుండి రక్షించి ప్రజలలో మంచి గుర్తింపును & గౌరవాన్ని ప్రసాదించే

"శ్రీ భువనేశ్వరీ అమ్మవారు"

జ్యోతిర్మాలాం త్రిణేత్రాం వివిధ మణిలసత్ కుండలాం పద్మసంస్థామ్ ।
ఆద్యాం పాశాంకుశాభాం అభయవరకరాం భావయేత్ భువనేశీమ్ ।

ప్రతి నిత్యం పై మూర్తిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన వ్యాపార సంబంధమైన దోషములు తొలగునని శాస్త్రవచనము.
ప్రతి గృహము యందు లేదా వ్యాపారస్థలములయందు ఈ మూర్తిని తూర్పు దిశలో పడమర ముఖముగా ఉంచి ఆరాధించిన త్వరితముగా వ్యాపారాదులలో అభివృద్ధి & ప్రజల మన్నత & సేవకుల అనుకూల సహకారములు కలుగునని శాస్త్రవచనము.
మీ
యల్.యస్.సిద్ధాన్తి

శీఘ్రముగా (పురుషులకు) వివాహ యోగమును ప్రసాదించే "శ్రీ కౌమారీ అమ్మవారు"

వివాహ ఆటంక సంబంధమైన సమస్యలను తొలగించి అత్యంత శీఘ్రముగా (పురుషులకు) వివాహ యోగమును ప్రసాదించే

"శ్రీ కౌమారీ అమ్మవారు"

షడాననాతు కౌమారీ పాటలాభా సుశీలకా ।
రవిబాహుః మయూరస్థా వరదా శక్తిధారిణీ ।

ప్రతి నిత్యం పై మూర్తిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన (పురుషులకు) వివాహ సంబంధమైన దోషములు తొలగునని శాస్త్రవచనము.
ప్రతి గృహముయందు, నివాస స్థలములయందు ఈ మూర్తిని దక్షిణ దిశలో ఉత్తర ముఖముగా ఉంచి ఎర్ర గన్నేరు పుష్పములతో ఆరాధించిన త్వరితముగా దోషాదులు తొలగి వివాహ అనుకూలత కలుగునని శాస్త్రవచనము.
మీ
యల్.యస్.సిద్ధాన్తి —

శీఘ్రముగా (స్త్రీలకు) "వివాహ యోగమును", "దీర్ఘ సౌభాగ్యమును" ప్రసాదించే "శ్రీ ఇంద్రాణీ అమ్మవారు"



వివాహ ఆటంక సంబంధమైన సమస్యలను తొలగించి అత్యంత శీఘ్రముగా (స్త్రీలకు) "వివాహ యోగమును", "దీర్ఘ సౌభాగ్యమును" ప్రసాదించే

"శ్రీ ఇంద్రాణీ అమ్మవారు"

ఐంద్రీ సహస్రదృక్ సౌమ్యా హేమాభా గజ సంస్థితా ।
వరదా అభయం దేవీ సౌభాగ్యం దేహిమే సదా ।।

ప్రతి నిత్యం పై మూర్తిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన (స్త్రీలకు) వివాహ సంబంధమైన దోషములు తొలగునని శాస్త్రవచనము.
ప్రతి గృహముయందు, నివాస స్థలములయందు ఈ మూర్తిని వాయవ్య దిశలో ఆగ్నేయ ముఖముగా ఉంచి మందార పుష్పములతో ఆరాధించిన త్వరితముగా దోషాదులు తొలగి వివాహ అనుకూలత, దీర్ఘ సౌభాగ్యము కలుగునని శాస్త్రవచనము.
మీ
యల్.యస్.సిద్ధాన్తి
































http://www.remedyspot.com/news/health-and-ayurveda/cow-urine-can-cure-many-diseases-r5

కేనోపనిషత్తు

జాజి శర్మ

కేనోపనిషత్తు

కేనోపనిషత్తు ఏ వేదంలో, ఎక్కడ ఉంది?

కేనోపనిషత్తు సామవేదంలోని తలవకార బ్రాహ్మణంలో అంతర్భాగంగా ఉంది. అందుచేత దానికి తలవకారోపనిషత్తనే నామాంతరం కూడా ఉంది.

కేనోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది? ఇందులో ఎన్ని మంత్రాలు ఉన్నాయి?

"కేన" అనే పదంతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అవడం చేత కేనోపనిషత్తు అనే పేరు వచ్చింది.
నాలుగు భాగాలలో విభజింపబడిన ఈ ఉపనిషత్తులో 35 మంత్రాలు ఉన్నాయి.
కేనోపనిషత్తులోని శాంతి వాక్యం దేనితో ప్రారంభమవుతుంది?
"ఆప్యాయంతు మమాంగాని" నా జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఆరోగ్యంగా ఉంచమని పరమాత్మను ప్రార్ధించడంతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది.
మానవులలోనే గాక స్థావర జంగమాలన్నింటి లోనూ ఆత్మ ఉన్నదని వేదాంతం చెప్తుంది.

 అలాంటప్పుడు మోక్షం మానవునికొక్కనికే ఎందుకు సాధ్యం?

మానవునిలో మాత్రమె మనో బుద్ధ్యహంకారాలున్నాయి. వాటి ద్వారానే మోక్షం సాధ్యం. అవి ప్రకాశించాలంటే ఆరోగ్యమైన, దృఢమైన శరీరం అవసరం గనుక ఈ ప్రార్థన. వేదాంతం శరీరాన్ని ఉపేక్ష చేయమని చెప్పదు; శరీరమే అంతా అనుకోకూడదని అంటుందంతే.
కేనోపనిషత్తులోని మొదటి మంత్రం ఏమిటి? అందులో ప్రస్తావించబడిన ప్రశ్నలేమిటి?
కేనోపనిషత్తు లోని మొదటి మంత్రం -
కేనేషితం పతతి ప్రేషితం మనః
కేన ప్రాణః ప్రథమః ప్రైతి యుక్తః
కేనేషితాం వాచమిమాం వదన్తి
చక్షుః శ్రోత్రం క ఉ దేవోయునక్తి
మనస్సు అనేక విషయాలను గురించి ఆలోచిస్తుంది. ఎవ్వని చేత ప్రేరేపింపబడి మనస్సు ఆయా విషయాలలో ప్రవర్తిస్తుంది? అన్నింటి కంటే శ్రేష్టమైనది ప్రాణం. అది ఎవని చేత ఆజ్ఞాపింపబడి తన పనిని తాను చేసుకుపోతుంది? అలాగే మానవులు ఎవరిచేత ప్రేరేపింపబడి మాట్లాడుతున్నారు? కన్ను, చెవి, ఏ శక్తి చే నియంత్రించబడి వాటి పనులు చేసుకుపోతున్నాయి?
పైన ప్రస్తావించబడిన ప్రశ్నలకు సమాధానంగా ఈ ఉపనిషత్తు ఏమి చెప్తుంది?
జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు జడమైనవి. అందుచేత వాటికి క్రియాశక్తి ఉండదు. కేవలం పనిముట్లు వంటివి. పనివాడు వెనకాల ఉండి పనిముట్ల చేత పని చేయిస్తాడు. పనివాడు చైతన్యవంతుడు. అలాంటి చైతన్య శక్తి వల్లే ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఆ చైతన్య శక్తి ఏది అన్నది వేదాంతంలో మౌళికమైన ప్రశ్న. ఆ చైతన్య శక్తే ఆత్మ అని ఈ ఉపనిషత్తు చెప్తుంది.
ఆత్మ చేతనంగా ఉండి ఇంద్రియాల చేత తన శక్తితో పనిచేయిస్తుందంటే, ఇవన్నీ ఇలా పనిచెయ్యాలనే ఇచ్ఛ ఆత్మకు ఉందా?
లేదంటుందీ ఉపనిషత్తు. వాటికి దగ్గరగా ఉండడం వల్ల శక్తినిస్తుంది తప్ప అవి ఎలా పని చెయ్యాలి, ఒక మానవుని ప్రవర్తన ఎలా ఉండాలనేది ఆ మానవుని పూర్వజన్మ వాసనల మీద ఆధారపడి ఉంటుందని, ఆత్మ 'సాక్షి' మాత్రమేనని ఈ ఉపనిషత్తు ప్రతిపాదిస్తుంది.
ఇంద్రియాలకు అగోచరమైన ఆత్మను మనో బుద్ధులతో తెలుసుకోగలమా?
అసాధ్యం అంటుందీ ఉపనిషత్తు. శాస్త్ర జ్ఞానంతో కూడా అసాధ్యం అంటుంది. ఏకాగ్రతతో ధ్యానం చేసి బ్రహ్మసాక్షాత్కారం చేసుకోవాలని బోధిస్తుంది.
సరియైన జ్ఞాని ఎవరు?
తనకు ఏమీ తెలియదనుకున్న వాడే జ్ఞాని.
యస్యామతం తస్య మతం
మతం యస్య న వేద సః
అవిజ్ఞాతం విజానతాం
విజ్ఞాతమవిజానతామ్ (2,3)
ఎవరైతే తనకు తెలియదని అనుకుంటాడో అతనికి బ్రహ్మము తెలియును. కారణం అతనికి బ్రహ్మము ఇంద్రియ గోచరం కాదు, దానిని సమాధి నిష్ఠలో మాత్రమె తెలుసుకోగలమనే జ్ఞానం ఉంది గనుక. ఎవరైతే తనకు బ్రహ్మము తెలుసుననుకుంటాడో అతనికి బ్రహ్మము తెలియదు. దానికి కారణం బ్రహ్మము ఇంద్రియగోచరమనే భ్రమలో అతడు ఉన్నాడు గనుక.
పరమాత్మ సాక్షాత్కారానికి ఏమేమి సాధనాలు కావాలి?
తపస్సు, శమదమాది సద్గుణాలు సాధనాలుగా ఉండాలి.
తస్యై తపో దమః కర్మేతి ప్రతిష్ఠా వేదాః
సర్వాంగాని సత్యమాయతనం (4,8)
బ్రహ్మ సాక్షాత్కారానికి తపస్సు, శమ, దమాది సద్గుణ సంపత్తి, సత్యవ్రతం ముఖ్యమని వేదం ప్రతిపాదిస్తుంది. తపస్సు శరీరానికి క్రమ శిక్షణ నిస్తుంది. మనస్సుకు, ఇంద్రియాలకు ఏకాగ్రతను చేకూరుస్తుంది. శమదమాలు అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తాయి. ఇవన్నీ సత్య శోధనకు కావలసిన శారీరక, మానసిక, ఇంద్రియ నియంత్రణాలు.
చివరగా మనందరికీ జ్ఞానోదయం కలగడానికి ఈ ఉపనిషత్తులో చెప్పిన కథ ఏమిటి?
చివరగా మనందరికీ జ్ఞానోదయం కలగడానికి చెప్పిన కథ ఒకటుంది. రాక్షసులను జయించాం, మనకంటే గొప్పవాళ్ళు ఇంకెవ్వరు లేరని ఇంద్రుడు, అగ్ని, వాయువు మొదలైన దేవతలు అహంకరించారు. వారికొక పాఠం చెప్పడానికి వారి ముందర ఒక యక్షుడు నిలబడతాడు. అతని ముందర వీరి శక్తులేవీ పనిచెయ్యక భంగపడతారు. చివరకు ఆ వచ్చిన యక్షుడే పరబ్రహ్మమని, ఆయనే తమకున్న శక్తునలనన్నింటినీ ప్రకాశింప జేస్తున్నాడని జ్ఞానోదయం అవుతుంది.
ఈ దేవతలందరూ మన ఇంద్రియాలకు ప్రతీకలు. మన ఇంద్రియాలను పనిచేయించే శక్తి బ్రహ్మమని, అదే బ్రహ్మం మనలో జీవాత్మగా ప్రవేశిస్తుందని, అందుచేత మనకేదో స్వతంత్రమైన శక్తి ఉందని అహంకరించ కూడదనే సందేశంతో ఈ ఉపనిషత్తు ముగుస్తుంది.

Tuesday 22 July 2014

దైవము – లీలలు

జాజి శర్మ
దైవము – లీలలు
మనము చేసే పాపపుణ్యాలను బట్టీ దైవము ఫలితాలనిస్తుంది అని మన సనాతన ధర్మం బోధిస్తోంది.
వివరంగా చెప్పాలంటే,
మనం చేసే పాపపుణ్యాలు మూడు విభాగాలుగా ఉంటాయి
.ఒకటి
. అతిసామాన్య పుణ్యము అతిసామాన్య పాపము. .
రెండు
. సామాన్య పుణ్యము. సామాన్య పాపము.
మూడు
. అనన్య సామాన్య పుణ్యము. అతి ఘోర పాపము.
దైవము అతిసామాన్య పుణ్యములను , అతిసామాన్య పాపములను, కలలో అనుభవించేవిధముగా చేస్తుంది.
ఉదాహరణకు మనం బిక్షాటనకు వచ్చేవానికి దానం చేయలనుకుని జేబులో చెయ్యిపెట్టుకుంటే మనం అనుకున్న పైకం , జేబులో సమయానికి లేకపోతుంది. మనం మనస్సులో నొచ్చుకుంటాము. ఈలోపల మన ఎక్కవలసిన బస్సు వచ్చేస్తుంది
. మనం దానం చేయకుండానే ఇంటికి వెళ్ళిపోతాము.దానం చేయాలనే భావన రావడం కూడా ఒకరకమైన పుణ్యమే. కాని దానం చేయలేదు కాబట్టి ఇది అతిసామాన్య పుణ్యఖాతాలోనికి వెళుతుందన్నమాట.
ఇలాంటిఅతిసామాన్య పుణ్యాలను మనము కలలో ” ఏదో పదోన్నతి పొందినట్లో” అనుభవింపచేస్తుంది. అలాగే అతిసామాన్య పాపములు.
ఇఖ అనన్య సామాన్య పుణ్యములను , అతి ఘోరపాపములను ఈ జన్మలోనే అనుభవించేటట్లు చేస్తుంది. మనం ఎదో పెద్దయాగము చేశామనుకోండి
, దైవము ఆ ఫలితము ఈజన్మలోనే అనుభవింపచేస్తుంది. అలాగే అతి ఘోరపాపములు చేసేవారు కూడా ఈ జన్మలోనే దాని ఫలితము అనుభవించేటట్లు చేస్తుంది. సంఘములో అవినీతికి పాల్పడినవారిని ప్రభుత్వము, శాసనము శిక్షించడము ఈ కోవలోనికే వస్తుంది.
ఇఖ సామాన్య పుణ్యపాపములను దైవము ముందు జన్మలలో అనుభవింపచేస్తుంది
.ఈ సామాన్య పుణ్యఫలితము దైవం ప్రకృతి భీభస్తమములలో మీ పుణ్యఫలితమును ఉపయోగించి సృష్టిని కాపాడి మీ పుణ్యమును అనేక రెట్లు పెంచి మీకు కావలసిన సమయములో ఆ పుణ్య ఫలితమును అందిస్తుంది
అదేవిధముగ మనము చేసే పాపములను అనుభవించటానికి వలసిన ఓర్పును నేర్పును మనకు కాలక్రమేణా అందేటట్లు చేస్తుంది
కాబట్టి దైవలీలలను మనము ఓర్పుతో అర్ధము చేసుకుని , సహనము వహించి, దైవభక్తితో ఉండటము అలవాటు చేసుకోవాలి. దైవమును దూషించరాదు.
శ్రీరామాయణములో రాముని పట్టాభిషేకము రేపు అనగా , రాత్రికి రాత్రి ఘట్టములు సంభవించి శ్రీరాముడు అడవులకు వెళ్ళే పరిస్థితి దాపురిస్తే, లక్ష్మణస్వామి చలించిపోయి “అన్నయ్యా! నాకు అనుమతినిస్తే తండ్రిని ఎదిరించి, నీకు పట్టాభిషేకము చేస్తా! ఏమిటి! దైవము, దైవము అంటావు?” అని దైవదూషణకు దిగుతాడు. అప్పుడు శ్రీరాముడు ఎంతో ఓర్పుతో “లక్ష్మణా! దైవము నీకు కనబడితేకదా? నువ్వు దైవాన్ని ఎమైనా చేశేది?” అని వారించి లక్ష్మణస్వామిని దైవదూషణా పాపాన్నించి తప్పించి అడవులకు పయనమవుతాడు.
ఇక్కడ గమనించాల్సింది
,” కనపడని దైవాన్ని నిందించి ప్రయోజనము లేదు,దైవశాసనాన్ని పాలించడమే మానవకర్తవ్యం” అనే శ్రీరామవాక్యాన్ని.
కాబట్టి మనమందరం సదా మన మనస్సనే రాగి చెంబును మలినం కాకుండా భక్తి అనే చింతపండుతో ఎల్లప్పుడూ తోముతూ , నిరంతరము దైవచింతనతో ఉంటే మనస్సు నిర్మలంగా ఉండి, జీవితంలో కలిగే ఆటుపోటులకు కృంగిపోకుండా సాగిపోయేటట్లు,చేసుకోవాలి
. దానికి పూర్తిశరణాగతి ఒక్కటే మార్గము. భగవంతుని పాదములు మనస్సులో తలచుకుని, ఆయన పాదములు పట్టుకుని
, ” నేను నీశరణాగతుడను, నీపాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను. జన్మజన్మలలో నేను చేసిన పాపములు మన్నించి, నన్నురక్షించు, తండ్రీ,” అను ఆర్తితో ప్రార్ధించండి. ఆ ప్రార్ధనకు భగవంతుడు కరిగిపోయి, మీకు వెంటనే కావలిసినవన్నీ సమకూరుస్తాడు.
స్వస్తి
.

Friday 18 July 2014

కుటుంబ సంబంధమైన కలహములను తొలగించి అత్యంత శీఘ్రముగా కుటుంబ సఖ్యతను & బంధు సఖ్యతను ప్రసాదించే

కుటుంబ సంబంధమైన కలహములను తొలగించి అత్యంత శీఘ్రముగా కుటుంబ సఖ్యతను & బంధు సఖ్యతను ప్రసాదించే

"శ్రీ సౌభగ్యవాగీశ్వరీ అమ్మవారు"

తరుణ శకలమిందోః బిభ్రతీ శుభ్రకాంతిః ।
కుచభర నమితాంగీ సన్నిషణ్ణా సితాబ్జే ।
నిజ కర కమలోద్య ల్లేఖినీ పుస్తక శ్రీః ।
సకల విభవ సంఘైః పాతు వాగ్దేవతా నః ।।

ప్రతి నిత్యం పై మూర్తిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించినకుటుంబ సంబంధమైన కలహములు తొలగునని శాస్త్రవచనము.
ప్రతి గృహముయందు ఈ మూర్తిని ఇంటిలోపలి భాగములో ప్రధాన ద్వారమునకు పై భాగమున ఉంచి తెలుపు పుష్పములతో ఆరాధించిన త్వరితముగా కుటుంబ సంబంధమైన కలహములను తొలగి అత్యంత శీఘ్రముగా కుటుంబ సఖ్యత & బంధు సఖ్యత కలుగునని శాస్త్రవచనము.

 యల్.యస్.సిద్ధాన్తి —

Wednesday 16 July 2014

శరీరత్రయం (

జాజి శర్మ
సనాతన ధర్మ ప్రచార భారతి నుండి

శరీరత్రయం (3 శరీరాలు) = (1) స్ధూల శరీరం (2) సూక్ష్మ శరీరం (3) కారణ శరీరం
(1) స్ధూల శరీరం :- కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, ముక్కు చెవులు, చర్మం
(2) సూక్ష్మ శరీరం :- 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతఃకరణాలు - వీటితో కూడి ఉన్నది సూక్ష్మ శరీరం. దీనినే లింగ శరీరం అని కూడా అంటారు.

5 కర్మేంద్రియాలు : వాక్కు, కాళ్ళు, చేతులు, గుదము, జననేంద్రియాలు
5 జ్ఞానేంద్రియాలు : కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక
5 ప్రాణాలు : ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన
4 అంతఃకరణాలు : మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం

5+5+5+4 = 19

(3) కారణ శరీరం :- నీ నిజస్వరూపాన్ని (ఆత్మను) నీకు తెలియకుండా చేసేది అగ్రహణం, దేహేంద్రియాలే నేను అని విపరీతంగా భావించేట్లు చేసేది అన్యధాగ్రహణం - అజ్ఞానం. ఈ అజ్ఞానాన్నే కారణ శరీరం అన్నారు. ఈ స్ధూల, సూక్ష్మ శరీరాలు నీకు రావటానికి కారణమైనది ఈ కారణ శరీరం (అజ్ఞానం). ఈ అజ్ఞానం పోతే నీ సమస్త దుఃఖాలకు కారణమైన స్ధూల, సూక్ష్మ శరీరాలు ఇక రావు - జన్మలుండవు.

Saturday 12 July 2014

ఇంటి అలంకరణలో వాస్తు

 chilukaonline.wordpress.com

http://chilukaonline.wordpress.com/2013/02/08/%E0%B0%87%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%85%E0%B0%B2%E0%B0%82%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81/

        ఇంటి అలంకరణలో వాస్తు
ఇంటి నిర్మాణంలోనే కాదు ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో కూడా వాస్తును పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేసుకోవచ్చు. మనం ఉండే ఇంట్లో మనకు సానుకూలమైన దిక్కులు, ప్రతికూల దిక్కులూ ఉంటాయి. సానుకూలమైన వాటిని సాధ్యమైనంత తేలికగా ఉంచడం మంచిది. ఇంట్లో ఫర్నిచర్‌ సర్దుకునేప్పుడు భారీగా ఉండే దానిని ప్రతికూల ప్రాంతంలోనూ, తేలికపాటివి సానుకూల ప్రాంతాల్లోనూ సర్దుకోవడం మంచిది. ఈ నేపథ్యంలో ఇంటీరియర్స్‌- వాస్తుపై ఈ వారం…
Living-Room-Interior-Design
సాధారణంగా ప్రతికూల జోన్లు ఇం టికి దక్షిణంలో, పశ్చిమంలో, నైరుతిలో ఉంటాయి. కనుక ఇంట్లో సామాన్లు ఏవి ఎక్కడ సర్దుకుంటే మంచిదో వాస్తు శాస్తవ్రేత్తలు కొన్ని టిప్స్‌ ఇస్తున్నారు.
డ్రాయింగ్‌ రూంలో సోఫాను వేసేటప్పుడు దాని గదిలోని పడమర లేక దక్షిణ దిక్కులో వేసుకోవాలి. ఆ సోఫా లో కూర్చున్న వ్యక్తి తూర్పు లేక ఉత్తర ముఖంగా ఉండాలి.
బెడ్‌రూంలో మంచాన్ని నైరుతి మూలను వదిలేసి నైరుతి దక్కులో వేసుకోవాలి.
విలువైన నగలు, డబ్బు పెట్టే బీరువాలను నైరుతి దక్కుని వదిలి నైరుతిలోనే పెట్టుకోవాలి. దాని తలుపులు ఉత్తరముఖంగా ఉండేలా పెట్టుకోవాలి.
వంటింట్లో కానీ, డైనింగ్‌ హాల్లో కానీ డైనిం గ్‌ టేబుల్‌ వేసుకునేటప్పుడు దానిని గదికి వా యువ్య దిక్కులో ఉండేట్టుగా చూసుకోవాలి.
స్టడీ టేబుల్‌ను గదికి ఉత్తర లేదా తూర్పు దిక్కున వేసుకోవాలి.
అలాగే డ్రాయింగ్‌ రూంలో పెట్టుకునే అక్వేరియంను ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిక్కులలో పెట్టుకోవాలి. ఎందుకంటే అందు లో నీరు ఉంటుంది కనుక.. పైన పేర్కొన్న దిక్కులు నీటికి సంబంధించినవి కనుక.
పెయింటింగ్స్‌, శిల్పాలు: ఇంట్లో ప్రకృతి సహజమైన సూర్యోదయం, జలపాతం వంటి చిత్రాలు పెట్టుకోవడం మం చిదని వాస్తు చెప్తుంది. యుద్ధాలకు సంబంధిం చిన, హింసాత్మకంగా ఉండే చిత్రాలను ఇం ట్లో ఉంచకపోవడమే మంచిది. అలాగే బెడ్‌రూంలో దేవుని పటాలు పెట్టుకోకూడదు. చాలామంది వినాయకుడి బొమ్మలను డెకొరేటివ్‌ పీసులుగా వా డుతుంటారు. ఈ బొ మ్మలను దేవుని గది లేదా పూజ కోసం ప్ర త్యేకంగా నిర్దేశించిన స్థలంలో ఉంచడం మంచిది. అలాగే ఇం ట్లో ఏ గదిలోనైనా ఈశాన్యంలో భారీ శిల్పాలను పెట్టుకోక పోవడమే మంచిది.
bedroom
విద్యుత్‌ ఉపకరణాలు:ఇంట్లో మనం అనేక ఎలక్ట్రికల్‌ వస్తువులను వాడుతుంటాం. గ్యాస్‌, ఒవెన్లు, మైక్రోవేవ్‌ వంటివాటిని ఆగ్నేయంలో పెట్టుకోవాలి.
స్నానాల గదిలో గీజర్‌ను ఆగ్నేయ దిక్కులో పెట్టుకోవాలి.
కూలర్‌, ఎసి, ఫ్రిడ్జ్‌ వంటి వాటిని గదికి వాయువ్య దిక్కున ఉంచడం మంచిది.
టివిని ఉత్తరం లేదా తూర్పు లేదా ఆగ్నేయంలో పెట్టుకోవాలి.
విద్యుత్‌ ఉపకరణాలను ఈశాన్య దిక్కున పెట్టకుండా చూసుకోవడం మంచిది.
కర్టెన్లు:బెడ్‌రూంలో వేసుకునే కర్టెన్లు లేత రంగుల్లో ఉండేలా చూసుకోవాలి.
పడకగదిలో ఎరుపు, నలుపు రంగు కర్టెన్లను వాడకపోవడమే మంచిది.
ముందురు రంగు కర్టెన్లను లివింగ్‌ రూమ్‌లో వాడడం మంచిది.
అద్దం:అద్దాన్ని గదిలో ఉత్తరం లేదా తూర్పు గోడకు పెట్టుకోవడం మంచిదని వాస్తు చెబుతోంది.
స్టడీ రూంలోనూ, బెడ్‌రూంలో పడక ఎదుట అద్దం పెట్టకపోవడమే మంచిది.
ఇన్‌డోర్‌ ప్లాంట్స్‌: ఇంట్లో మొక్కలను పెట్టుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. అయితే మొక్కను ఎంచుకునేప్పుడు మాత్రం ముళ్ళగా ఉండే కాక్టస్‌ మొక్కలను ఎంచుకోవద్దని వాస్తు విద్వాంసులు చెప్తున్నారు. అలాగే ఇంటికి ఈశాన్య దిక్కులో పెద్ద మొక్కలను పెట్టుకోకపోవడమే మంచిది.
పెయింట్‌ :లేత రంగుల పెయింట్లు వాస్తు ప్రకారం మంచిది. లేత నీలం, ఆకుపచ్చ, పింక్‌, క్రీమ్‌ కలర్లను గదులకు వాడడం మంచిది. ఇరట్లో ఎరుపు, నలుపు రంగులను వాడకపోవడమే మంచిది.
ఫ్లోరింగ్‌:మొజాయిక్‌, సెరామిక్‌ టైల్‌, మార్బుల్‌ వంటివాటిని ఫ్లోరింగ్‌కు ఎంచుకోవడం మంచిది. గదులలో వైట్‌ మార్బుల్‌ను వేసుకోవద్దు. ఎందుకంటే దీనిని పవిత్రంగా భావిస్తారు. పూజ గదులలోను, ఆలయాలలోనూ దీనిని ఉపయోగించడం మంచిది.
సీలింగ్‌: ఫ్లాట్‌ సీలింగ్‌ ఆవాసాలకు మంచిది. అలాగే గది సీలింగ్‌ ఎత్తుగా ఉండకూడదు.
లైటింగ్‌: ఇంట్లో వెలుతురు ధారాళంగా ఉండాలి. ఇంట్లో మసక వెలుతురు ఉండడం అక్కడ నివసించే వారికి మంచిది కాదు.

సంపదను పెంచే వాస్తు

                        ఆధునిక కాలంలో అనేక సమస్యలకు కారణం డబ్బు అంటే అతిశయోక్తి కాదు. ఏ పని చేయాలన్నా ముందుగా కావలసింది డబ్బే అనే పరిస్థితి నేడు నెలకొని ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డబ్బును ఆదా చేయాలనుకుంటారు. అయితే ఎంత సంపాదించినా ఒక్క రూపాయని కూడా నిలుపుకోలేని పరిస్థితి కొందరి ఇళ్ళల్లో కనుపిస్తుంటుంది. అందుకు కారణాలు అనేకం. ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టకపోవడం, అనవసర ఖర్చులు చేయడం వంటివే కాక ఇంటికి సరైన వాస్తు లేకపోవడం కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తుంది అంటున్నారు వాస్తు నిపుణులు.
money-money
సంపాదించిన డబ్బును పొదుపు చేయడం లేదా మరింత డబ్బు సంపాదించాలనుకోవడానికి వాస్తు పరమైన మార్పులను కొన్నింటి ని సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం…ఇంటికి నైరుతి మూలను తమిళులు కుబేర స్థానమంటారు. ఇక్కడ ఎటువంటి సంప్‌ కా నీ, సెప్టిక్‌ టాంక్‌ కానీ బోర్‌వెల్‌ కానీ భూమిలోపల ఎటువంటి నిర్మాణం లేకుండా చూసుకోవడం వల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది.నగలు, ఇతర విలువైన పత్రాలు పెట్టే బీరువాలను, లాకర్లను వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. తూర్పు ముఖంగా తలుపు తెరుచుకునే పశ్చిమపుగోడకు వీటిని పెట్టడం మంచిది. లేదా తూర్పు లేదా ఉత్తర ముఖంగా తలుపు తెరుచుకునేలా నైరుతి మూల ఉంచాలి.
లాకర్లు ఉత్తర ముఖం తెరుచుకునేలా దక్షిణపు గోడకు పెట్టడం కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది. లాకర్‌ తలుపులు ఉత్తరముఖంగా తెరుచుకోవడం మంచిది. ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ దిక్కుకి కుబేరుడు అధిపతి. బీరువాను ఈశాన్య మూలలో ఎప్పుడూ పెట్టకూడదు. ఎందుకంటే దీనివల్ల సంపద నష్టం జరుగుతుంది. ఆగ్నేయ, వాయువ్య దిక్కులు కూడా మంచివి కావు ఎందుకంటే దీనివల్ల అనవసర ఖర్చులు అధికమవుతాయి. డబ్బులు పెట్టుకునే బీరువాను ఎప్పుడూ దూలం కింద ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఆర్థిక స్థిరత్వం మీద ఎక్కువ ఒత్తిడి పెడుతుంది.ఈశాన్య మూల కూడా సంపద వృద్ధికి తో డ్పడుతుంది. ఇంటికి ఈ మూలన సంప్‌, బోర్‌వెల్‌ లేదా బావి నిర్మిస్తే అభివృద్ధి, స్థిరత్వం వస్తాయి.
ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండకపోవడం లేక అది వృద్ధి జరగకపోవడం వంటివి ఎదుర్కొంటుంటే ఇంట్లో రాత్రంతా కనీసం ఒక దీపానై్ననా వెలగని స్తూ ఉండాలిట. ఎందుకంటే కాం తి కూడా ఒక రకమైన శక్తే. ఫెంగ్‌షూయ్‌ ప్రకారం దీన్ని యాంగ్‌ శక్తి అం టారు. ఇది చలనం తీసుకువస్తుంది.ఇంట్లో చేపల అక్వేరియం పెట్టుకోవడం సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండే చేపలను ఎం చుకొని ఇంటికి తెచ్చుకోవాలి. నీటిని శుభ్రం గా, గాలిపోయేలా ఉంచాలి. చేపలు అక్వేరియంలో తిరుగుతూ ఉంటే ఆ శక్తి ఇంట్లో సం పద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. దీ నిని గదిలో నైరుతి దిక్కున ఉంచడం మంచిది.
మీ అపార్ట్‌మెంట్‌ ముఖద్వారం పొడవైన కా రిడార్‌ చివర ఉన్నప్పుడు అక్కడ ప్రవహించే శ క్తి చాలా ఉధృతంగా ఉంటుంది. ఇది మీ ఆర్థిక పె ట్టుబడులకు రిస్క్‌ కాగలదు. దీనిని తగ్గించేందుకు కారిడార్‌ మధ్యలో అంటే దారికి అడ్డంగా కాదు గాని ఒక వైపు ఒక మొక్కను పె డితే ఆ ఉధృతి తగ్గుతుంది.
ఇంటి ముఖ ద్వారానికి మంచి రంగులు వేయడం ద్వారా సంపదను ఆహ్వానించవచ్చు. పక్కింటివారి గోడలకు, ముఖద్వారాలకు భిన్నంగా, ఆకర్షణీయమైన రంగులు వేసుకోమంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా జీవితంలో ఆర్థికాంశాల పట్ల మరింత స్పష్టత కావాలనుకున్నప్పుడు మీ ఇం ట్లో గాజు వస్తువులను ఒకసారి పరిశీలించండి.
ముఖ్యంగా ఇంటికి గాజు కిటికీ తలుపులు వుంటే అవి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. మురికిగా ఉన్న అద్దపు తలుపులు సంపదను లోనికి రానివ్వవట.కిటికీకి క్రిస్టల్స్‌ వేలాడదీయడం వల్ల శక్తి చురుకుగా ప్రవహిస్తుంది. సూర్యకిరణాలు వా టిని తాకినపుడు అవి రంగు రంగుల అద్భుత ఇంద్రధనస్సులను సృష్టిస్తాయి. నేరుగా సూర్యకిరణాలు ప్రసరించే కిటికీని ఎంచుకుని అక్క డ ఒక క్రిస్టల్‌ను వేలాడదీస్తే మీ కెరీర్‌ వృద్ధికి అది దోహదం చేస్తుందంటున్నారు.ఆదాయానికన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటే మొక్కలను కానీ విత్తనాలను కానీ టాయిలెట్లలో ఉంచాలి. ఇది ధన ప్రవాహం వృధా కావడాన్ని నిరోధిస్తుంది. ఎందుకంటే ఎదిగేవి ఏవైనా నీటి శక్తిని తిరిగి పీల్చుకొని రీసైకిల్‌ చేస్తుంటాయి.మీ క్యాష్‌ బాక్స్‌ను లేదా లాకర్‌ను ప్రతిఫలించేలా బీరువాలో ఒక అద్దాన్ని పెట్టండి.
ఇది మీ సంపదను సంకేతాత్మకంగా రెట్టింపు చేస్తుంది.ఇంట్లో అస్సలు డబ్బు నిలబడకుండా జీవితంలోంచే అదృశ్యమైపోతున్నట్టు అనిపించినపుడు ఇంటి ఎడమ మూలన బాగా బరువుగా ఉండే వస్తులను పెట్టండి. దానితో పాటుగా బాగా వెలుతురు వచ్చేలా చూడండి.సంపదను పెంచుకోవాలంటే ఆహ్లాదకరంగా నీరు పారే శబ్దం వినిపించేలా చిన్న ఫౌంటెన్‌ ఇంట్లో పెట్టుకోండి. అది డెస్క్‌ మీద పెట్టుకునేదైనా పర్లేదు. వాటర్‌ ఫౌంటెన్‌లా డబ్బును, సంపదను ఆకర్షించే శక్తి మరేదీ లేదు. నీరు పారే శబ్దం ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది.
 
ఫెంగ్‌షూయ్‌తో… జీవితం ప్రేమమయం…!
 
                 సామరస్యంతో జీవించడానికి, స్థిరత్వాన్ని సాధించడానికి ప్రాచీన శాస్త్రాలైన వాస్తు, ఫెంగ్‌షూయ్‌ కొన్ని ప్రాథమిక సూత్రాలను ప్రతిపాదించాయి. ప్రస్తుతం ఫెంగ్‌షూయ్‌ పట్ల నమ్మకాలు అన్ని చోట్లా పెరుగుతున్నాయి. వాస్తు శాస్త్రం జ్యోతిష్యాన్ని, ఖగోళ శాస్త్రాన్ని సమ్మిళితం చేసి సూచనలు చేస్తుంది. ఫెంగ్‌షూయ్‌ మాత్రం సామరస్యంతో, సంతోషంగా జీవితాన్ని గడపడానికి వివిధ శక్తులను సమతులం చేయడంపై దృష్టి పెడుతుంది. అయితే అటు వాస్తు ఇటు ఫెంగ్‌షూయ్‌ కూడా పంచభూతాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఏది ఏమైనా రెండింటి పరమార్థం మాత్రం మానవుడు సంతోషంగా, సామరస్యంగా, విజయవంతంగా జీవించడమే. ప్రస్తుతం ఫెంగ్‌షూయ్‌ ప్రపం చ వ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంటోంది. జీవితంలో అనేక కో ణాలపై ప్రభావం చూపే ఫెంగ్‌షూయ్‌ ప్రేమ విషయంలోనూ చూపుతుంది. ప్రేమ జీవితం మరింత మధురంగా చేసుకోవాలన్నా, ప్రేమను పెంచుకోవాలన్నా కొన్ని చిట్కాలు పాటించమ ని చెప్తున్నారు ఫెంగ్‌షూయ్‌ నిపుణులు.మీరు అవివాహితులైనా, జీవితంలో ప్రేమ పొందాలనుకున్నా, వివాహం అయ్యి ఇంకా మీ బంధాన్ని పటిష్ఠం చేసుకోవాలనుకున్నా మొదట చేయవలసిన పని ఇంట్లోని ప్రేమ, సంబంధాల దిక్కును గుర్తించి అక్కడ సానుకూల శక్తిని పెంచేందుకు ప్రయ త్నం చేయాలి. నైరుతి మూల లేక దిక్కు ప్రేమ నిసించే స్థలంగా చెప్పుకోవచ్చని ఫెంగ్‌షూయ్‌ చెప్తుంది.
నైరుతి మూలలో పెట్టిన చెత్తను వెంటనే తీసివేసి, విరిగిన వాటిని బాగు చేయించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రతికూల వైబ్రేషన్లను కలుగ చేస్తాయి. ఇంట్లో ఏ దిక్కున ఇటువంటివి చెత్త ఉన్నా తీసిపారేయడం మంచిది.ప్రేమను పెంచే దిక్కును ఎరుపు, పింకు, తెలుపు రంగులు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇవి అనుబంధాలను పెంచే రంగులు. అలా అని ఈ రంగులతో మీ గోడలను నింపి వేయక్కరలే దు. ఆ దిక్కున ఒక ఫ్ల వర్‌ వేజ్‌ ఉంచి రోజా రంగు పువ్వులను పెట్టుకోవచ్చు. అయితే అవి వడలిపోగానే తీసి వేసి తాజా వాటిని పెడుతుం డడం మంచిది. అలాగే ఇంట్లో కాక్టై లేక ఇతర ముళ్ళ ముక్కలను పెట్టుకోవడం మంచిది కాదు. ఇది కుటుంబ సభ్యుల మధ్య వాద ప్రతివాదనలను పెంచుతుంది. ప్రధ్వి అనే ది ప్రేమకు మూలకం అయినందు న చిన్న చిన్న గులకరాళ్ళను ఇంటి నైరుతి దిక్కున అలంకరిస్తే అదృష్టం వరిస్తుంది.
ఇంట్లో జంటగా ఉన్న పక్షులు లేదా మనుషుల ఫోటోలు, చిత్రాలు ఉంచడం మంచిది. ఇది ఆనందకరమైన సంసార జీవితానికి సంకేతం. జంట కొంగల లేదా డాల్ఫిన్స్‌ బొమ్మలను ఉంచుకోవడం మంచి సంకేతం. లేదా ఆనందంగా ఉన్న ఒక జంట లేదా ప్రేమ పక్షుల బొమ్మలు పెట్టుకున్నా పర్లేదు. ముఖ్యమైన విషయమేమిటంటే మీరు పెట్టుకునే బొమ్మ ఏదైనా జంటగా ఉండాలి, ఆనందంగా ఉండాలి.రాత్రి వేళలో సెంటెడ్‌ కాండిల్స్‌ను కొద్ది ని మిషాలు వెలిగించడం ద్వారా ప్రేమ పెరిగేందు కు దోహదం చేయవచ్చు. ఈ సెంటెడ్‌ కాండి ల్స్‌ కూడా ఎరుపు రంగువైతే మరీ మంచిది.
పడకగదిలో చేయవలసినవి,చేయకూడనివి..
మీ పడక గదిలో సానుకూల శక్తి ప్రవహించేలా సర్దుకోవాలి. చక్కగా విశ్రాంతి పొందేందుకు సంసిద్ధంగా ఉండాలి.
ఏ దిక్కు నుంచీ కూడా మీరు పడుకునే మంచం ప్రతిబింబించేలా గదిలో అద్దాన్ని పెట్టుకోరాదు. ఇది ప్రతికూల వైబ్రేషన్లను పెంచి వైవాహిక విచ్ఛిన్నానికి దారి తీసే అవకాశం ఉంటుంది.
అలాగే పడకగదిలో టివి పెట్టుకోవడం కూ డా మంచిది కాదు. ఇది కూడా అద్దం లాగే ప్రతికూల వస్తువు.
మంచాన్ని కిటికీకి కిందా తలుపు కు ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి. మూడు వైపుల నుంచి దిగేందుకు వీలుగా మంచాన్ని వేసుకోవాలి.
పడకగదికి బాత్‌రూమ్‌ అటాచ్డ్‌గా ఉంటే ఎప్పుడూ దాని తలుపు మూసే ఉంచాలి.
పడకగదిలో మొక్కలు, అక్వేరియం పెట్టుకోవడం మంచిది కాదు. ఎదిగే మొక్కలు, చురుకుగా తిరిగే చేపలు బెడ్‌రూంలో విశ్రాంతి వాతావరణంతో విబేధిస్తాయి.
మంచం కింద ఉండే అన్ని వస్తువులను తీసి వేయడం మంచిది. శక్తి నిరాటంకంగా ప్రవహించాలంటే ఆ ప్రదేశం పరిశుభ్రంగా, ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలి. ఇది వైవాహిక సంబంధాలకు మంచిది.
కిటికీ పక్కన పింక్‌ లేదా హృదయాకారం లో ఉన్న క్రిస్టల్స్‌ను తగిలించుకోవాలి లేదా ఒక పింక్‌ క్వార్ట్‌జ్‌ క్రిస్టల్‌ను వెలుగు పడేలా బల్ల మీద ఉంచాలి. తద్వారా అది ప్రేమకు సంబంధించి సానుకూల శక్తిని పెంచుతుంది.
వ్యాయామం చేసే పరికరాలు, కంప్యూటర్‌, పనికి సంబంధించిన ఇతర సామాగ్రిని పడక గదిలో నుంచి వేరే గదికి తరలించాలి. వాటిని బెడ్‌రూంలో ఉంచడం వల్ల మీ మధ్య సంబం ధాలు కూడా పనికి సంబంధించిన వాటిలానే అనిపిస్తాయి.
అలాగే సూది మొనలు కలిగిన ఫర్నిచర్‌ను బెడ్‌రూంలో ఉంచుకోకపోవడం మంచిది. ఇవి విషపు బాణాలలా పని చేస్తాయి. గుం డ్రటి అంచులు కలిగిన ఫర్నిచర్‌ ఉత్తమం.
 
 ఫెంగ్‌షూయ్‌తో.. అందమైన జీవితం
 
             మన పరిసరాలతో సరైన సామరస్యాన్ని సాధించేందుకు ఫెంగ్‌షూయ్‌ సాయపడుతుంది. భారతీయ వాస్తులాగే ఫెంగ్‌షూయ్‌ కూడా పురాతన శాస్త్రం కావడం, అది ప్రాణ శక్తి ఆధారంగా పనిచేయడమే కాదు ఆ శక్తి ఆరోగ్యవంతంగా ప్రవహించేందుకు దోహదపడుతుందని భావిస్తారు. ఈ ప్రాణశక్తినే చైనీయులు ‘చీ’ అంటారు. మనం ఉండే పరిసరాలు ఆరోగ్యవంతంగా, ఆహ్లాదంగా ఉండేందుకు ఫెంగ్‌షూయ్‌ తోడ్పడుతుంది. ఈ విషయాలన్నీ కొత్తవేమీ కాకపోయినప్పటికీ దానిని ఉపయోగించుకోవడం ఎలా అన్నది తెలుసుకోవడంలో అనౌచిత్యం మాత్రం కాదు. ఫెంగ్‌షూయ్‌ ప్రకారం అన్ని మూలలు, వసారాలు ప్రాణ శక్తిని నిర్వీర్యం చేస్తాయి. కనుక దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మూలల్లో బల్బులు పెట్టడమో లేదా మీకెంతో ఇష్టమైన పెయిం టింగ్‌ను అక్కడ తగిలించడమో చేయాలి. ఆ పెయింటింగ్‌ రంగు రంగులదైతే మరీ మంచిది.
మరొక మంచి సూచన ఏమిటంటే అక్కడ గుం డ్రటి ఆకులు గల చిన్న మొక్కను కుండీలో పెట్టి పెట్టడం మంచిది. అయితే ఆ ఆకులు సూది మొనలతో, ముళ్ళతో లేకుండా చూసుకోవాలి. డ్రాయింగ్‌ రూం పెద్దగా కనిపించడం కోసం అద్దాలను వాడుకోవడం మంచిది. అది విశాలంగా కనిపించేలా ఫర్నిచర్‌ను సర్దుకోవాలి.
డ్రాయింగ్‌ రూమ్‌లో అద్దాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వాటిని సరిగా పెట్టకపోతే ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది. అందుకే వాటిని ఏర్పాటు చేసే సమయంలో అవి మీకిష్టమైన వాటిని, మీరు పదే పదే చూడాలనుకునే వాటినీ ప్రతిఫలించేలా ఏర్పాటు చేసుకోండి. ఉదాహరణకు కిటికీలోంచి మీకిష్టమైన సీనరీని చూసేలా…
డ్రాయింగ్‌ రూంను అట్టహాసంగా ఏర్పాటు చేసుకుంటున్నామనే భావనతో కిక్కిరిసిపోయినట్టుగా ఫర్నిచర్‌ను పెట్టకూడదు. అలాగే టివిని లేదా సౌండ్‌ సిస్టంను ప్రముఖంగా పెట్టకూడదు. ఎందుకంటే టీవీ తాలూకు ఎలక్ట్రో మాగ్నెటిక్‌ తరంగాలు ప్రాణ శక్తి ప్రవాహానికి అడ్డు తగలవచ్చు.
ఫెంగ్‌షూయ్‌ అనేది స్ర్తీ, పురుష శక్తులను (యిన్‌, యాంగ్‌) సమతులం చేస్తుంది. కనుక డ్రాయింగ్‌ రూంలో మెత్తటటి కుషన్లను లేదా పువ్వులను పెట్టి దాన్ని మరింత ఫెమినైన్‌గా ఉం డేలా చూడాలి. అలా అని ఎండిపోయిన పువ్వుల ను పెట్టకూడదు. చైనీయుల సంప్రదాయం ప్రకారం ఇది మంచి శకునం కాదు.
డ్రాయింగ్‌ రూమ్‌ను ఎలా సర్దుకోవాలంటే అందులోకి ప్రవేశించగానే విశ్రాంత భావన పొందేలా చూసుకోవాలి. కనుక ఫర్నిచర్‌ను గోడలకు తగిలించి పెట్టడం కాకుం డా దాన్ని మధ్యలో గుండ్రంగా వచ్చేలా సర్దుకుంటే వచ్చిన అతిథులు కూడా సౌకర్యాన్ని పొందగలుగుతారు.
ఒకవేళ మరింత లో తుగా ఫెంగ్‌షూయ్‌ను ఉపయోగించాలనుకుంటే బా గువాను ఉపయోగించవచ్చు. అది ఎలా అంటే మీ ఇల్లు ఏ దిక్కున ఉన్నదో ముందుగా చూసుకోండి. తర్వాత దానిని మీ జీవితంలో కీలకమైన ఎనిమిది భాగాలుగా విభజించుకోండి.
మీకు రావలసిన అదనపు రాబడి ఎందుకు రావడం లేదో పరిశీలించుకోండి. మీ ఇంటి సౌభాగ్య స్థానంలో కాక్టస్‌ వంటి మొక్కలను పెట్టారేమో చూసుకోండి. మీరు ఎందులో ముందుకు పురోగమించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన మూలను కనుగొని అక్కడ ఒక చిన్న అక్వేరియంను ఏర్పాటు చేసుకోండి లేదా క్రిస్టల్స్‌ను లేదా విండ్‌ చైమ్స్‌ను పెట్టుకోవచ్చు.
ప్రాథమికంగా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ఇంట్లోకి ప్రవేశించే మార్గంలో చెత్తలేకుండా, కిక్కిరిసినట్టు సామాన్లు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ మార్గం ద్వారానే ప్రాణశక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కను క అక్కడ బాగా విశాలంగా, వెలు తురు వచ్చేలా చూసుకోవాలి. అలాగే ప్రధాన ద్వారం ఎదుట అద్దాన్ని పెట్టవ ద్దు. ఎందుకంటే ఇది ప్రాణశక్తిని బయటకు పంపేలా చేస్తుంది.
ఇక డ్రాయింగ్‌ రూంకు వేసే రంగులు లేతవిగా, ఆహ్లాదం కలిగించేవిగా ఉండాలి. పేసల్‌ కలర్స్‌ అద్భుతంగా ఉంటాయి. అలాగే డ్రాయింగ్‌ రూంలో తివాచీ పరిచేటప్పుడు కూడా దిక్కులను గమనించాలి. మీరు ఉండే ఇల్లు ఏ ముఖంగా ఉన్నదో దానిని బట్టి రంగును ఎంపిక చేసుకోవడం మంచిది. ఫెంగ్‌షూయ్‌ నిపుణులను సంప్రదిస్తే వారు సరిపోయే రంగులను సూచిస్తారు.
ఫెంగ్‌షూయ్‌ని నమ్మి నా నమ్మకపోయినా ఆరోగ్యవంతంగా జీవించాలంటే గదులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం. అలాగే గదులలో సామాను కిక్కిరిసినట్టు లేకుండా అందంగా సర్దుకోవడం వల్ల మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆర్భాటంగా ఉండాలన్న ఆసక్తితో పెద్ద పెద్ద ఫర్నిచర్‌ను తెచ్చి మనం ఎటూ కదిలే వెసులుబాటు లేకుండా సర్దుకోవడం వల్ల వచ్చేది చికాకు తప్ప మరింకేమీ కా దు. అక్కడక్కడ అద్దాలను పెట్టుకోవడం, చక్కటి చిట్టిపొట్టి చేపలను పెంచుకోవడం వంటివి చేయడం వల్ల ఇళ్ళు కళాత్మకంగా కనిపిస్తుందే తప్ప వాటిల్లే నష్టం ఏమీ ఉండదు. ఇక విండ్‌చైమ్స్‌ అంటారా? అది నమ్మకం లేనప్పుడు లేకపోయినా పర్లేదు. కానీ ఇంట్లోకి గాలి వెలుతురు బాగా ప్రసరిం చేలా సామాను అడ్డం పడకుండా, మూలల్లో చెత్తలేకుండా చూసుకోవడం మంచిది.
హేతుబద్ధంగా చూసుకున్నా మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే పరిసరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండాలి. అయితే వ్యక్తులు తమ జీవితాలను సుఖమయం చేసుకోవాలనే ఉద్దేశంతోనే పెద్దలు వాటిని సంప్రదాయాలుగా మలిచారు. ఇంటి ముందు ఊడ్చుకొని ముగ్గేసుకోవాలన్న దాని దగ్గర నుంచి ఇంట్లో చెత్త లేకుండా, సామాన్లు కిక్కిరిసి లేకుండా చూసుకోవాలనే మాట వరకూ అన్నింటి వెనుకా ఉన్నవి శాస్ర్తీయ కారణాలే. ఆ మాత్రం మనం గ్రహిస్తే మనకే మేలు. 
 
 
laughing-buddha-2
సంపదలిచ్చే.. లాఫింగ్‌ బుద్ధా….
ఫెంగ్‌షూయ్‌ వస్తువులలో అత్యంత ప్రాచుర్యం కలిగినది లాఫింగ్‌ బుద్ధా. అదృష్టం, సంపద కలిగేందుకు ఫెంగ్‌షూయ్‌ నిపుణులు ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోమని సూచిస్తుంటారు. లాఫింగ్‌ బుద్ధాను ‘హ్యాపీ బుద్ధ లేక మైత్రేయ’ అని కూడా అంటారు. హిందువులకు లక్ష్మీ దేవి వలె సంపదకు సంబంధించిన దేవునిగా ఆయనను కొలుస్తారు. ఇంట్లో ఈ విగ్రహాన్ని పెట్టుకుంటే సౌభాగ్యం, విజయం, ఆనందం కలుగుతాయని భావిస్తారు. వ్యాపారం చేసే వారు తమ కార్యాలయాల్లో పెట్టుకుంటే ఇది రాబడిని పెంచుతుందని భావిస్తారు. ఇది ప్రతికూల ప్రాణ శక్తిని హరించి సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుందని నమ్మకం. అందుకే ఇటీవలి కాలంలో ఈ విగ్రహం మనకు ప్రతి చోటా తారసపడుతోంది.
laughing-buddhaమనం ప్రేమించేవారికి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటే లాఫింగ్‌ బుద్ధను కొనిస్తే సరి. పెద్ద పొట్టతో హాయిగా నవ్వుతూ ఉండే బుద్ధుడు ఆయన. కుండలు పట్టుకుని లేదా వెనుకాల గోతం వేసుకొని ఉన్నట్టుగా ఈ విగ్రహాలు ఉంటాయి. ఇవన్నీ సంపదతో నిండి ఉంటాయని విశ్వా సం. అనంతమైన ఆనందం, ఓర్పు, దయ కలిగిన వాడే బుద్ధుడు. అన్ని కష్టాలను, సమస్యలను ఓర్చి వాటిని ఆనందం గా రూపాంతరం చెందిస్తాడని నమ్మకం. పిల్ల లు, పేదలు, బలహీనుల పక్షాన ఉంటాడని కూడా భావిస్తారు. ఈ విగ్రహాలు లోహం, టెర్రకోట, క్రిస్టల్స్‌ వంటివాటితో తయారు చేస్తారు. ఇవి రకరకాల పోజులలో కూడా ఉంటాయి. కానీ ప్రతి దానికీ ఒక ప్రాముఖ్యత ఉంటుంది.
పూ తాయ్‌గా పిలుచుకునే ఈ బుద్ధుడు వెయ్యి సంవత్సరాల క్రితం చైనాలో జీవించాడని ఒక నమ్మ కం. జపనీయులు ఆయనను హోతీ అం టారు. ఈ బుద్ధుడు లియాంగ్‌ వంశం చైనాను పాలిస్తున్న కా లంలో పూతాయ్‌ అనే సన్యాసి జీవించాడని ఒక కథనం. లావుగా, ముడతలు పడ్డ నుదురుతో, బానలాంటి పొట్ట తో అతడు ఉన్నట్టు స్కాలర్లు చెపుతుంటారు. అతడిని చూడగానే వెం టనే దృష్టి పడే మరో లక్షణం అతను ఒక గోతంతో కనుపిస్తాడు. అందులో పిల్లల కో సం మిఠాయిలు తీసుకువెళ్ళేవాడని జానపదుల కథనం. అతని జపమాల అదృష్టానికి చిహ్నం కాగా, పొడవుగా వేళ్ళాడుతున్న చెవు లు జ్ఞానానికి చిహ్నం.ఇక సంచీ కోరికలు తీరడానికి చిహ్నం లేదాబుద్ధుని ఆశీస్సులకు. ఈ లాఫింగ్‌ బుద్ధా ఇచ్చే అతి గొప్ప బహుమతులలో ఆనందం ఒకటి.
    ఈ ప్రపంచంలో మంచి జీవితాన్ని సాధించవచ్చనే బౌద్ధ సూత్రాలను ఇది ప్రతిఫలిస్తుంది. లాఫిం గ్‌ బుద్ధ లేక హాపీ హోతీ అనేక రూపాలలో దర్శనమిస్తాడు. లాఫింగ్‌ బుద్ధా పొట్టను రాయడం ఆనందాన్ని, అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని తెస్తుందని అనేకమంది భావన. చైనాలోని ఆలయాలలో ద్వారం వద్ద మన గణపతి విగ్ర హం వలెనే లాఫింగ్‌ బుద్ధా ప్రతిమ ను ప్రతిష్ఠిస్తారు. అదృష్టానికి, సౌ భాగ్యానికీ అధి దేవతగా పూజిస్తారు. తత్ఫలితంగానే ఫెంగ్‌షూయ్‌ లాఫింగ్‌ బుద్ధాను సంపదలకు, సౌభాగ్యాలకు ప్రతీకగా చెప్తుంది.
కాగా జపాన్‌లో అదృష్టాన్ని తెచ్చే ఏడుగురు షింటో దేవతలలో ఒకరిగా లాఫింగ్‌ బుద్ధాను పరిగణిస్తారు.
లాఫింగ్‌ బుద్ధ ఆఫ్‌ లవ్‌- ప్రేమ, దయ ఉట్టిపడేలా చూస్తూ కూచుని ఉన్న బుద్ధుడు.
లాఫింగ్‌ బుద్ధ ఫర్‌ ప్రాస్పరిటీ (సంపద)- ఒక కుండను లేదా బౌల్‌ను ఆకాశంలోకి ఎత్తిపట్టుకుని ఈ విశ్వం నుంచి అనంతమైన సంపదను అందుకుంటున్నట్టుగా ఉంటుంది.
సురక్షిత ప్రయాణానికి- ప్రయాణం చేసే సమయంలో భుజం మీద గోతం వేసుకున్న లాఫింగ్‌ బుద్ధాను దగ్గర పెట్టుకుంటే సజావుగా సాగుతుందని ఫెంగ్‌ షూయ్‌ నిపుణులు అంటారు.
ఇంట్లో సంతోషానికి- బలమైన పునాదికి సంకేతంగా ఒక పెద్ద బంగారు తిన్నె మీద కూర్చుని, మరొకరికి ఇచ్చేందుకు చేతిలో బంగారు ముద్దను పట్టుకుని ఉంటాడు.
ఆధ్యాత్మిక ప్రయాణానికి- ప్రయాణానికి సిద్ధమై, అవగాహన కోసం చేతిలో విసనకర్ర, అంతర్గత భావనలు పోగు చేసుకునేందుకు భుజం మీద గోతంతో ఉంటాడు.
సుదీర్ఘ జీవితానికి: తన టోపీతో కూర్చుని, ఆనందంగా కనుపించే లాఫింగ్‌ బుద్ధా ప్రతిమ.
లాఫింగ్‌ బుద్ధా ప్రతిమను కొనేటప్పుడు సా ద్యమైనంత పెద్దది కొనడం మంచిది. సంపద ను కోరుకునే వారు ఇతర ప్రతిమలను కాక కుండలో బంగారం ఉంచుకున్న లేదా భుజం పై సంచీ వేసుకున్న ప్రతిమను కొనుక్కోవడం మంచిది. కొన్న ప్రతిమను ద్వారానికి ఎదురు గా ముపె్ఫై అంగుళాల ఎత్తు మీద ఒక టేబుల్‌ మీద పెట్టుకోవాలి. ఆ విగ్రహాన్ని కింద పెట్టడమంటే అగౌరవపరచడమేననే భావన ఉంది.
విద్యార్ధులు మంచి ఫలితాల కోసం ఆ ప్రతిమను తమ టేబుల్‌పై ఉంచుకోవచ్చు.
ఆఫీసులో లేదా రిసెప్షన్‌ టేబుల్‌ మీద ఉంచడం వల్ల ఆదాయం బాగా ఉంటుంది. ఈ విగ్రహాలను దేవతా విగ్రహం వలే పూజించనవసరం లేదు. దాన్ని సరైన స్థలం లో ఉంచితే సరిపోతుంది. అయితే ఈ విగ్రహాలను బెడ్‌రూంలలోనూ, బాత్‌రూంలలో నూ, డైనింగ్‌ రూంలలోనూ పెట్టకపోవడమే మంచిదని ఫెంగ్‌షూయ్‌ నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాపార విజయానికి ఫెంగ్‌ షూయ్‌
 
        
house-offcieసాధారణంగా మనకు కలసిరానప్పుడు ఇంట్లో మార్పులు చేసుకుంటే సరిపోతుందనుకుంటారు చా మంది. కానీ అది నిజం కాదు. ఇంటితో పాటు మన వ్యాపకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సాధ్యమైనంతవరకూ మార్పులు చేసుకోగలిగితే మనం అనుకున్నది సాధించేందుకు కొంత అనుకూలత ఉంటుంది. వ్యాపారంలో విజయం సాధించడానికి దానికి సంబంధించిన కార్యాలయంలో మార్పులు చేసుకుంటే సరిపోతుందని ఫెంగ్‌షూయ్‌ చెప్తుంది. మన వ్యాపార విజయానికి, కార్యాలయంలో ప్రశాంతతకు చేయవలసినవి, చేయకూడని పనులు కొన్నింటిని సూచిస్తోంది.
నాయకత్వం వహించే వారు దానిని నిలుపుకోవాలంటే ముఖద్వారానికి ఐమూల గా కూర్చోవాలి. ద్వారానికి ఈ స్థానం సాధ్యమైనంత దూరంగా ఉండాలి.వ్యాపారం విజయవంతం కావాలంటే ము ఖ ద్వారం బయట పరిశుభ్రం గా ఉండడం అవసరం. ద్వారం బయట రక్షణ కోసం ఫూ డాగ్స్‌ లేదా లయన్స్‌ బొమ్మలను పెట్టుకోవచ్చు.ద్వారానికి ఎదురుగా కూర్చోవడం మంచిది కాదు. ఎందుకంటే ప్రతికూల శక్తి ప్రవహించే దారిలో మీరు కూర్చున్నట్టు అవుతుంది.కూర్చున్నప్పుడు వెనుక గోడ ఉండేలా చూసుకోవాలి. ఆ గోడకు మూల నుంచి ఏదైనా కొయ్య ముక్కలాంటిది ముందుకు పొడుచుకు వచ్చినట్టుగా ఉంటే దానికి ఒక చిన్న కుండీలో మొక్కను ఉంచి వేలాడదీయండి.
interior-house
మీరు కూర్చున్న కుర్చీ వెనుక ఒక పొడవాటి భవనం ఫోటో తగలించుకుంటే మంచిది. ఇది మీకు అండనిస్తుంది. వ్యాపారాన్ని నిర్వహించేవారు ద్వారానికి వీపు పెట్టి కూచోకూడదు. ఎందుకంటే వ్యాపార అవకాశాలు ద్వారం గుండానే వస్తాయి కనుక వాటికి వీపు పెట్టి కూర్చోకూడదు. ఏదైనా బహుళ అంతస్థుల భవనం లో కార్యాలయం ఉన్నప్పుడు కారిడార్‌కు లేదా మెట్లు లేదా స్టోర్‌ రూమ్‌లు, లిఫ్టులు, టాయిలెట్లు వంటివి వాటి ముఖంగా కూర్చోకూడదు.సృజనాత్మక శక్తి బాగా పెంపొందేందు కు కంప్యూటర్‌ను వాయువ్య దిశలో పెట్టుకోవాలి. ఆదాయం ఎక్కువగా లభించాలనుకునే వారు తమ కంప్యూటర్‌ను ఆగ్నేయ దిక్కున పెట్టుకోవాలి.
ఆఫీసులో తూర్పు ది క్కున లేదా ఉత్తరాన లే దా ఆగ్నేయ దిక్కున ఆక్వేరియంను లేదా టేబుల్‌ టాప్‌ ఫౌంటెన్‌ను పెట్టుకోవాలి. మీ డెస్క్‌కు ఉత్తరాన నలుపు లేదా నీలం రంగు చేపలు వేసిన చిన్న కుండీని పెట్టుకోవడం వల్ల లేదా కార్యాలయంలోనైనా సరే పెట్టడం వల్ల మీ వాణిజ్యం, కెరీర్‌ విజయవంతం అవుతాయి.పశ్చిమాన లేక వాయువ్య దిక్కున లోహం తో తయారు చేసిన సేఫ్‌ను పెట్టుకోవాలి. ఎం దుకంటే ఈ రెండు దిక్కు లూ లోహానికి సంకేతాలు. వ్యాపారంలో ఆర్ధిక భద్రతకు, సంపదకు సేఫ్‌ ఒక సంకేతం.
పని ప్రదేశాన్ని డెకొరేట్‌ చేసేటప్పుడు యిన్‌-యాం గ్‌లు రెండూ సమతులం గా ఉండేలా చూసుకోవా లి. లేత, ముదురు రంగులను సమతులం చేసుకోవాలి. అలాగే ప్రతి అలంకరణలోనూ రెండింటినీ సమతులం చేసుకోవడం అవసరం. అది కిటికీలకు సంబంధిం చిందైనా, ఫర్నిచర్‌కు సంబంధించి అయినా, ఫ్లోరింగ్‌కు సంబంధించింది అయినా.ఆఫీసులో అద్దాలు పెట్టుకోవడం మంచిది కాదు. ఇది క్లైంట్ల నుంచి వచ్చే ప్రతికూల శక్తిని ఆ గదిలో ఉన్నవారిపై ప్రతిఫలింప చేస్తుంది. కార్యాలయంలో శక్తిపై ఎప్పుడూ నియంత్రణ అవసరం.
మీ ఆఫీసులో ఫైళ్ళను గౌరవించాలి. ఎందుకంటే అవి వ్యాపార గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
కార్యాలయంలో వైర్లు వంటి వాటిని లోపలికి ఉండేలా చూసుకోవాలి. వైరింగ్‌ అంతా అంతర్గతంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల చెత్త పోయి ప్రాణాధార శక్తి ఎటువంటి ఆటంకాలూ లేకుండా ప్రవహిస్తుంది.కార్యాలయంలో లోహంతో చేసిన విండ్‌ చైమ్‌లను ఎర్రని రిబ్బన్‌తో కట్టడం ఎంతో మంచిది. ఇది మీ వ్యాపారంలోకి మరింత డబ్బు వచ్చి చేరేందుకు ఉపకరిస్తుంది. వీటిని ద్వారం వద్ద కానీ ఫెంగ్‌షూయ్‌ సంపద మూలలో కానీ కట్టవచ్చు.
అలాగే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించాలనే ఆకాంక్ష ఉన్నప్పుడు సంపద మూలన ఒక ప్రపంచ పటాన్ని తగిలించడం ఎంతో మేలు చేస్తుంది. లేదా ఒక గ్లోబ్‌ను పెట్టవచ్చు. దానితో పాటుగా మీరు విజయవంతంగా చేసిన ప్రాజెక్టు తాలూకు కాపీని లేదా ఒక పర్పుల్‌ కలర్‌ ఫోల్డర్‌పై బంగారు రంగు అక్షరాలతో మీ కంపెనీ పేరు లేదా లోగో ముద్రించి ఉన్నది పెట్టుకోవాలి.ముఖ ద్వారం బయట గుండ్రటి ఆకులు గల మొక్కలను పెట్టుకోవడం క్లైంట్లకు,ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలను పెంచుతుంది.
 
 
సౌభాగ్యంగా ‘గడప’ డానికి కావలసినదేది..?
 
 homeచారెడు పసుపు గడపకి పూసి గొబ్బిళ్లో…గొబ్బిళ్లో అంటూ హరిదాసులు పాటలు పాడుతూ…మన పల్లెటూళ్లలో మన సంప్రదాయాలను గొప్పగా కీర్తిస్తూ పాడే జానపదాలను వింటుంటే మన సు ఎక్కడికో వెళ్లిపోతుంది. పట్టణాలలో అపార్ట్‌మెంటుల సంస్కృతి పెల్లుబికి…ఆఖరుకు గదులు కూడా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే గదులు ఇరుకు పైగా వాటికి గడపలు కూడా ఎందుకు దండగ అనే పరిస్థితి వచ్చేసింది. కనీసం ప్రవేశ ద్వారాని కయినా గుమ్మాలు ఉండాలని పెద్దలు అంటారు. గడపకు పసు పు..గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటి శోభే వేరు. ఆయురా రోగ్యం సిద్ధించే గడప చేసే మేలును తెలుసుకుందాం….
ఏ గృహానికయినా గడపలు తప్పనిసరి. పల్లెటూళ్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వా రానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారా లు బిగించబడ వు. గడపలేని గృహం కడుపులేని దేహం లాంటిది. పెదాలు లేని నోరులాగే గడపలేని గృహాలు ఉండకూడదు.
అలంకరణలో భాగంగా…
గడప చాలా ప్రాధాన్యత కలిగినది. ఇంట్లో ఆయా గదులకు గడపలు లేకున్నా సరేకానీ తప్పనిసరిగా గృహం సింహద్వారా నికి గడప నిర్మించుకోవాలి. గడప ఉన్నప్పుడే ఆ గడపని శుద్ధిచేసుకుంటూ ఉంటాం. ఆ గడపను పసుపు, కుంకుమ లతో, బియ్యంపిండితో అలంక రించుకుంటూ ఉంటాం. మన సంస్కృతంలో ప్రధానమైన భాగం గడపకి అలంకరణం. పసుపులో యాంటీబయటిక్‌ గుణం ఉంది. అందుకని సాధా రణంగా మనం ఆయా వీధుల గుండా అనేక పరిసరాలలో సంచరించి ఎన్నో లక్షల బ్యాక్టీరి యాలను మన చెప్పు లకు,మన కాళ్లకు అంటించుకుని గృహం లోకి ప్రవేశిస్తుంటాము.
యాంటీ బ్యాక్టీరియా…
ఉదయాన్నే పసుపు నీళ్లతో శుద్ధిచేసినటు వంటి ఆ గడపలోకి అంతకన్నా ముందు చక్కని ఆవుపేడతో కల్లాపి చల్లినటువంటి వాకిళ్లలోకి మనం అడుగుపెట్టినప్పటినుంచి మన కాళ్లను ఈ ఆవుపేడలో ఉండే యాంటి బయటిక్‌, గడపకు ఉండే పసుపు అలంకర ణలు మనకు తెలియకుండానే మన కాళ్లను శుద్ధిచేస్తాయి. అనేక లక్షల సూక్ష్మజీవులను మన కాళ్లనుండి దూరం చేస్తాయి.
ఇంటికి శ్రీరామరక్ష…
్ఞఅందుకనే ఆ గడపకి పసుపు, కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు. దీని లోని ప్రాధాన్యత ఏమి టంటే…. రోగాలను దరిచేయనీయకుండా మన గూటిని అపరిశు భ్రతకు తావులేకుండా ఉంచుకోవడానికే ఇంటి కి గడప ఉండాలంటారు మన పెద్దలు. అయితే తప్పనిసరిగా గృహం యొక్క అన్ని ద్వారాలకు గడపలు ఉండాల్సిన అవసరం ఉంది. ఐతే కొన్ని సాధ్యం కాని పరిస్థితి లో మిగతా గదుల కు లేకున్నా…సింహద్వా రపు గుమ్మానికి తప్ప నిసరిగా గడప ఉండ వలెను. అంతేగాదు ప్రతిరోజూ…ఆ గడపను శుద్ధిచేసు కోవాలి. అప్పుడే ఆ ఇంటికి గడప శ్రీరామ రక్ష.
మనం ఒక కొత్త ఇంట్లోకి షిఫ్ట్‌ అవుతు న్నాం… అప్పుడు పాత ఇంట్లో ఉన్న సోఫాల ని, బీరువాలని, డైనింగ్‌ టేబుల్‌ లాంటి వాటిని తీసుకుపోతాం. కొత్త ఇంట్లో కొత్త వస్తువుల్ని కొనుక్కుని జీవించాలనే నియమం ఎలాగైతే లేదో పాత ఇల్లు కూల్చినపుడు ఆ టేకు ద్వారా లని, కిటికీలని చెడిపోకుండా ఉన్నవాటిని… నాణ్యత కలిగినటువంటివాటిని తీసుకుని కొత్త ఇంటికి నిర్మాణం చేసుకో వచ్చును. ఏ దోషమూ లేదు.
వాడుకోవడానికి అనుకూలంగా ఉంటే…
సూక్ష్మక్రిముల ద్వారా ఆయా కిటికీలు, ద్వారా లు రంధ్రాలుపడి లోపల బోలుగామారి చెడి పోయివుంటాయి. అలాంటివాటిని ఎలాగో వదిలేయాల్సివస్తుంది. కాబట్టి అలాంటి చక్క లు ఉంటే తీసిపారేసి కార్పెంటర్‌ సలహామేర కు వాటిని వాడుకోవచ్చు.
పునాదిరాళ్లను వాడుకోవచ్చు…
కర్రవస్తువులు ఎక్కువగా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. వాటిని కొత్త ఇంటి నిర్మాణానికి వాడుకోవచ్చు. పునాది రాళ్లను కూడా వాడుకోవచ్చు. దోషమనేది ఉన్నది అం టే ఆ గృహ నిర్మాణ పద్ధతులను బట్టి వుం టుంది. ఈశాన్యం తెగిపోయినట్లుగానో… ఆగ్నేయంలో గొయ్యిని పెట్టో, నైరుతిలో ద్వా రాలు పెట్టో రకరకాల నిర్మాణ శైలి ద్వారా నో… ఆ గృహంలో అశుభాలు కలుగు తాయే తప్ప గృహానికి ఉపకరించే వస్తు సామాగ్రి, రాళ్లు తదితర సామాగ్రి ద్వారా జరగదు.
విరిగిపోయిన ఇటుకలు వాడద్దు…
అలాగే నాణ్యమైన పాత ద్వారాల ద్వారా ఏరకమైన అశు భం జరగదు. అయితే పాత ఇంటికి సం బంధించి ఇటుక లు మాత్రం పనికి రావు. కొంత మంది ఇళ్లు కూలగొట్టి… ఇటు కలను అన్నీ కలిపి పేర్చు కుంటుం టారు. ఆ ఇటుకలతో ఒక సవ్యమైన స్థితిలో గోడలు రావు. కాబట్టి పాత ఇంటి రాళ్లను, పాత ఇంటి కర్ర సామాగ్రిని, పాత ఇంటి చెడిపోని వస్తు సామాగ్రిని నూతన ఇంటి నిర్మాణానికి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ను. అందులో ఎటువంటి దోషమూ లేదు.
 
 
 ఇంటి అలంకరణా కళే…
 
నగరాలలో అగ్గిపెట్టెల వంటి గదులున్న ఇళ్ళలో జీవనం సాగించడం సర్వసాధారణం అయిపోయింది. కనీసం గజం జాగా దొరకని పరిస్థితుల్లో ఉన్న చోటుతోనే సరిపెట్టుకొని జీవించాల్సి వస్తున్నది. అంత చిన్న గదులలోని వసిస్తున్నా అవి విశాలంగా కనుపించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం మరీ ఇరుక్కుని ఉంటున్న భావన కలుగదు. అంతేకాదు మనసుకు కూడా హాయిగా ఉంటుంది.           ఇంటిని విశాలంగా ఉన్నట్టు తీర్చిదిద్దుకోవడానికి కొన్ని టిప్స్‌ ఉన్నాయి. వాటిని పా టిస్తే మనం అగ్గిపెట్టెల్లో నివసిస్తున్నామనే భావ న కలుగదు. అవేంటో చూద్దాం..నేల కనిపించాలి.. మనకు గదిలో నేల ఎం త ఎక్కువగా కనిపిస్తే గది అంత విశాలంగా ఉన్నట్టుతోస్తుంది. అలా ఉండ డం కోసం గది లో ఫర్నిచర్‌ను గోడలకు పెట్టడం ఒక మా ర్గం. తద్వారా అటూ ఇటూ తిరిగేందుకు చో టు విశాలంగా ఉంటుంది. గ ది ఒక మాదిరి పెద్దగా ఉంటే సోఫా వంటి ఫ ర్నిచర్‌ను ఒక కో ణంలో పెట్టడం ద్వారా ఆ గ ది పొడుగ్గా ఉన్న భావన కలుగుతుంది. అంతేకాదు, ఒక మూ ల చోటును సృష్టించినట్టవుతుంది. ఫర్నిచర్‌ను ఎంచుకునేటప్పుడు.. ఫర్నిచర్‌ను ఎంచుకునేటప్పుడు అది బహువిధాలుగా పనికి వచ్చేలా ఉండేదిగా చూసుకోండి.
    టివి స్టాండ్‌ తీసుకునేటప్పుడు సొరుగులు ఉ న్న దానిని తీసుకుంటే డివిడిలు, పుస్తకాలు వా టిలో దాచవచ్చు. అలాగే సోఫా కం బెడ్‌ వంటి వాటిని ఎంచుకోవడం వల్ల అవి బహుళార్థ ప్ర యోజనాలను ఇస్తాయి. ప్రస్తుతం మార్కెట్లలో బహుళార్థ ప్రయోజనాలనిచ్చే బెంచిలు దొరుకుతున్నాయి. స్టోర్‌ చేసుకునేందుకు, కాఫీ టేబుల్‌గా ఉపయోగించేందుకు, అదనంగా కూర్చోవడానికి ఇవి ప్రయోజనకరంగా ఉంటున్నాయి. స్టైల్‌గా కనిపించే ఒక్క పీస్‌లోనే ఇవన్నీ ఇమిడి ఉంటాయి.తలుపులను, గోడలను ఉపయోగించాలి… గదిలో ఎక్కడ పడితే అక్కడ పేపర్లు, చెప్పులు వంటివి పెట్టుకోవడం వల్ల కిక్కిరిసినట్టుగా కనుపిస్తుంది. కనుక గోడకు ఫిక్స్‌ చేసుకునే షూరాక్‌లను, మ్యాగజైన్‌ రాక్‌లను పెట్టుకోవడం వల్ల వాటన్నింటినీ గోడల మీదకి ఎక్కించేయవచ్చు. తద్వారా గదిలో చోటు ఏర్పడుతుంది.
      ఒకటే రంగు ఉపయోగించాలి.. గదిలో పె యింటింగ్‌ వేసేటప్పుడు రెండు మూడు రంగులను ఉపయోగించడం కన్నా ఒకటే రంగును ఉపయోగించడం మంచిది. సాధ్యమైనంతవర కూ లేతరంగులను వేసి, అదే రంగులలో ఫర్నిచర్‌ను తీసుకోవడం వల్ల గది విశాలంగా ఉన్న ట్టు కనపడుతుంది. లేతరంగు గోడలకు వేసి ముదురు రంగు ఫర్నిచర్‌ వాడితే అవి కొట్టచ్చినట్టుగా కనిపిస్తూ గదిలో చోటును మింగేసిన ట్టుంటాయి. అలాగే కిటికీల నుంచి సాధ్యమైన ంత వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి.గదిలో వెలుతురు ఉండాలి.. సహజమైన వె లుతురు అయినా బల్బుల ద్వారా వచ్చే వెలుగై నా వెంటిలేషన్‌ బాగా ఉన్న గదులు పెద్దగా ఉ న్న భావనను కలిగిస్తాయి. వెంటిలేషన్‌ తక్కువగా ఉంటే విద్యుత్‌ లైట్లతోనే గది బ్రైట్‌గా ఉం డేలా చేసుకోవచ్చు. అందం కోసం రకరకాల లాంప్‌ షేడ్లు మనకు మార్కెట్లు లభ్యం అవుతున్నాయి.కాంతి ప్రతిఫలించేలా చూసుకోవాలి.. కాంతిని ప్రతిఫలింప చేసేవి అద్దాలు. కనుక లైటు అమర్చిన చోటుకు అభిముఖంగా అద్దా న్ని అమర్చుకోవడం వల్ల కాంతి దానిపై పడి ప్రతిఫలించి గదిలో మరింత వెలుతురు నింపుతుంది.
        కప్పుకు ముదురు రంగులు వద్దు… గదులు చిన్నగా ఉన్నప్పుడు కప్పుకు ముదురు రంగులు వేస్తే అవి మరింత చిన్నగా కనిపిస్తాయి. అంతకన్నా తెలుపు రంగు వేయడం వల్ల కప్పు ఎత్తుగా ఉన్న భావన రావడమే కా కుండా గదులు కాంతివంతంగా కనిపిస్తాయి. లేత క్రీమ్‌ లేదా నీలం రంగులు కూడా గదు లు విశాలంగా ఉన్న భావనను కలిగిస్తాయి.బెడ్‌ రూం… బెడ్‌రూంలు చిన్నగా ఉన్నప్పు డు కూడా పైన చెప్పిన సూత్రాలే వర్తిస్తాయి. ముఖ్యంగా ఆ గది విశ్రాంతి పొందేందుకు ఉ ద్దేశించిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని అ క్కడ అనవసర ఫర్నిచర్‌ చేర్చకుండా జాగ్రత్త లు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకూ వార్డ్‌రోబ్స్‌ వంటివి గోడలకే ఫిట్‌ చేయించుకోవడం మంచిది. అలాగే డ్రెస్సింగ్‌ టేబుల్‌ పెట్టి ఉన్న చోటును మింగేయకుండా గోడలకు అద్దాలను బిగించడం వల్ల గది కాస్త విశాలంగా ఉన్నట్టు కనుపిస్తుంది. అలాగే మంచంకన్నా పెద్దగా ఉండే వస్తువు ఏదీ ఆ గదిలో ఉండకూడదన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని దానిని సర్దుకోవాలి. బెడ్‌రూంలో గోడలకు అన్నీ తగిలించడం వల్ల కూడా గది చిన్నగా అనిపించే అవకాశమున్నందున గది గోడలను కూడా సాధ్యమైనంత ఖాళీగా ఉంచడం మంచిది.
      డైనింగ్‌ రూం… డైనింగ్‌ రూం పెద్దగా కనిపించాలంటే చేయాల్సింది టేబుల్‌ సైజ్‌ను చిన్నదిగా ఉంచడమే. చిన్న డైనింగ్‌ టేబుల్‌ లేదా మడిచిపెట్టుకునే అవకాశం ఉన్నదానిని ఉపయోగించడం వల్ల మాత్రమే ఆ గది విశాలం గా కనిపించగలదు. అలాగే మూల అల్మరాలో గాజు సామాన్లు పెట్టుకోవడం, అలాగే జాడీలు వంటి వాటిని పెట్టుకోవడం వల్ల గది ఇరుకుగా కనిపించదు.వంటగది.. వంటగది విశాలంగా కనిపించాలంటే ఆ గదిలో అల్మరాలు గోడలోపలకు పె ట్టుకోవడం సరైనది. తద్వారా అన్ని వస్తువుల ను వాటిలో పెట్టుకోవచ్చు. ఫ్రిజ్‌. ఒవెన్‌ వంటి వి కూడా పెట్టుకునేందుకు గోడలోనే అరలుగా ఏర్పరిస్తే గది విశాలంగా కనిపిస్తుంది. అలాగే వంట గట్టు కింద అరలు పెట్టుకోవడం వల్ల కూడా గది చిందరవందరగా కనిపించకుండా ఉంటుంది. ఈ మొత్తంలో తెలుసుకోవలసిన విషయమేమిటంటే ఇల్లు చిన్నగా ఉన్నప్పుడు భారీ ఫర్నిచర్‌ను, అధిక వస్తువులను ఇంట్లో ఉంచుకోకపో వడం మంచిది. సాధ్యమైనంత ఉన్న స్థలాన్ని తెలివిగా ఉపయోగించుకోవడమొక్కటే దారి.
  
ప్రశాంతతనిచ్చే పూజ గది
 
 ప్రతి కుటుంబానికీ మూల దైవం ఒకరు ఉం టారు. వారికి సంబంధించిన విగ్రహాలను, ఫోటోలను పెట్టి ప్రార్థన చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకునే వారు గతంలో. ప్రస్తుతం నగరాలలో ఉండటానికే చోటు కరువైన స్థితిలో దేవుడికి ప్రత్యేకంగా ఒక గదినే కేటాయించడం అన్నది సమస్యగా మారుతున్నది. అయినా దైవభక్తి అధికంగా ఉన్నవారు దేవుడికి ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలనే అనుకుంటారు. అటువంటి వారు.. వాస్తు ప్రకారం పూజ గదిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎలా చేయాలి? ఎందుకు అన్నది చూద్దాం…
puja-room
 
పూజ గదిని సాధ్యమైనంత వరకూ ఈశా న్య లేదా తూర్పు లేదా ఉత్తర దిక్కున ఏర్పా టు చేయాలి. దీనికి కారణం తెల్లవారు జాము నే సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉంటా డు. ఈ సమయంలో యోగ, ధాన్యం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి.అంతేకాదు, సూర్యుడి లేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. కనుక పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలంటే ఈశాన్య దిక్కును ఎంచుకోవడం మం చిది. పెద్ద స్థలం ఉన్నవారైతే ఇంటి మధ్యలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇంటి మధ్య భాగాన్ని గాలి, వెలుతురు సవ్యంగా పారేందుకు ఖా ళీగా ఉంచాలి. ఆ మధ్య ప్రదేశంలో పూజ గది ఏర్పాటు చేసుకోవచ్చు.
పూజ గదిని ఎప్పుడూ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేయాలి తప్ప బేస్‌మెంట్‌లో చేయకూడదు. దీనికి కారణం బేస్‌మెంట్‌లోకి వెలుతురు ప్రసరించదు. సూర్యుడి తొలి కిరణాల వల్ల లబ్ది పొందలేరు. అలాగే పూజ గదిని పై అంతస్థులలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉండాలి. ఇంట్లో పెద్ద వారు, కదలలేని వారు ఉంటే ఇది సమస్య అవుతుంది.
ఒకవేళ పూజగది ఏర్పాటు చేసుకోవడానికి స్థలం లేకపోతే వంటింట్లోనే ఈశాన్య దిక్కున పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అపార్ట్‌మెంట్లలో ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం కుదరదు కనుక ఇది ఉత్తమ పద్ధతి. అయితే పూజా మందిరాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడకగదులలో ఏ ర్పాటు చేసుకోకూడదు. దీనికి కారణం దేవు డి వైపు కాళ్ళు పెట్టి పడుకోవడానికో లేక దే వుడు ఉన్నాడనే భావనతోనో నిద్రించలేరు. అలాగే పూజగది బాత్‌రూంకు సమీపంలో లే కుండా చూసుకోవాలి. అక్కడి నుంచి వచ్చే శ బ్దాలు, వాసనలు వ్యక్తులను డిస్టర్బ్‌ చేస్తాయి.
ఒకవేళ ప్రత్యేకంగా పూజగదినే ఏర్పాటు చేసుకుంటే విగ్రహాలను ఎటు పెట్టుకోవాలన్నది చాలా మంది సందేహం. ఈ విగ్రహాలను ఈశా న్యం, తూర్పు లేదా పడమర దిక్కున పెట్టుకోవచ్చు. దీనికి కారణం ఉదయం సూర్య కిరణాలు ఈశాన్య, తూర్పు దిక్కు నుంచి ప్రసరిస్తాయి, సాయం వేళల్లో పడమర నుంచి ప్రసరిస్తాయి. కనుక ఇవి వి గ్రహాల మీద పడి మరింత భక్తి భావనను కలిగిస్తాయి. విగ్రహాలను ఉత్తర దిక్కు పెట్టకూడ దు. ఆ దిక్కున పెడితే ప్రార్థించే వారు దక్షిణ ముఖంగా కూర్చోవలసి వస్తుంది. అలా కూ చున్నప్పుడు వారి పాదాలు దక్షిణ దిక్కున, త ల ఉత్తరం దిక్కున ఉంటాయి.
దీని వల్ల శరీర ంలోని ఉత్తర మూలమైన తల భూమి నుంచి వచ్చే ఐస్కాంత ఉత్తర ధృవాన్ని వికర్షిస్తాయి.అలాగే దేవుడి గదిలో విరిగిన విగ్రహాలు లే దా చిరిగిపోయిన బొమ్మలను పెట్టుకోకూడ దు. ఇందుకు కారణం దానిని చూస్తూ దేవుడి మీద మనసును లగ్నం చేయలేం. అలాగే వి గ్రహాలు ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టకూడదు. ఎందుకంటే మనం విగ్రహాలను చూసి పూజించాలి తప్ప అవి ఒకదానిని ఒకటి చూసుకోరాదు.
గోడకు ఒక అంగుళం దూరంలో విగ్రహా లు పెట్టాలి. దీని వెనుక ఉన్న కారణం గాలి, అగరొత్తుల పొగ వంటివన్నీ చుట్టుకోకుండా సులభంగా పారడానికే. దేవుడి ముందు దీపా లు వెలిగించేటప్పుడు దానిని విగ్రహం ముం దే పెట్టాలి. అసలు దీపం పెట్టడమే వెలుగు కోసం కనుక విగ్రహం ముందు పెడితే అవి మరింత మెరుగ్గా కనుపిస్తాయి.పూజ సామాన్లను గదిలో ఆగ్నేయ దిక్కున భద్రపరచాలి. దీని వెనుక ఉన్న శాస్ర్తీయ కారణం అవి విగ్రహాలకు, మనం కూచోవడానికి అడ్డం లేకుండా ఉంటాయి. అంతే కాదు, సూర్య కిరణాలు సవ్యంగా ప్రసరించకుండా అడ్డం ఉండవు.
పూజ గదిలో గంటను ఏర్పాటు చేయడం సరికాదు. పూజ గది ఆలయం కాదు. అది మన వ్యక్తిగతధ్యానానికి, పూజకు ఉద్దేశించిం ది కనుక పెద్ద శబ్దాలు లేకుండా ఉంటుంది.పూజ గదిలో మరణించిన తాత ముత్తాతల ఫోటోలు పెట్టడం సరికాదు. చాలా మంది పెద్దలకు గౌరవం చూపిస్తున్నామనే భావనతో పెడుతున్నామనుకుంటారు కానీ అవి మన దృష్టిని, ఆలోచనలను మరల్చడమే కాదు బాధాకరమైన జ్ఞాపకాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నైవేద్యం పెట్టేటప్పుడు దానిని విగ్రహం ఎదురుగా పెట్టాలి తప్ప మన ఎదురుగా ఉంచుకోకూడదు.
పూజ గదిలో డబ్బు, ఇతర విలువైన వస్తువులను అక్కడ దాచడం సరికాదు. పూజ గది కప్పు కొద్దిగా కిందకి ఉండేలా చూసుకోవాలి. కారణం దాని వల్ల గది మరింత కుదురుగా కనుపిస్తుంది.పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఆ గదికి ఎప్పుడూ రెండు తలుపులు ఉన్న ద్వారాన్నే ఎంచుకోవాలి. అలాగే పూజ గదికి తప్పనిసరిగా గడప ఉండాలి. అలాగే పూజ గదికి లేత రంగులే వేయాలి. తెలుపు, లేత పసుపు లేదా లేత నీలాన్ని ఎంచుకోవచ్చు. దీనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉండి దేవుడిపై దృష్టి పెట్టడం సులవవుతుంది.
 

వాస్తు సలహాలు పాటించండిలా…

 chaskram
                          
భారతీయ వాస్తు శాస్త్రాల ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే, జీవితంలో అభివృద్ధి మార్గాల్లో పయనించే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. అందులో కొన్ని సలహాలను పరిశీలిస్తే…
chakrams
■పక్కమీద నుండి దిగగానే తూర్పు వైపుకు కొంచెం నడక సాగించటం మంచిది. దీనివలన తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మంచి లాభాలు పొందుతారు.
■ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశను చూడటం వలన కుబేర స్థానాన్ని చూసినట్లవుతుంది. దీనివలన ధనాదాయం లభిస్తుంది.
■తూర్పు గోడలోనే దేవుని గూడును ఏర్పాటు చేసుకోవటం మంచిది.
■ఈశాన్య మూలలో దేవుని మందిరాలు నిర్మించటం చేయకూడదు. దీనివలన ఈశాన్య మూల మూతపడటం శుభదాయకం కాదు.
■గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యంలో ప్రారంభమై నైఋతి వైపుకు చెత్తను ప్రోగుచేయండి. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు.
Turpu-Padamara
■ఆగ్నేయ మూల వంట చేసేటప్పుడు.. తూర్పు అబిముఖంగా నించుని వంట చేయాలి.
■ఇంటిని ఊడ్చే చీపురు శనీశ్వరుని ఆయుధం. అందుచేత గోడకు ఆనించేటప్పుడు చీపురు హ్యాండిల్‌ పైకి మాత్రమే పెట్టి ఉంచటం శుభకరం.
ఇంటి నిర్మాణానికి అనుకూలం కాని స్థలాలు…
■ఇంటి నిర్మాణానికి అనుకూలమైన స్థలాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని వాస్తు శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అందులో ముఖ్యంగా భారతీయ వాస్తు శాస్త్రాలు తెలిపిన, గృహనిర్మాణానికి పనికిరాని స్థలాల్ని పరిశీలిస్తే…
■స్థలంలోని నాలుగు భుజములు హెచ్చుతగ్గులుగా ఉన్నా, నాలుగు భుజాల కంటే ఎక్కవ భుజాలు కలిగి ఉన్న స్థలం అశుభాలను కలిగిస్తుంది.
■ చేట ఆకారంలో గల స్థలం కూడా మంచిది కాదు. ఎంత సంపాదించినా నిలువ ఉండటం అసాధ్యం. క్రమంగా దారిద్య్రానికి దారితీస్తోంది. నిరంతరం మానసిక అశాంతికి గురికావటం జరుగుతుంది.
■స్థలం లోని పొడవు ఎక్కువగా ఉండి, భుజములు హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని, అనారో గ్యం కలిగిస్తుంది.
■విసనకర్ర ఆకార స్థలం… ఎటువంటి ఆస్తి మంతుల్నైనా ఆర్థికంగా అణగారిపోయేలా చేస్తుంది.
■లాగుడు బండి ఆకారంలో ఉండే స్థలం ఆర్థిక పతనానికి దారి తీస్తోంది.
■డమరకపు ఆకారంలో ఉండే స్థలం మంచిది కాదు. సంతానం కలగటంలో సమస్యలు నేత్ర సంబంధిత రోగాలు కలుగుతాయి.
■కుంభాకార స్థలం, భయం, అంటు వ్యాధులు, సుఖశాంతులు లోపించటం జరుగుతుంది.
■మద్దెల ఆకారంలో గల స్థలాలు భాగస్వాముల మధ్య వివాదాలను, విడిపోయే ఆస్కారాలను అధికంగా కలిగిస్తాయి.
■అర్థ చంద్రాకార స్థలాల వలన మానసిక భ్రాంతి కలుగుతుంది. తరచుగా దోపిడీలు జరుగుతుంటాయి.
గృహావరణలో మెట్లు…
మెట్లను నిర్మించటంలో కొన్ని పద్ధతులను పాటించాలని వాస్తు శాస్త్రాలు తెలుపుతున్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లను ఏవిధంగా నిర్మిస్తే శుభదాయకాలనే అంశాలను పరిశీలిస్తే…
■మేడపైకి మెట్లు నిర్మించేటపుడు ఒక వరుస మెట్లను… తూర్పు నుండి పడమరకు లేదా, ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కే విధంగా నిర్మించాలి.
■ రెండు వరుసలుగా నిర్మించేటపుడు.. మొదటి వరుస మెట్లను.. తూర్పు నుండి పడమరకు వెళ్ళే విధంగానూ, రెండవ వరుస మెట్లు ఏ దిక్కుకైనా తిరిగినా పడమర నుండి తూర్పుకు ఎక్కే విధంగా నిర్మించాలి.
■రెండు వరుస మెట్లను నిర్మించేటపుడు ఒక వరుస ఉత్తరం నుండి దక్షిణం వైపు ఎక్కేవిధంగానూ, రెండవ వరుస.. ఎటు తిరిగినా దక్షిణం నుండి ఉత్తరం ఎక్కేవిధంగా నిర్మించుకోవచ్చు.
■ఈశాన్య దిక్కుగా మెట్లను నిర్మించేటప్పుడు గృహానికి తూర్పు, ఈశాన్యం లేదా ఉత్తర – ఈశాన్యాలవైపు నిర్మించుకోవచ్చు.
■ఈశాన్యం వైపు నిర్మించే మెట్లు ప్రహరీ గోడకు సమీపంలో ఉండకూడదు.
■మెట్లను ఎల్‌ ఆకారంలో ఉండే విధంగా నిర్మించాలనుకునే వారు ముందు తూర్పు నుండి పడమరకు గానీ, లేదా ఉత్తరం నుండి దక్షిణానికి గానీ ఎటువైపుకైనా నిర్మించుకోవచ్చు.
 
 
                        తాపీ మేస్ర్తీలకూ వాస్తు… !
ఇళ్ళు, గుడి, బడి ఇలా ఏ నిర్మాణం చేపట్టినా.. భారతీయ సాంప్రదాయంలో వాస్తుకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఏ మూలలో ఏది ఉండాలనేది ముందుగానే నిర్ణయించి.. తదనగుణంగా నిర్మాణాన్ని పూర్తిచేయడం ఆనవాయితీ. అయితే.. వాస్తు అనేది గృహస్తులకు, నిర్మాణాలకేనా? ఆ నిర్మాణాల్లో పాలుపంచుకునే తాపీ మేస్ర్తీలకు వర్తించదా? అంటే.. కచ్చితంగా వర్తిస్తుంది అంటున్నాయి వాస్తు శాస్త్రాలు. మరి నిర్మాణాల్లో కీలకపాత్ర పోషించే తాపీ మేస్ర్తీలు ఎలాంటి వాస్తు సూచనలు పాటించాలో ఈవారం తెలుసుకుందాం..
thapi-bukketగృహ నిర్మాణాల్లో పాలుపంచుకునే తాపీ మేస్ర్తీలు మొదలుకొని.. ఇటుకలు, ఇసుక, కాంక్రీటు ఇలా ప్రతి పనిలో భాగస్వామ్యం పంచుకునే కూలీలకు సైతం వాస్తు సూచనలు తప్పనిసరి. అయితే.. కూలీలకంటే గృహనిర్మాణంలో కీలకపాత్ర పోషించే.. తాపీ మేస్ర్తీలే ఎక్కువ నియమాలు పాటించాల్సివుంటుంది. వీరు గృహ నిర్మాణ సమయంలో జాగ్రత్తగా వ్యహరిస్తేనే నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తవడమే కాకుండా.. బిల్డర్‌ లేదా యజమాని ఆశించిన రీతిలో నిర్మాణం పూర్తవుతుంది.
ఇంత ప్రాధాన్యత ఉన్న తాపీ మేస్ర్తీలకు వాస్తు శాస్త్రంలో కొన్ని సలహాలు పేర్కొనడం జరిగింది. వీరు గృహ నిర్మాణం చేపట్టే సమయంలో కొన్ని కీలక గుర్తులతో పాటు.. దిశలను ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ప్లాన్‌ ప్రకారం గుర్తులు వేసుకోవాలి. అప్పుడు నైరుతి దిశ 90 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి.తాపీ మేస్ర్తీ నిర్మాణానికి దిగేముందు మూలమట్టాన్ని ముందుగా నైరుతి దిశలో ఉంచాలి. ఆ తరువాతే ఇతర దిక్కుల్లో దిశలను మార్క్‌ చేసుకోవాలి. ఈ మార్కులు చేసుకునేటప్పుడు ఇతర మూలల కంటే.. ఈశాన్యం కొద్దిగా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి పునాదులు తీసేటప్పుడు ముందుగా ఈశాన్యం మూల నుంచి ప్రారంభించాలి. అయితే.. కట్టడం మాత్ర నైరుతి దిశ నుంచి ప్రారంభించాలి.
హద్దులను బట్టి ముందుగా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలి. పశ్చిమ-నైరుతి దిశలో కొంత ఎతె్తైన గోడను నిర్మించి, ఆ తరువాత ఇంటి నిర్మాణం చేపట్టాలి. అలాగే. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తు సామాగ్రిని నైరుతి, పశ్చిమ, దక్షిణ భాగాల్లో మాత్రమే జాగ్రత్త చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య భాగంలో మాత్రం ఉంచకూడదు. గోడల నిర్మాణంలో ఏ రోజుకారోజు.. దక్షిణ-పశ్చిమ గోడలు.. తూర్పు, ఉత్తర గోడల కంటే కొంచెం ఎత్తుగా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే.. ఫ్లోరింగ్‌ వేసే సమయంలోను జాగ్రత్తగా చూసుకోవాలి. వీటితో పాటు మరికొన్ని జాగ్రత్తలను మేస్ర్తీ పాటించాలి.
పడకగది ఇలా…
ప్రతి గృహంలో నిర్మాణానికి చాలా సూత్రాలు పాటిస్తూ వస్తుంటాం. అలాగే ఇంటి యజమాని సంతోషాన్ని రెట్టింపు చేసేది పడకగది. అటువంటి పడకగది నిర్మాణంలో నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పడకగదిలో మంచాన్ని మన ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే.. అది మన ఆరోగ్య, మానసిక విషయాలు మీద చెడు ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. పడకగది తలుపుకి ఎదురుగా మంచం ఉండకూడదు. మంచం తలుపులకి, కిటికీలకు ఎదురుగా ఉండరాదు. అందువల్ల వాటిద్వారా గదిలోకి వచ్చే వెలుతురువల్ల మన నిద్రకు భంగం కలుగుతుంది.
furnicture house-furniture
అద్దాన్ని కాని, డ్రెస్సింగ్‌ టేబుల్‌ని కాని మంచానికి తలవైపు కాని, కాళ్లవైపు కాని ఉంచకూడదు. మనిషి నిద్రించే సమయంలో ఆత్మ శరీరం నుండి విడివడి గదంతా తిరుగుతుందని చైనీయుల విశ్వాసం. శరీరం నుండి ఆత్మ బయటకు రాగానే అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని కంగారు పడుతుంది. దానివలన లేనిపోని అనర్ధాలు కలుగుతాయి. నిద్రాసమయంలో ఆత్మ శరీరం నుండి బయట పడుతుందనే నమ్మకం మనదేశంలోనూ ఎక్కువగానే ఉంది.
బుక్‌షెల్ఫ్‌, డ్రెస్సింగ్‌ టేబుల్‌ అంచుల నుండి వీచే సూటి గాలులు మనిషి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. బెడ్‌రూమ్‌లో అనవసరమైన చెత్త ఉంచకూడదు. పెట్టెలు, పుస్తకాలు, ఉపయోగపడని గృహోపకరణాలు ఉండకూడదు. టెలివిజన్‌, రేడియో, కంప్యూటర్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ సాధనాలు పడకగదిలో ఏర్పాటు చేసుకోకపోవడమే మంచిది. తద్వారా నిద్రకు భంగం కలుగదు. ఎట్టి పరిస్థితులోనూ మంచాన్ని ఏటవాలుగా ఉండే సీలింగ్‌ కిందకాని, స్థంబాల కిందకాని ఉండకూడదు. ఒకవేళ వీటికింద తప్పనిసరి పరిస్థితుల్లో మంచాన్ని వేసుకోవల్సి వస్తే రెండు వెదురు వేణువులను పైన వేలాడదీయండి.
 
గృహ నిర్మాణానికి స్థలం
 
             
vasthusగృహ నిర్మాణానికి స్థలం ఎంపికే ఆయువు పట్టు. ఇంటి నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసుకునే ముందు కొనుగోలు చేయబోయే స్థలం గురించి జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా.. స్థలం దిశల కోణాలను నిశింతంగా పరిశీలించాలి. ఎంపిక చేసుకునే స్థలం చతుర్రసాకారంలో ఉండేలా చూసుకోవాలి. లేని పక్షంలో.. మూలలకు సంబంధించిన దోషాలు కలిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని దిశల స్థలాలను పరిశీలించినట్టియితే.. వాటి వల్ల కలిగే లాభ నష్టాలను పరిశీలిద్దాం.
* దక్షిణ ఆగ్నేయం పెరిగిన స్థలం మంచిది కాదు. అయితే.. ఇలాంటి స్థలాలను సరి చేసుకోవచ్చు.
* నైరుతి మూలను.. మూలమట్టాల నుంచి 90 డిగ్రీలు చేసి తూర్పు భాగానికి తాడును లాగి హద్దు చేసుకుని మిగిలిన స్థలాన్ని వదిలివేయడం మంచిది. అలాగే.. దక్షిణ నైరుతి పెరిగిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టకుండా ఉంటే మంచిది. గత్యంతరం లేని పక్షంలో ఈ స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టదలిస్తే.. మూలలను సరిచేసుకోవడం మంచిది. దక్షిణ నైరుతి పెరిగిన స్థలాన్ని సరి చేసుకునేందుకు ఆగ్నేయ మూలను మూలమట్టాన్ని వుంచి 90 డిగ్రీలుగా పడమరకు తాడును లాగి, హద్దు చేసుకుని మిగిలిన స్థలాన్ని వదిలివేయాలి.
* ఇకపోతే.. తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం పెరిగిన స్థలం ఇంటి నిర్మాణానికి పనికిరాదు. దీన్ని నివారించాలంటే.. ఈశాన్యం మూలన మూలమట్టాన్ని ఉంచి 90 డిగ్రీలు చూసి, దక్షిణ భాగానికి తాడులాగి హద్దు చేసి, అలాగే.. నైరుతిమూలన మూల మట్టం నుంచి 90 డిగ్రీలు చూపి తూర్పు భాగా నికి తాడులాగి హద్దు చేసుకుని, మిగిలిన స్థలాన్ని వదిలివే యాలి.
గృహనిర్మాణానికి పనికిరాని స్థలాలు…
ఇంటి నిర్మాణానికి అనుకూలమైన స్థలాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని వాస్తు శాస్త్రా పేర్కొంటున్నాయి. అందులో ముఖ్యంగా భారతీయ వాస్తు శాస్త్రాలు తెలిపిన, గృహనిర్మాణానికి పనికిరాని స్థలాల్ని పరిశీలిస్తే…
1. స్థలములోని నాలుగు భుజములు హెచ్చుతగ్గులుగా ఉన్నా, నాలుగు భుజాల కంటే ఎక్కవ భుజాలు కలిగి ఉన్న స్థలం అశుభాలను కలిగిస్తుంది.
2. స్థలము లోని పొడవు ఎక్కువగా ఉండి, భుజములు హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని, అనారోగ్యం కలిగిస్తుంది.
3. చేట ఆకారంలో గల స్థలం కూడా మంచిది కాదు. ఎంత సంపాదించినా నిలువ ఉండటం అసాధ్యం. క్రమంగా దారిద్య్రానికి దారితీస్తోంది. నిరంతరం మానసిక అశాంతికి గురికావటం జరుగుతుంది.
4. డమరకపు ఆకారంలో ఉండే స్థలము మంచిది కాదు. సంతానం కలగటంలో సమస్యల, నేత్ర సంబంధిత రోగాలు కలుగుతాయి.
5. లాగుడు బండి ఆకారంలో ఉండే స్థలము ఆర్థిక పతనానికి దారి తీస్తోంది.
6. కుంభాకార స్థలం, భయం, అంటు వ్యాధులు, సుఖశాంతులు లోపించటం జరుగుతుంది.
7. విసన కర్ర ఆకార స్థలం… ఎటువంటి ఆస్తిమంతుల్నైనా ఆర్థికంగా అణగారిపోయేలా చేస్తుంది.
8.మద్దెల ఆకారంలో గల స్థలాలు భాగస్వాముల మధ్య వివాదాలను విడిపోయే ఆస్కారాలను అధికంగా కలిగిస్తాయి.
9. అర్థ చంద్రాకార స్థలాల వలన మానసిక భ్రాంతి కలుగుతుంది. తరచుగా దోపిడీలు జరుగుతుంటాయి.
గృహాలకు మెట్టను ఎలా నిర్మంచుకోవాలి….
ఇంటికి మెట్లను నిర్మించటంలో కొన్ని పద్ధతులను పాటించాలని వాస్తు శాస్త్రాలు తెలుపుతున్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లలను ఏవిధంగా నిర్మిస్తే శుభదాయకాలనే అంశాలను పరిశీలిస్తే..
1. మేడపైకి మెట్లు నిర్మించేటపుడు ఒక వరుస మెట్లను… తూర్పు నుండి పడమరకు లేదా, ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కే విధంగా నిర్మించాలి.
2. రెండు వరుసలుగా నిర్మించేటపుడు.. మొదటి వరుస మెట్లను.. తూర్పు నుండి పడమరకు వెళ్ళే విధంగానూ, రెండవ వరుస మెట్లు ఏ దిక్కుకైనా తిరిగినా పడమర నుండి తూర్పుకు ఎక్కే విధంగా నిర్మించాలి.
3. రెండు వరుస మెట్లను నిర్మించేటపుడు ఒక వరుస ఉత్తరం నుండి దక్షిణం వైపు ఎక్కేవిధంగాను, రెండవ వరుస.. ఎటు తిరిగినా దక్షిణము నుండి ఉత్తరం ఎక్కే విధంగా నిర్మించుకోవచ్చు.
4. మెట్లను ‘ఎల్‌’ ఆకారంలో ఉండే విధంగా నిర్మించాలనుకునేవారు ముందు తూర్పు నుండి పడమరకు గానీ, లేదా ఉత్తరం నుండి దక్షిణానికి గానీ ఎటువైపుకైనా నిర్మించుకోవచ్చు.
5 గృహానికి వెలుపలి భాగంలో నిర్మించదలచే వారు… ఈశాన్య, వాయవ్య, నైఋతి, ఆగ్నేయాలలో ఏ భాగంలో నైనా నిర్మించుకోవచ్చు.
6. ఈశాన్య దిక్కుగా మెట్లను నిర్మించేటప్పుడు గృహానికి తూర్పు, ఈశాన్యము, లేదా ఉత్తర- ఈశాన్యాలవైపు నిర్మించుకోవచ్చు.
7. ఈశాన్యం వైపు నిర్మించే మెట్లు ప్రహరీ గోడకు సమీపంలో ఉండకూడదు.
 
సింహద్వారం ఎటువైపు ?
 
                                 
ఇంటికి ప్రధాన ద్వారం.. సింహద్వారం. ఇల్లు నిర్మాణం మొదలు పెట్టాలని నిర్ణయించిన తరువాత అన్నింటికంటే.. ముందుగా చర్చించేది సింహద్వారం గురించే. ఎందుకంటే.. వాస్తు ప్రకారం సింహద్వారానిి ఉన్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. సింహద్వారం సరైన దిశలో అమరితే.. సగం వాస్తు కుదిరనట్టే…
sidebysideసింహ ద్వార గృహం ఏదైనప్పటికీ రహదారి ఉన్న వైపునకు ఉన్న దిశలో స్థలానికి ఉచ్ఛ స్థానంలో ప్రహరీ గేటును పెట్టుకోవాలి. తూర్పు స్థలంలో నిర్మించిన గృహంలో తూర్పు ఈశాన్యం లేదా తూర్పు ఉచ్ఛంలో గేటు ఉండేలా చూసుకోవాలి. విశాలమైన స్థలం కలిగి రెండు గేట్లు పెట్టదలచినపుడు తూర్పు ఈశాన్యంలో పెద్దగేటు, తూర్పు ఉచ్ఛంలో సింగద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.
విశాలమైన స్థలం కలిగి రెండుగేట్లు పెట్టదలచినవారు.. దక్షిణ ఆగ్నేయంలో పెద్ద గేటు, దక్షిణ ఉచ్ఛంలో చిన్న గేటు పెట్టాలి. నైరుతి స్థలంలో గేటు నైరుతిస్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణ లేదా పశ్చిమ దిశలలో ఏదో ఒక దిశకు మాత్రమే సింహద్వారం, ఇతర వాస్తు విషయాలు దృష్టిలో పెట్టుకుని గేటు పెట్టాలి. దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యంలో గేటు పెట్టాలి. దక్షిణంలో అయితే దక్షిణ ఆగ్నేయంలో పెద్ద గేటు, దక్షిణంలో చిన్న గేటు పెట్టాలి.
ఆగ్నేయ స్థలంలో తూర్పు సింహద్వార గృహం కట్టడం శ్రేయస్కరం. కాబట్టి ప్రహరీ గేట్లు కూడా తూర్పు ఈశాన్యం, తూర్పు ఉచ్ఛంలో పెట్టుకోవడం మంచిది. దక్షిణ స్థలంలో గేటు దక్షిణ స్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు ఉన్న స్థలంలో సింహద్వారం ఎదురుగా గేటు పెట్టాలి.
      పశ్చిమంలో అయితే పశ్చిమ వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమ సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి. అలాగే పశ్చిమ స్థలంలో గేటు ఉన్నప్పుడు.. పశ్చిమ స్థలంలో నిర్మించిన గృహంలో పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యం వరకు ఉన్న స్థలంలో ఎక్కడైనా సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టాలి.విశాలమైన ఆవరణ కలిగి రెండు గేట్లు పెట్టదలచినపుడు పశ్చిమ వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమ ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి. అలాగే.. వాయువ్య స్థలంలో గేటు వాయువ్య స్థలంలో నిర్మించిన గృహంలో అవసరాన్ని, సింహ ద్వారాన్ని బట్టి రెండు వైపులకు లేదా కేవలం ఒకవైపుకు పెట్టుకోవచ్చు. ఉత్తర దిశను ఉత్తర ఉచ్ఛం ఈశాన్యం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యం వరకు ఎక్కడైనా సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టుకోవాలి.
ఒకవేళ రెండేసి గేట్లు పెట్టదలచిన వాళ్లు ఉత్తర ఈశాన్యంలో పెద్దగేటు, ఉత్తర ఉచ్ఛంలో చిన్న గేటు, పశ్చిమ వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమలో చిన్న గేటు పెట్టాలి. ఉత్తర స్థలంలో గేటు పెట్టదలుచుకుంటే.. ఉత్తర స్థలంలో నిర్మించిన గృహంలో ఉత్తర ఉచ్ఛం నుంచి ఉత్తర ఈశాన్యం వరకు ఎక్కడైనా, సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టాలి. విశాలమైన ఆవరణ ఉంటే రెండు గేట్లు పెట్టదలిస్తే ఉత్తర ఈశాన్యంలో పెద్ద గేటు, ఉత్తర ఉచ్చంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి. ఇకపోతే ఈశాన్య స్థలంలో గేటు పెట్టాలను కుంటే.. తూర్పు, ఉత్తరం రహదారి ఉన్న స్థలంలో నిర్మించిన గృహంలో తూర్పు, ఉత్త ర దిశల వైపు పెట్టాలి. తూర్పు దిశన రెండు గేట్లు పెట్టాలను కుంటే తూర్పు ఈశాన్యంలో పెద్దగేటు, తూర్పు ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు, ఉత్తరం ఉచ్చంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.
 
 
House_Under_Constructioఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్నిసార్లు గృహ నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు వాస్తు రీత్యా ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇలాంటి సమయంలో తప్పకుండా పూర్తి చేయాల్సిన పనులేమిటి? పూర్తి చేయాల్సివస్తే.. ఏఏ నిర్మాణాలను పూర్తి చేయాలి ఇత్యాది విషయాలపై ఈవారం తూర్పు-పడమర.
కొత్త ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోతే చాలామంది.. నిర్మాణాన్నంతటినీ ఆపివేస్తారు. కొంతమందికి కొన్నింటిని పూర్తి చేయాలని తెలిసినా.. వేటిని పూర్తిచేయాలో, వేటిని వదిలేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇంటి నిర్మాణాన్ని మధ్యలో ఆపివేయడం వాస్తూ రీత్యా అనేక దోషాలకు కారణమవుతుంది. అందువల్ల ఇల్లు నిర్మించేటప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటి పనులను ఆపవలసి వస్తే ప్రత్యేకించి కొన్నింటిని మాత్రమే వాయిదావేయాలి. మిగిలినవి తప్పకుండా పూర్తి చేయవలసి ఉంటుంది. అవేమిటో ఓసారి పరిశీలిస్తే…
* ఇల్లు కట్టేటప్పుడు ఇంటిలోపల ఫ్లోరింగ్‌ ఆపవచ్చు. కానీ వాస్తు రీత్యా ఆర్డినరీ గచ్చు వాటాన్ని వేయాలి. అంతేకాదు ఇంటి లోపలలో లెవల్‌ పెట్టకూడదు.
* లోపల గదులకు ద్వారాలు, కిటికీలు, కప్‌ బోర్డులు, షో కేసులు తదితర వాటికి సంబంధించిన చెక్కపని ఆపవచ్చు.
* ఇంటిలోపల టాయ్‌లెట్‌ కోసం గది నిర్మించినప్పటికీ లోపల పనిముట్లు పెట్టకుండా వాయిదా వేయవచ్చు.
* ఇంటి ఫ్లోరింగ్‌కు సంబంధించి అన్ని గదుల్లోనూ టైల్స్‌ పని ఆపవచ్చు.
* ఇంటి ఆవరణలో సిమెంట్‌ చేయించటం ఆపవచ్చు. కానీ వాస్తురీత్యా మట్టి వాటం వచ్చేటట్లు వేయించాలి.
* అలాగే ఇంటికి గచ్చు వేయించేదాకా మట్టి కొట్టుకుపోకుండా జాగ్రత్తపడాలి. పూజగది కట్టిన తర్వాత దానిలోని అలంకరణకు సంబంధించిన పని.. అనగా టైల్సు వేయటం వంటి మొదలైన పనులను వాయిదా వేసుకోవచ్చు.
* గ్రిల్‌కు సంబంధించిన ్వదారాలు, కాంపౌండ్‌ గేట్లు ఆపుచేసుకోవచ్చు. అదేవిధంగా మెట్లు కట్టకుండా వాయిదా వేసుకోవచ్చు.
* కిటకీలకు గుమ్మాలకు రంగులు వేయటం ఆపేయవచ్చు.
* ఇంటికి సంబంధించిన కాంపౌండ్‌ వాల్‌ను ఆపవచ్చు కానీ, గోడ కట్టు మాత్రం సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలి.
* పెద్ద ఇంటికి ప్లాను వేయించి అందులో కొంత ఇప్పుడు కట్టి భవిష్యత్తులో మిగిలిన దానిని కట్టుకోవచ్చు.
* శ్లాబు వాస్తురీత్యా వాటం సరిగా లేనప్పుడు శ్లాబుపై ప్లాస్టరింగ్‌లు, ఫినిషింగ్‌లు తప్పనిసరిగా చేయించాలి.
* ఇంటిలోపల ఉన్న టాయిలెట్లు వాడకంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా తలుపులు ఉండాలి.
* అదేవిధంగా గృహ ఆవరణలో మట్టి నింపే పని ఉన్నపుడు దానిని అసంపూర్ణంగా వదిపెట్టకూడదు.
* మేడ మీద, మెట్ల మీద పిట్ట గోడలు కట్టకుండా ఆపకూడదు. బయట ద్వారాలకు తలుపులు పెట్టకుండా ఆపనే కూడదు.
* గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత గృహప్రవేశం చేయకుండా ఉండకూడదు.
* గృహనిర్మాణం పూర్తయిన తరువాత గృహ ఆవరణలో ఆగ్నేయ, నైరుతి, పశ్చిమ, వాయవ్య దిశలలో పెద్ద వృక్షాలను పూర్తిగా తొలగించకూడదు.
 
పెంపుడు జంతువుల పెంపకం – వాస్తు
 
indian-model
పెంపుడు జంతువుల పెంపకం – వాస్తు
———————————————————
           వాస్తు ప్రకారం ఇంట్లో పెంపుడు జంతువు లను పెంచడం మంచిదా కాదా అనే అనుమానం మీకుందా.. అయితే ఈ కథనం చదవండి. ఇంటి లో పెంపుడు జంతువుల్ని పెంచడం కచ్చితంగా హితకరమేనని చెప్పవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో వాస్తు దోషాలు కానీ ఉన్నట్లయితే, అవి (వాస్తుదోషాలు) పరోక్ష ముగా ఇంట్లో పెంచే పెంపుడు జంతువుల మీద తమ దుష్ప్రభావాన్ని చూపిన తర్వాతే గృహస్తులను బాధిస్తాయి. జంతువుల పెంపకం కోసం మీ ఇంట్లో షెడ్డును నిర్మించా లనుకుంటే, దక్షిణ-మధ్యస్థ భాగం, నైరుతి లేదా వాయువ్యం వైపో లేదా పడమర-మధ్యస్థ భాగములోనో నిర్మించడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.అలాగే వాస్తు దోష నివృత్తికి తాత్కాలిక పరి హారం కోసం అద్దె ఇంటిలో ఉన్నవారు,
 German_Shepherd
వాస్తు శాస్త్రానికి అనుగుణంగా తమ ఇంటిని పునర్ని ర్మించడానికి ఆర్థికస్తోమతలేనివారు, దోష నివృత్తి కోసం ప్రతిరోజూ వాస్తుశాస్త్రాన్ని అను సరించి నిర్మించిన దేవాలయానికి వెళ్ళి అక్కడ కొంత సమయాన్ని వెచ్చించిన తర్వాత తమ పనిని ప్రారంభిస్తే సత్ఫలితాలని స్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. సుఖశాంతులనొసగే ఇంటిలో చోటుచేసుకున్న మంచి, చెడులు ఆ ఇల్లు పొడవు, వెడల్పులపై ఆధారపడి ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. 42 అడుగుల పొడవు, 42 అడుగుల వెడల్పుతో ఇల్లు కట్టినట్లైతే ఆ ఇల్లు ఉత్సాహవంతమైన జీవితాన్ని అందిస్తుంది. ఎల్లవేళలా కుటుం బంలో ఆనందం వెల్లివిరిసేందుకు దోహదపడు తుంది. ఇల్లంతా పిల్లాపాపలతో చిరకాలం కళకళలాడుతుంది. అదే 43 అడుగుల పొడవు, 43 అడుగుల వెడల్పుతో ఇల్లు కట్టుకున్నట్లైతే ఆ ఇంటిలో నివసించేవారు ఎల్లవేళలా కష్టాలు, కడగండ్ల తో జీవితాన్ని సాగించాల్సి ఉంటుంది. ఒక వేళ 44 అడుగుల పొడవు, 44 అడుగుల వెడల్పు తో ఇంటిని నిర్మించినట్లైతే ఆస్తి నష్టం కలగ డమే కాకుండా, ఆ ఇం టికి కష్టాలు వెన్నంటే ఉంటా యని వాస్తు శాస్త్ర గ్రంధాలు తెలుపుతున్నాయి.
ఆగ్నేయంలో ఖాళీ ఉండరాదు…
ఆగ్నేయ దిశలో స్థలం తగ్గి ఉంటే సమస్త సంపదలు చే కూరుతా యని వాస్తు నిపుణు లు అంటున్నారు. కానీ మీ గృహంలో ఆగ్నేయ దిశ స్థలం ఎక్కువ ఖాళీగా ఉంటే మాత్రం సమస్త సంపదలు హరింపబడు తాయి. ఇంకా అప్పుల బాధ, ఈతిబాధలు, నమ్మినవారి చేతిలో మోస పోవడం వంటి అశుభ ఫలితాలు కలుగుతాయి. తూర్పుతో కలిసి పెరిగిన ఆగ్నేయ స్థలంలో నివసించే వారికి సంతాన ప్రాప్తి ఉండదని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాగే దక్షిణంతో కలిసి పెరిగిన ఆగ్నేయ స్థలంలో నివసించేవారికి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి. కోర్టు సమస్యలు, అనేక వ్యాధులు, ఆపదలు సంభవించే అ వకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకా కుం డా పడకగదిలో ఆగ్నేయం వైపు బెడ్‌ ఉంటే కుటంబ సభ్యులు మానసిక ఆందోళనకు గురవుతారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
 
 
పడకగదిలో నెమలి ఫించం…!
 
peacock
పడకగదిలో నెమలి ఫించం…!
    ఇల్లన్న తర్వాత దేవుడి గది, వంట గది, డైనింగ్‌ హాల్‌, పడక గది, డ్రా యింగ్‌ రూమ్‌, స్టడీ రూమ్‌ ఇలా ఎన్నో ఉంటాయి. ఇవి చిన్నవి కావచ్చు.. లేదంటే పెద్దవిగా కూడా ఉండవచ్చు. అయితే ప్రతి గదికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రత్యేకత రంగుల ద్వారా, ఫర్నీచర్‌ ద్వారా ఆయా గదులలో ఉండే ఇతర వస్తువుల ద్వారా కనబడుతూ ఉంటుంది.
              ఎవరి అభిరుచి వారిదే అయినా రంగుల వాడకంలో వాస్తు నియమాలు పాటిస్తే మంచిదంటున్నారు వాస్తు నిపుణులు. ఏయే గదికి ఏ రంగు వేస్తే బావుంటుందో తెలుసుకుని ఆ రంగులను గదులకు వేస్తే మంచిది.
ఏ రంగు వాడాలి?
ఉదాహరణకు… వాస్తు ప్రకారం పడక గదు లకు లేత రంగు మంచిది. గోడలకు లేత గు లాబీ, నీలం, ఆకుపచ్చ, బూడిద రంగులు ఉం టే మనసు ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధి విక సిస్తుంది. అలాగే పసుపు, తెలుపు మార్బుల్‌ స్టోన్స్‌ను ఫ్లోర్‌కి వాడితే వాస్తు కుదురుతుంది. ప్రశాంతంగా, నిశ్శబ్ద వాతావరణం ఉండేలా ఇవి చూస్తాయి. దంపతుల మధ్య ఎటు వంటి సమస్యలు రావు. చక్కగా నిద్రపడుతుంది.
పడకగదిలో నెమలి పింఛమెందుకు?
పడకగదిలో అద్భుతమైన సీనరీలను ఉంచ డం ద్వారా మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలి గిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు.
అంతేకాదు.. రకరకాలైన పక్షులు జంటలుగా ఉంటే దృశ్యాలు పడకగదిలో ఉంచితే భార్యాభర్తల మధ్య అనురాగం పెంపొందుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
అయితే బెడ్‌రూమ్‌లో నెమలి పింఛా న్ని కన బడేటట్లు పెట్టి తెల్లవారు జా మున లేవగానే దానిని చూడడం వల్ల రాహుగహ్ర దోషాల నుంచి నివారణ కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటు న్నారు. నెమలి పింఛంతో తయారైన చిత్ర పటాలను పడకగదిలో ఉంచడం ద్వారా శుభ ఫలితాలుంటాయని వారు చెబు తున్నారు.
అలాగే.. పడకగదిలో కంటికి ఎదురుగా వికృతమైన పటాలు, చిలకకొయ్యలు, స్తంభాలు ఇతర అవరోధాలు లేకుండా జాగ్రత్తగా వహించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
 
 
 

24 జనవరి 2013

సంపదను పెంచే వాస్తు

 
        సంపాదించిన డబ్బును పొదుపు చేయడం లేదా మరింత డబ్బు సంపాదించాలనుకోవడానికి వాస్తు పరమైన మార్పులను కొన్నింటి ని సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం…ఇంటికి నైరుతి మూలను తమిళులు కుబేర స్థానమంటారు. ఇక్కడ ఎటువంటి సంప్‌ కా నీ, సెప్టిక్‌ టాంక్‌ కానీ బోర్‌వెల్‌ కానీ భూమిలోపల ఎటువంటి నిర్మాణం లేకుండా చూసుకోవడం వల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది.నగలు, ఇతర విలువైన పత్రాలు పెట్టే బీరువాలను, లాకర్లను వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. తూర్పు ముఖంగా తలుపు తెరుచుకునే పశ్చిమపుగోడకు వీటిని పెట్టడం మంచిది. లేదా తూర్పు లేదా ఉత్తర ముఖంగా తలుపు తెరుచుకునేలా నైరుతి మూల ఉంచాలి.
 
       లాకర్లు ఉత్తర ముఖం తెరుచుకునేలా దక్షిణపు గోడకు పెట్టడం కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది. లాకర్‌ తలుపులు ఉత్తరముఖంగా తెరుచుకోవడం మంచిది. ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ దిక్కుకి కుబేరుడు అధిపతి. బీరువాను ఈశాన్య మూలలో ఎప్పుడూ పెట్టకూడదు. ఎందుకంటే దీనివల్ల సంపద నష్టం జరుగుతుంది. ఆగ్నేయ, వాయువ్య దిక్కులు కూడా మంచివి కావు ఎందుకంటే దీనివల్ల అనవసర ఖర్చులు అధికమవుతాయి. డబ్బులు పెట్టుకునే బీరువాను ఎప్పుడూ దూలం కింద ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఆర్థిక స్థిరత్వం మీద ఎక్కువ ఒత్తిడి పెడుతుంది.ఈశాన్య మూల కూడా సంపద వృద్ధికి తో డ్పడుతుంది. ఇంటికి ఈ మూలన సంప్‌, బోర్‌వెల్‌ లేదా బావి నిర్మిస్తే అభివృద్ధి, స్థిరత్వం వస్తాయి.
 
     ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండకపోవడం లేక అది వృద్ధి జరగకపోవడం వంటివి ఎదుర్కొంటుంటే ఇంట్లో రాత్రంతా కనీసం ఒక దీపానై్ననా వెలగని స్తూ ఉండాలిట. ఎందుకంటే కాం తి కూడా ఒక రకమైన శక్తే. ఫెంగ్‌షూయ్‌ ప్రకారం దీన్ని యాంగ్‌ శక్తి అం టారు. ఇది చలనం తీసుకువస్తుంది.ఇంట్లో చేపల అక్వేరియం పెట్టుకోవడం సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండే చేపలను ఎం చుకొని ఇంటికి తెచ్చుకోవాలి. నీటిని శుభ్రం గా, గాలిపోయేలా ఉంచాలి. చేపలు అక్వేరియంలో తిరుగుతూ ఉంటే ఆ శక్తి ఇంట్లో సం పద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. దీ నిని గదిలో నైరుతి దిక్కున ఉంచడం మంచిది.
 
     మీ అపార్ట్‌మెంట్‌ ముఖద్వారం పొడవైన కా రిడార్‌ చివర ఉన్నప్పుడు అక్కడ ప్రవహించే శ క్తి చాలా ఉధృతంగా ఉంటుంది. ఇది మీ ఆర్థిక పె ట్టుబడులకు రిస్క్‌ కాగలదు. దీనిని తగ్గించేందుకు కారిడార్‌ మధ్యలో అంటే దారికి అడ్డంగా కాదు గాని ఒక వైపు ఒక మొక్కను పె డితే ఆ ఉధృతి తగ్గుతుంది.
 
ఇంటి ముఖ ద్వారానికి మంచి రంగులు వేయడం ద్వారా సంపదను ఆహ్వానించవచ్చు. పక్కింటివారి గోడలకు, ముఖద్వారాలకు భిన్నంగా, ఆకర్షణీయమైన రంగులు వేసుకోమంటున్నారు నిపుణులు.
 
ముఖ్యంగా జీవితంలో ఆర్థికాంశాల పట్ల మరింత స్పష్టత కావాలనుకున్నప్పుడు మీ ఇం ట్లో గాజు వస్తువులను ఒకసారి పరిశీలించండి.
 
   ముఖ్యంగా ఇంటికి గాజు కిటికీ తలుపులు వుంటే అవి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. మురికిగా ఉన్న అద్దపు తలుపులు సంపదను లోనికి రానివ్వవట.కిటికీకి క్రిస్టల్స్‌ వేలాడదీయడం వల్ల శక్తి చురుకుగా ప్రవహిస్తుంది. సూర్యకిరణాలు వా టిని తాకినపుడు అవి రంగు రంగుల అద్భుత ఇంద్రధనస్సులను సృష్టిస్తాయి. నేరుగా సూర్యకిరణాలు ప్రసరించే కిటికీని ఎంచుకుని అక్క డ ఒక క్రిస్టల్‌ను వేలాడదీస్తే మీ కెరీర్‌ వృద్ధికి అది దోహదం చేస్తుందంటున్నారు.ఆదాయానికన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటే మొక్కలను కానీ విత్తనాలను కానీ టాయిలెట్లలో ఉంచాలి. ఇది ధన ప్రవాహం వృధా కావడాన్ని నిరోధిస్తుంది. ఎందుకంటే ఎదిగేవి ఏవైనా నీటి శక్తిని తిరిగి పీల్చుకొని రీసైకిల్‌ చేస్తుంటాయి.మీ క్యాష్‌ బాక్స్‌ను లేదా లాకర్‌ను ప్రతిఫలించేలా బీరువాలో ఒక అద్దాన్ని పెట్టండి.
 
   ఇది మీ సంపదను సంకేతాత్మకంగా రెట్టింపు చేస్తుంది.ఇంట్లో అస్సలు డబ్బు నిలబడకుండా జీవితంలోంచే అదృశ్యమైపోతున్నట్టు అనిపించినపుడు ఇంటి ఎడమ మూలన బాగా బరువుగా ఉండే వస్తులను పెట్టండి. దానితో పాటుగా బాగా వెలుతురు వచ్చేలా చూడండి.సంపదను పెంచుకోవాలంటే ఆహ్లాదకరంగా నీరు పారే శబ్దం వినిపించేలా చిన్న ఫౌంటెన్‌ ఇంట్లో పెట్టుకోండి. అది డెస్క్‌ మీద పెట్టుకునేదైనా పర్లేదు. వాటర్‌ ఫౌంటెన్‌లా డబ్బును, సంపదను ఆకర్షించే శక్తి మరేదీ లేదు. నీరు పారే శబ్దం ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది.