Friday 3 January 2014

అనేకమంది అనేక పండితులద్వారా వేదాంతం వింటూనే ఉన్నారు.

వక్తారమాసాద్య యమేవ నిత్యా సరస్వతీ స్వార్థ సమన్వితాసీత్!
నిరస్తదుస్తర్క కళంక పంకా నమామి తం శంకరమర్చితాంఘ్రిం!!

అనేకమంది అనేక పండితులద్వారా వేదాంతం వింటూనే ఉన్నారు. ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రములలో, భగవద్గీతలో, ఆ వేదాంత తత్త్వం అనేది చాలా విస్తారంగా చెప్పబడింది. దానిని మనం వింటూనే ఉన్నాం. కానీ ఎవ్వరికీ ఆ తత్త్వం అనేది సరిగా వంటబట్టిందా? ఎవరైనా ఆ తత్త్వాన్ని సరిగా మననం చేయగలుగుతున్నారా? ఆవేదాంతంలో చెప్పినటువంటి సాధనములను ఎవరైనా అనుష్ఠిస్తున్నారా? అని అంటే దానికి జవాబు ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఎన్నిసార్లు ఆ వేదాంతోపన్యాసాలు విన్నా ఆతత్త్వం సరిగా వంటబట్టడం లేదు. ఎందుకని? ఎవరిది లోపం? చెప్పేవాళ్ళది లోపమా? వినే వాళ్ళది లోపమా? చెప్పేవాళ్ళు పాపం వేదాంతంలో చాలా పరిశ్రమ చేసే చెబుతున్నారు. చేయకుండా చెప్పే వాళ్ళ విషయం నాకు తెలియదు. ఏదో పైపైన చూసుకొని చెప్పే వాళ్ల విషయం మనకి అక్కరలేదు కానీ ఆ నీలకంఠ దీక్షితులు చెప్పినట్లు " ఆకౌమారాత్ గురుచరణ శుశ్రూషయా బ్రహ్మవిద్యా స్వాస్థాయాస్థాం అహః మహతీం అర్జితం కౌశలం యత్" బాల్యం నుంచి గురుకులవాసం చేసి గురు శుశ్రూష చేసి ఆ గురువుల ముఖం నుండి వేదాంత తత్త్వాన్ని చక్కగా తెలుసుకొని ఆవేదాంతంలో పాండిత్యం సంపాదించిన పండితులు చెప్పినప్పటికీ ఎందుకు వంటబట్టడం లేదంటే మనకు వేదాంత శ్రవణ అధికారం రాలేదు. దేనికైనా ఒక యోగ్యత అనేది కావాలి. ఆరో తరగతి పిల్లవాడిని బి ఎ క్లాసులో కూర్చోబెట్టి అక్కడ పాఠాలు లెక్చరర్లు చెప్తున్నారు వాడికి వంటబట్టడం లేదు అంటే ఎలావంటబడుతుంది? బి ఎ క్లాసులో కూర్చొని ఆ పాఠాన్ని అర్థం చేసుకొనే యోగ్యత వాడికి రాలేదు. ఆయోగ్యత వాడు సంపాదించుకోవాలి. ఆ యోగ్యత సంపాదించుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాడికి అర్థమౌతుంది. కానీ యోగ్యత సంపాదించకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాడికి ఏమి అర్థం అవుతుంది? అలాగే మనకి కూడా వేదాంతం సరిగా వంటబట్టాలంటే దానికి కొంత యోగ్యత మనం సంపాదించుకోవాలి. శృతిలో చెప్పారు
"నావిరతో దుశ్చరితాత్ నా శాంతో నా సమాహితః!
నాశాంత మానసోవాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్!!"
అని కఠోపనిషత్తు చెప్పింది. దుశ్చరితాత్ అవిరతః యేనం న ఆప్నుయాత్ - మనం ఆ మంత్రార్థాన్ని సులభమైన భాషలో తెలుసుకోవాలి అంటే చెడ్డ అలవాట్లు వీడని వాడు దీనిని తెలుసుకొనజాలడు. శాస్త్రం దేనిని నిషేధించిందో దానినే మనం చాలా అపేక్షిస్తున్నాం. ఇది లోకంలో చాలా విచిత్రమైన విషయం.
ప్రాయో నేతి శృతి విషయతా విశ్వ మాధుర్య హేతుః" అన్నారు కదా! "న్యాయయాగర్థా అపి కిం అధికం లభ్యం ఉన్మార్గ వృత్యా"- డబ్బు సంపాదించడం ప్రతి ఒక్కరి అవసరం. దానిని కాదనం. కానీ దానికి ఒక రీతి ఉన్నది. న్యాయమైన మార్గం ఒకటున్నది. "న్యాయోపార్జిత విత్తేన కర్తవ్యం హ్యాత్మరక్షణం" - దానిని వదిలిపెట్టి అన్యాయమార్గంతో ఏదైతే సంపాదిస్తున్నాడో అది సరికాదు. న్యాయమార్గంలో సంపాదించినా, అన్యాయ మార్గంలో సంపాదించినా నువ్వు తినేది ఎంత? అన్యాయంగా ఎక్కువ సంపాదించిన వాడు ఎక్కువ తినగలడా? లేనప్పుడు అన్యాయ మార్గంలో సంపాదించి నువ్వు కేవలం పాపాన్ని మూటగట్టుకుంటున్నావు. అది ఎవడికి మనసుకి అర్థం కావడం లేదు. ఎంతసేపటికీ ఇంకా కావాలి. మా గురువుగారు చెప్తూ ఉండేవారు - "దారా ఇమేమే పశవశ్చ మేమే ధనాని మేమే ఇత్థం నరో మేష సమాన కంఠః అహోహ్యయం కాలవృకేణనీతః" - సంస్కృతంలో మే అనగా నాకు, మేమే అని మేకపోతులాగా అరుస్తూ చివరకు మృత్యువు రూపమైన తోడేలుతో గ్రహించబడ్డాడు. తోడేలు ఎలాగైతే మేకపోతును మింగేస్తుందో అలాగే మృత్యువు వీడిని మింగేస్తుంది. వీడు మేమే అని అంటూనే ఉన్నాడు. ఏం ప్రయోజనం చెప్పండి? ఈ మనిషియొక్క ఆశకు అంతులేదు. ఎంత సంపాదించినా నాకు చాలు అనేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడికైనా అలంబుద్ధి అనేది వస్తున్నదా? లేదు కదా! అలంబుద్ధి అనేది రానందువల్ల ఎంత అన్యాయ మార్గానికి పోవాలో అంత అన్యాయ మార్గానికి పోతున్నాడు. దానివల్ల వాడికి ఒరిగేదేమీ లేదు. కేవలం పాపం మూటగట్టుకోవలసి వస్తోంది. అన్యాయం చేయకూడదు అని శాస్త్రం చెప్పింది. అన్యాయం చేయకూడదని దేనినైతే శాస్త్రం చెప్తోందో అటువైపే వీడు మొగ్గు చూపుతున్నాడు. అలాగే "భార్యా భోగాదపి కిం అధికం పణ్యకాంతాసు భోగ్యం" వైధాదన్నాదపి కిం అధికం పర్యుదస్తేషు భోజ్యం" - ఇంట్లో తల్లో భార్యో వంట చేసి ఈశ్వర నైవేద్యం చేసి దానిని భుజిస్తే అది పవిత్రమైనది అవుతుంది. కానీ ప్రతివాడికీ ఇంట్లో మడిగా వంట చేయడం, శివపూజ చేయడం, భగవంతునికి నైవేద్యం చేసినది తీసుకోవడం అనే దాంట్లో రుచి లేదు. కటిక్కిన హోటలుకి పోయి తింటే అక్కడ రుచి. అక్కడ ఉండే రుచి ఇంట్లో మాఅమ్మో, ఆవిడో చేస్తే ఉండదండీ అంటారు. దానిని శాస్త్రం నిషేధం చేసింది. "నాపణీయమన్నమస్నీయాత్" - అన్నవిక్రయం చేసే చోట అన్నం తినకూడదు. ఇది శాస్త్రంలో ఉన్న విషయం. ఈవిధంగా మనిషియొక్క ప్రవృత్తులను చూస్తూంటే శాస్త్రం దేనిని నిషేధించిందో అదే చాలా రుచిగా ఉన్నది అంటే మనమేం చెప్పాలి. ఇదే దుశ్చరితం. ఈ దుశ్చరితాన్ని ఎవడైతే నిలిపి వేస్తాడో వాడికి ఒక యోగ్యత ఉన్నది. దీనిని ఆపాలంటే మనసు పరిశుద్ధంగా ఉండాలి. అపరిశుద్ధమైన మనసు గలిగినవానిని ఈ దుశ్చరితంనుంచి ఆపడానికి వీలుకాదు. పరిశుద్ధమైన మనస్సు ఉన్నవాడు ఈ దుశ్చరితం నుంచి బయటికి రాగలుగుతాడు. ఇవి కేవలం ఉదాహరణకి మాత్రమే.ఇటువంటివి అనేకం ఉన్నాయి మనిషి జీవితంలో. అవన్నీ మనం వివరిస్తే అనేకమంది మనస్సుకి కష్టమైతుంది. కాబట్టి ఎవడైతే చెడు అలవాట్లను మాని సదభ్యాసములను చేస్తాడో అనగా శాస్త్రం నిషేధించినటువంటి విషయాల జోలికి పోకుండా ఉంటాడో వాడు దీనికి అధికారి అవుతాడు. ఇంద్రియనిగ్రహం లేనటువంటి వాడు (ఏది చూసినా మంచి రుచికర పదార్థాన్నిచూస్తే దానిని తినాలి అనిపిస్తుంది. ఏదైనా మంచి సినిమా వస్తే దానికి పోవాలి అనిపిస్తుంది. ఆ టివిలో ప్రోగ్రాం వస్తే చూడాలనిపిస్తుంది. ఎక్కడా మనస్సు యే సమయంలో ఏది చేయాలనుకుంటుందో దానికి లోనుగావటం అదే ఇంద్రియ నిగ్రహం లేకపోవడం. అటువంటి వాడికి ఈ వేదాంతంలో అధికారం రాదు.ఈవిధంగా ఎవడైతే శాస్త్రంలో చెప్పినటువంటి యోగ్యతను సంపాదించుకుంటాడో యెటువంటి దుశ్చరితం, దురభ్యాసం లేకుండా, ఇంద్రియ లౌల్యం లేకుండా ఇంద్రియనిగ్రహం కలిగిఉండి దేనిలోనూ ఆశలేకుండా ఉంటాడో అటువంటి వాడికి వేదాంత శాస్త్రం వినే యోగ్యత వస్తుంది. భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు -
"ఇదం తే నాతపస్కాయ నా భక్తాయ కదాచన!
నచా శుశ్రూషవే వాక్యం న చ మాం యోభ్య సూయతి!!
నీకు ఉపదేశించిన ఈ శాస్త్రాన్ని తపస్సు లేనటువంటి వాడికి ఇవ్వకూడదు. తపస్సు అనగా అనేక అర్థాలు చెప్తారు. తప ఆలోచనే - ఆలోచనజ్ఞానం లేని వాడికి ఇవ్వకూడదు అని ఒక అర్థం. "మనసశ్చేంద్రియాణాం చ హయ ఐకాగ్ర్యం పరమం తపః" - ఏకాగ్రమమైన మనస్సు లేనివాడికి ;ఇది ఇవ్వకూడదు అని ఒక అర్థం. ’నియమేషు తపశ్శబ్దః" ఆపస్థంబుల వారి ధర్మసూత్రంలో తపశ్శబ్దం నియమములందు వర్తిస్తుంది అని అన్నారు. కాబట్టి నియమములు లేని వాడికి చెప్పకూడదు. ఎవడికైతే భగవంతుని యందు భక్తి లేదో వాడికి చెప్పకూడదు. ఎవడైతే గురుశుశ్రూష అనేది చేయడో వాడికిక్ చెప్పకూడదు. ఎవడైతే భగవంతుని ద్వేషిస్తాడో వాడికి చెప్పకూడదు. శంకరులన్నారు - భగవంతుడు మద్భక్తో, మాన్నమస్కురు అని తన ప్రశస్తే చేసుకున్నాడు. ఆత్మ ప్రశంశ చేసుకున్న ఆయనేం భగవంతుడు? అని ఎవడైతే భగవంతుని ద్వేషిస్తాడో అటువంటి వాడికి చెప్పదగదు. "ఇదమ సర్వశీర్షమశిష్యాయ నదేయం" "యో యది మోహాద్దాస్యతి స ఆపీయాన్ భవతి" ప్రతి ఒక్కదాంట్లోనూ దానికి ఒక అధికారి అనేవాడు ఉంటాడు. వాడికే దీనిని చెప్పాలి. ఏ విషయాన్ని తీసుకున్నా అక్కడ చివరికి ఇదొక మాటి ఉండనే ఉంటుంది. అలాగే వేదాంతానికి తగినటువంటి అధికారం మనకి లేనందువల్ల ఎన్నిమాట్లు మనం ఆ వేదాంతాన్ని విన్నా అది మనకి వంటబట్టడం లేదు. జగన్నాథ పండితుడు ఒక శ్లోకం చెప్పాడు రసగంగాధరంలో - నిష్ణాతోపిచ వేదాంతే వైరాగ్యం నైతి దుర్జనః చిరం జగనిధౌ మగ్నో మైనాక ఇవ మార్దవం" - ఎంత వేదాంత విన్నా ఆ అపరిపక్వ మనస్సు కలవాడికి వైరాగ్యం అనేది రాదు. దానికి దృష్టాంతం చెప్పాడు ఆయన. ఏదైనా ఒక పదార్థాన్ని నీళ్ళల్లో వేస్తే అది మెత్తబడుతుంది సామాన్యంగా. కానీ మైనాక పర్వతం వేల యేండ్లు సముద్రంలో ఉన్నప్పటికీ యేమాత్రం మెత్తబడలేదు. అలాగే ఎంత వేదాంతం విన్నా చిత్తశుద్ధి లేనటువంటి వాడికి వైరాగ్యం రాదు. కాబట్టి మన అందరికీ వేదాంతం సరిగా అవగాహన కావాలంటే ముందర మనయొక్క చిత్తం పరిశుద్ధం కావాలి. మనస్సు పరిశుద్ధం కావాలి. మనస్సులో ఉన్న కల్మషములు తొలగిపోవాలి. ఎప్పటివరకు ఆ కల్మషములు అలా ఉంటాయో అప్పటివరకు మనకు వేదాంతం అర్థం కాదు. అర్థం కానందువల్ల దానిలో చెప్పిన శాసనాలు అనుష్ఠానం చేయడానికి వీలుకావడం లేదు. అసలు విషయమే అర్థం కానివాడు శాసనానుష్ఠానం ఏం చేస్తాడు? ఆశాసనానుష్ఠానం చేయకపోవడం వల్ల మనకు ఫలితం రావడం లేదు. ఈవిధంగా మన పరిస్థితి త్రిశంకువు లాగా ఉన్నది. "ఈశ్వరానుగ్రహా దేవ పుంసాం అద్వైతా వాసనా" అని చెప్పి వేదాంతం వినాలనే ఆసక్తి ఉన్నది మనకి జన్మాంతర పుణ్యం వల్ల. అంతవరకు మంచి జరిగింది. పరిపూర్ణమైన యోగ్యత అనేది ఉపలబ్ధం కాలేదు. దానికి చిత్తం పరిశుద్ధం కావాలి. మనస్సులో కామక్రోధాలు దూరం కావాలి. మనకు ఎంత వింటున్నా ఎన్ని పుస్తకాలు చదువుతున్నా మనస్సులో ఉన్న కామక్రోధాలు మాత్రం తగ్గడం లేదు. ఈ కామక్రోధాల ప్రభావం వల్ల యే అకృత్యములే చేయడానికైనా తయారవుతున్నాం. ఒక చెంపన వేదాంతం వింటున్నాం. వేదాంతోపన్యాసములన్నీ విని తర్వాత యథాప్రకారంగా ఆ కామక్రోధములకు వశుడై తదనుగుణంగా ప్రవర్తిస్తే ఏమీ ఉపయోగానికి రాదు. ఒకచోట శంకరులను ప్రశ్నించారు. - "మీరు చెప్తున్నారు ఈ జీవబ్రహ్మైక్యం అనేది పరమ సిద్ధాంతం. ప్రతి ఒక్కడూ దీనిని సాక్షాత్కరింపజేసుకోవాలి అని చెప్తున్నారు. మిగతా వాళ్ళ విషయం వదిలిపెట్టండి. మరి పండితులకు కూడా ఈ సాక్షాత్కారం రావడం లేదే? ఏమంటారు? అని అంటే దానికి శంకరులు "శృణుతేషాం పాండిత్యం యత్ క్షేత్ర ఏవ ఆత్మదర్శనం" - నాయనా మరి యే పండితుల గురించి నీవు మాట్లాడుతున్నావు? ఈ శరీరాన్నే ఆత్మ అనుకొనే పండితుల గురించా? వారికి ఈ అనుభవం రాకపోవటం వాస్తవమే. పారిభాషికమైన పాండిత్యం వాళ్ళది. నిజంగా పండా అని అంటే ఆత్మజ్ఞానం. "సా యేషాం సంజాతా తే పండితాః" అటువంటి పండితులకు బ్రహ్మ సాక్షాత్కారం ఉన్నది అనడంలో సందేహమే లేదు. వేదాంతం మనకి అవగాహన కావాలి అంటే చిత్తం పరిశుద్ధం కావాలి. దానికి మనం కృషి చేయాలి. వీలైనంత మన చిత్తంలో నుంచి కామక్రోధములను దూరం చేయాలి. ఎందుకంటే అతి శత్రువులుగా అవి మన అంతఃకరణంలో కూర్చున్నాయి. బయటి శత్రువుల వల్ల మనకు అంతపెద్ద ఉపద్రవం కాదు. భగవంతుడు భగవద్గీతలో ఈ శరీర అంతఃకరణంలోనే ఉన్నటువంటి కామక్రోధములనే ఈ శత్రువులను పారద్రోలవయ్యా అని అన్నాడు. ఎందుకంటే ఈ కామక్రోధములతో కూడిన వాడికి వాడి జ్ఞానం ఆవృతమైపోతుంది. అటువంటివాడు తప్పులు చేస్తున్నాడు. మరి పెద్దపెద్ద వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు కదా! అంటే ఆసమయంలో వారియొక్క జ్ఞానం ఆచ్ఛాదితమైపోతున్నది. వాటిని దూరం చేస్తేనే కానీ మనకు యోగ్యత రాదు. అందుకు మనం ప్రయత్నం చేయాలి. ఇవాళ ప్రయత్నం చేస్తే రేపే సిద్ధిస్తుంది అని చెప్పడానికి వీలులేదు. ప్రయత్నం మొదలెట్టాము అని అంటే ఎన్నటికో ఒకరోజుకి అది సిద్ధిస్తుంది. కానీ ప్రయత్నమే మొదలుపెట్టని వాడికి ఎన్నటికి సిద్ధిస్తుంది? అందువల్ల కామక్రోధములను దూరం చేసుకొని చిత్తమును పరిశుద్ధమును చేసుకున్నవాడు వేదాంత తత్త్వాన్ని సరిగా అర్థం చేసుకోగలుగుతాడు. వాడు అప్పుడు వేదాంతంలో చెప్పిన సాధనానుష్ఠానం చేసి ఆ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. ఇదే రాజమార్గం. దీనిని మనం సరిగా అర్థం చేసుకోవాలి. దానికి భగవదనుగ్రహం కావాలి. భగవంతా! నాయొక్క మనస్సు పరిశుద్ధమయేటట్లు చెయ్యి! నామనస్సులోని కామక్రోధములు దూరమయేటట్లు చెయ్యి! నన్ను తత్త్వజ్ఞానానికి అధికారిని చెయ్యి! అని మనం భగవంతుని ప్రార్థించాలి. ఆ భగవంతుని కృపవల్ల మనయొక్క చిత్తం పరిశుద్ధమై తత్త్వజ్ఞానానికి అధికారులం కావాలి. అందరికీ భగవంతుడు ఆ విధమైన అనుగ్రహం చేసి అందరినీ కాపాడుగాక! అని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

హర నమః పార్వతీపతయే హరహర మహాదేవ!!
వక్తారమాసాద్య యమేవ నిత్యా సరస్వతీ స్వార్థ సమన్వితాసీత్!
నిరస్తదుస్తర్క కళంక పంకా నమామి తం శంకరమర్చితాంఘ్రిం!!

అనేకమంది అనేక పండితులద్వారా వేదాంతం వింటూనే ఉన్నారు. ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రములలో, భగవద్గీతలో, ఆ వేదాంత తత్త్వం అనేది చాలా విస్తారంగా చెప్పబడింది. దానిని మనం వింటూనే ఉన్నాం. కానీ ఎవ్వరికీ ఆ తత్త్వం అనేది సరిగా వంటబట్టిందా? ఎవరైనా ఆ తత్త్వాన్ని సరిగా మననం చేయగలుగుతున్నారా? ఆవేదాంతంలో చెప్పినటువంటి సాధనములను ఎవరైనా అనుష్ఠిస్తున్నారా? అని అంటే దానికి జవాబు ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఎన్నిసార్లు ఆ వేదాంతోపన్యాసాలు విన్నా ఆతత్త్వం సరిగా వంటబట్టడం లేదు. ఎందుకని? ఎవరిది లోపం? చెప్పేవాళ్ళది లోపమా? వినే వాళ్ళది లోపమా? చెప్పేవాళ్ళు పాపం వేదాంతంలో చాలా పరిశ్రమ చేసే చెబుతున్నారు. చేయకుండా చెప్పే వాళ్ళ విషయం నాకు తెలియదు. ఏదో పైపైన చూసుకొని చెప్పే వాళ్ల విషయం మనకి అక్కరలేదు కానీ ఆ నీలకంఠ దీక్షితులు చెప్పినట్లు " ఆకౌమారాత్ గురుచరణ శుశ్రూషయా బ్రహ్మవిద్యా స్వాస్థాయాస్థాం అహః మహతీం అర్జితం కౌశలం యత్" బాల్యం నుంచి గురుకులవాసం చేసి గురు శుశ్రూష చేసి ఆ గురువుల ముఖం నుండి వేదాంత తత్త్వాన్ని చక్కగా తెలుసుకొని ఆవేదాంతంలో పాండిత్యం సంపాదించిన పండితులు చెప్పినప్పటికీ ఎందుకు వంటబట్టడం లేదంటే మనకు వేదాంత శ్రవణ అధికారం రాలేదు. దేనికైనా ఒక యోగ్యత అనేది కావాలి. ఆరో తరగతి పిల్లవాడిని బి ఎ క్లాసులో కూర్చోబెట్టి అక్కడ పాఠాలు లెక్చరర్లు చెప్తున్నారు వాడికి వంటబట్టడం లేదు అంటే ఎలావంటబడుతుంది? బి ఎ క్లాసులో కూర్చొని ఆ పాఠాన్ని అర్థం చేసుకొనే యోగ్యత వాడికి రాలేదు. ఆయోగ్యత వాడు సంపాదించుకోవాలి. ఆ యోగ్యత సంపాదించుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాడికి అర్థమౌతుంది. కానీ యోగ్యత సంపాదించకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాడికి ఏమి అర్థం అవుతుంది? అలాగే మనకి కూడా వేదాంతం సరిగా వంటబట్టాలంటే దానికి కొంత యోగ్యత మనం సంపాదించుకోవాలి. శృతిలో చెప్పారు
"నావిరతో దుశ్చరితాత్ నా శాంతో నా సమాహితః!
నాశాంత మానసోవాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్!!"
అని కఠోపనిషత్తు చెప్పింది. దుశ్చరితాత్ అవిరతః యేనం న ఆప్నుయాత్ - మనం ఆ మంత్రార్థాన్ని సులభమైన భాషలో తెలుసుకోవాలి అంటే చెడ్డ అలవాట్లు వీడని వాడు దీనిని తెలుసుకొనజాలడు. శాస్త్రం దేనిని నిషేధించిందో దానినే మనం చాలా అపేక్షిస్తున్నాం. ఇది లోకంలో చాలా విచిత్రమైన విషయం.
ప్రాయో నేతి శృతి విషయతా విశ్వ మాధుర్య హేతుః" అన్నారు కదా! "న్యాయయాగర్థా అపి కిం అధికం లభ్యం ఉన్మార్గ వృత్యా"- డబ్బు సంపాదించడం ప్రతి ఒక్కరి అవసరం. దానిని కాదనం. కానీ దానికి ఒక రీతి ఉన్నది. న్యాయమైన మార్గం ఒకటున్నది. "న్యాయోపార్జిత విత్తేన కర్తవ్యం హ్యాత్మరక్షణం" - దానిని వదిలిపెట్టి అన్యాయమార్గంతో ఏదైతే సంపాదిస్తున్నాడో అది సరికాదు. న్యాయమార్గంలో సంపాదించినా, అన్యాయ మార్గంలో సంపాదించినా నువ్వు తినేది ఎంత?  అన్యాయంగా ఎక్కువ సంపాదించిన వాడు ఎక్కువ తినగలడా? లేనప్పుడు అన్యాయ మార్గంలో సంపాదించి నువ్వు కేవలం పాపాన్ని మూటగట్టుకుంటున్నావు. అది ఎవడికి మనసుకి అర్థం కావడం లేదు. ఎంతసేపటికీ ఇంకా కావాలి. మా గురువుగారు చెప్తూ ఉండేవారు - "దారా ఇమేమే పశవశ్చ మేమే ధనాని మేమే ఇత్థం నరో మేష సమాన కంఠః  అహోహ్యయం కాలవృకేణనీతః" - సంస్కృతంలో మే అనగా నాకు, మేమే అని మేకపోతులాగా అరుస్తూ చివరకు మృత్యువు రూపమైన తోడేలుతో గ్రహించబడ్డాడు. తోడేలు ఎలాగైతే మేకపోతును మింగేస్తుందో అలాగే మృత్యువు వీడిని మింగేస్తుంది. వీడు మేమే అని అంటూనే ఉన్నాడు. ఏం ప్రయోజనం చెప్పండి? ఈ మనిషియొక్క ఆశకు అంతులేదు. ఎంత సంపాదించినా నాకు చాలు అనేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడికైనా అలంబుద్ధి అనేది వస్తున్నదా? లేదు కదా! అలంబుద్ధి అనేది రానందువల్ల ఎంత అన్యాయ మార్గానికి పోవాలో అంత  అన్యాయ మార్గానికి పోతున్నాడు. దానివల్ల వాడికి ఒరిగేదేమీ లేదు. కేవలం పాపం మూటగట్టుకోవలసి వస్తోంది. అన్యాయం  చేయకూడదు అని శాస్త్రం చెప్పింది. అన్యాయం చేయకూడదని దేనినైతే శాస్త్రం చెప్తోందో అటువైపే వీడు మొగ్గు చూపుతున్నాడు. అలాగే  "భార్యా భోగాదపి కిం అధికం పణ్యకాంతాసు భోగ్యం" వైధాదన్నాదపి కిం అధికం పర్యుదస్తేషు భోజ్యం" - ఇంట్లో తల్లో భార్యో వంట చేసి ఈశ్వర నైవేద్యం చేసి దానిని భుజిస్తే అది పవిత్రమైనది అవుతుంది. కానీ ప్రతివాడికీ ఇంట్లో మడిగా వంట చేయడం, శివపూజ చేయడం, భగవంతునికి నైవేద్యం చేసినది తీసుకోవడం అనే దాంట్లో రుచి లేదు.  కటిక్కిన హోటలుకి పోయి తింటే అక్కడ రుచి.  అక్కడ ఉండే రుచి ఇంట్లో మాఅమ్మో, ఆవిడో చేస్తే ఉండదండీ అంటారు. దానిని శాస్త్రం నిషేధం చేసింది. "నాపణీయమన్నమస్నీయాత్"  - అన్నవిక్రయం చేసే చోట అన్నం తినకూడదు. ఇది శాస్త్రంలో ఉన్న విషయం. ఈవిధంగా మనిషియొక్క ప్రవృత్తులను చూస్తూంటే శాస్త్రం దేనిని నిషేధించిందో అదే చాలా రుచిగా ఉన్నది అంటే మనమేం చెప్పాలి. ఇదే దుశ్చరితం. ఈ దుశ్చరితాన్ని ఎవడైతే నిలిపి వేస్తాడో  వాడికి ఒక యోగ్యత ఉన్నది. దీనిని ఆపాలంటే మనసు పరిశుద్ధంగా ఉండాలి. అపరిశుద్ధమైన మనసు గలిగినవానిని ఈ దుశ్చరితంనుంచి ఆపడానికి వీలుకాదు. పరిశుద్ధమైన మనస్సు ఉన్నవాడు ఈ దుశ్చరితం నుంచి బయటికి రాగలుగుతాడు. ఇవి కేవలం ఉదాహరణకి మాత్రమే.ఇటువంటివి అనేకం ఉన్నాయి మనిషి  జీవితంలో. అవన్నీ మనం వివరిస్తే అనేకమంది మనస్సుకి కష్టమైతుంది. కాబట్టి ఎవడైతే చెడు అలవాట్లను మాని సదభ్యాసములను చేస్తాడో అనగా శాస్త్రం నిషేధించినటువంటి విషయాల జోలికి పోకుండా ఉంటాడో  వాడు దీనికి అధికారి అవుతాడు. ఇంద్రియనిగ్రహం లేనటువంటి వాడు (ఏది చూసినా మంచి రుచికర పదార్థాన్నిచూస్తే దానిని తినాలి అనిపిస్తుంది. ఏదైనా మంచి సినిమా వస్తే దానికి పోవాలి అనిపిస్తుంది. ఆ టివిలో ప్రోగ్రాం వస్తే చూడాలనిపిస్తుంది. ఎక్కడా మనస్సు యే సమయంలో ఏది చేయాలనుకుంటుందో దానికి లోనుగావటం అదే ఇంద్రియ నిగ్రహం లేకపోవడం. అటువంటి వాడికి ఈ వేదాంతంలో అధికారం రాదు.ఈవిధంగా ఎవడైతే శాస్త్రంలో చెప్పినటువంటి యోగ్యతను సంపాదించుకుంటాడో  యెటువంటి దుశ్చరితం, దురభ్యాసం లేకుండా, ఇంద్రియ లౌల్యం లేకుండా ఇంద్రియనిగ్రహం కలిగిఉండి  దేనిలోనూ ఆశలేకుండా ఉంటాడో  అటువంటి వాడికి వేదాంత శాస్త్రం వినే యోగ్యత వస్తుంది. భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు -
 "ఇదం తే నాతపస్కాయ నా భక్తాయ కదాచన!
నచా శుశ్రూషవే వాక్యం న చ మాం యోభ్య సూయతి!!
 నీకు ఉపదేశించిన ఈ శాస్త్రాన్ని తపస్సు లేనటువంటి వాడికి ఇవ్వకూడదు. తపస్సు అనగా అనేక అర్థాలు చెప్తారు. తప ఆలోచనే - ఆలోచనజ్ఞానం లేని వాడికి ఇవ్వకూడదు అని ఒక అర్థం. "మనసశ్చేంద్రియాణాం చ హయ ఐకాగ్ర్యం పరమం తపః" - ఏకాగ్రమమైన మనస్సు లేనివాడికి ;ఇది ఇవ్వకూడదు అని ఒక అర్థం. ’నియమేషు తపశ్శబ్దః" ఆపస్థంబుల వారి ధర్మసూత్రంలో తపశ్శబ్దం నియమములందు వర్తిస్తుంది అని అన్నారు. కాబట్టి  నియమములు లేని వాడికి చెప్పకూడదు. ఎవడికైతే భగవంతుని యందు భక్తి లేదో వాడికి చెప్పకూడదు. ఎవడైతే గురుశుశ్రూష అనేది చేయడో వాడికిక్ చెప్పకూడదు. ఎవడైతే భగవంతుని ద్వేషిస్తాడో వాడికి చెప్పకూడదు. శంకరులన్నారు - భగవంతుడు మద్భక్తో, మాన్నమస్కురు అని తన ప్రశస్తే చేసుకున్నాడు. ఆత్మ ప్రశంశ చేసుకున్న ఆయనేం భగవంతుడు? అని ఎవడైతే భగవంతుని ద్వేషిస్తాడో అటువంటి వాడికి చెప్పదగదు. "ఇదమ సర్వశీర్షమశిష్యాయ నదేయం"  "యో యది మోహాద్దాస్యతి  స ఆపీయాన్ భవతి" ప్రతి ఒక్కదాంట్లోనూ దానికి ఒక అధికారి అనేవాడు ఉంటాడు. వాడికే దీనిని చెప్పాలి. ఏ విషయాన్ని తీసుకున్నా అక్కడ చివరికి ఇదొక మాటి ఉండనే ఉంటుంది. అలాగే వేదాంతానికి తగినటువంటి అధికారం మనకి లేనందువల్ల ఎన్నిమాట్లు మనం ఆ వేదాంతాన్ని విన్నా అది మనకి వంటబట్టడం లేదు. జగన్నాథ పండితుడు ఒక శ్లోకం చెప్పాడు రసగంగాధరంలో - నిష్ణాతోపిచ వేదాంతే వైరాగ్యం నైతి దుర్జనః చిరం జగనిధౌ మగ్నో మైనాక ఇవ మార్దవం" - ఎంత వేదాంత విన్నా ఆ అపరిపక్వ మనస్సు కలవాడికి వైరాగ్యం అనేది రాదు. దానికి దృష్టాంతం చెప్పాడు ఆయన. ఏదైనా ఒక పదార్థాన్ని నీళ్ళల్లో వేస్తే అది మెత్తబడుతుంది సామాన్యంగా. కానీ మైనాక పర్వతం వేల యేండ్లు సముద్రంలో ఉన్నప్పటికీ యేమాత్రం మెత్తబడలేదు. అలాగే ఎంత వేదాంతం విన్నా చిత్తశుద్ధి లేనటువంటి వాడికి వైరాగ్యం రాదు. కాబట్టి మన అందరికీ వేదాంతం సరిగా అవగాహన కావాలంటే ముందర మనయొక్క చిత్తం పరిశుద్ధం కావాలి. మనస్సు పరిశుద్ధం కావాలి. మనస్సులో ఉన్న కల్మషములు తొలగిపోవాలి. ఎప్పటివరకు ఆ కల్మషములు అలా ఉంటాయో అప్పటివరకు మనకు వేదాంతం అర్థం కాదు. అర్థం కానందువల్ల దానిలో చెప్పిన శాసనాలు అనుష్ఠానం చేయడానికి వీలుకావడం లేదు. అసలు విషయమే అర్థం కానివాడు శాసనానుష్ఠానం ఏం చేస్తాడు? ఆశాసనానుష్ఠానం చేయకపోవడం వల్ల మనకు ఫలితం రావడం లేదు. ఈవిధంగా మన పరిస్థితి త్రిశంకువు లాగా ఉన్నది. "ఈశ్వరానుగ్రహా దేవ పుంసాం అద్వైతా వాసనా" అని చెప్పి వేదాంతం వినాలనే ఆసక్తి ఉన్నది మనకి జన్మాంతర పుణ్యం వల్ల. అంతవరకు మంచి జరిగింది. పరిపూర్ణమైన యోగ్యత అనేది ఉపలబ్ధం కాలేదు. దానికి చిత్తం పరిశుద్ధం కావాలి. మనస్సులో కామక్రోధాలు దూరం కావాలి. మనకు ఎంత వింటున్నా ఎన్ని పుస్తకాలు చదువుతున్నా మనస్సులో ఉన్న కామక్రోధాలు మాత్రం తగ్గడం లేదు. ఈ కామక్రోధాల ప్రభావం వల్ల యే అకృత్యములే చేయడానికైనా తయారవుతున్నాం. ఒక చెంపన వేదాంతం వింటున్నాం. వేదాంతోపన్యాసములన్నీ విని తర్వాత యథాప్రకారంగా ఆ కామక్రోధములకు వశుడై తదనుగుణంగా ప్రవర్తిస్తే ఏమీ ఉపయోగానికి రాదు. ఒకచోట శంకరులను ప్రశ్నించారు.  - "మీరు చెప్తున్నారు ఈ జీవబ్రహ్మైక్యం అనేది పరమ సిద్ధాంతం. ప్రతి ఒక్కడూ దీనిని సాక్షాత్కరింపజేసుకోవాలి అని చెప్తున్నారు. మిగతా వాళ్ళ విషయం వదిలిపెట్టండి. మరి పండితులకు కూడా ఈ సాక్షాత్కారం రావడం లేదే? ఏమంటారు? అని అంటే దానికి శంకరులు   "శృణుతేషాం పాండిత్యం యత్ క్షేత్ర ఏవ ఆత్మదర్శనం" - నాయనా మరి యే పండితుల గురించి నీవు మాట్లాడుతున్నావు? ఈ శరీరాన్నే ఆత్మ అనుకొనే పండితుల గురించా? వారికి ఈ అనుభవం రాకపోవటం వాస్తవమే. పారిభాషికమైన పాండిత్యం వాళ్ళది. నిజంగా పండా అని అంటే ఆత్మజ్ఞానం. "సా యేషాం సంజాతా తే పండితాః" అటువంటి పండితులకు బ్రహ్మ సాక్షాత్కారం ఉన్నది అనడంలో సందేహమే లేదు. వేదాంతం మనకి అవగాహన కావాలి అంటే చిత్తం పరిశుద్ధం కావాలి. దానికి మనం కృషి చేయాలి. వీలైనంత మన చిత్తంలో నుంచి కామక్రోధములను దూరం చేయాలి. ఎందుకంటే అతి శత్రువులుగా అవి మన అంతఃకరణంలో కూర్చున్నాయి. బయటి శత్రువుల వల్ల మనకు అంతపెద్ద ఉపద్రవం కాదు. భగవంతుడు భగవద్గీతలో ఈ శరీర అంతఃకరణంలోనే ఉన్నటువంటి కామక్రోధములనే ఈ శత్రువులను పారద్రోలవయ్యా అని అన్నాడు. ఎందుకంటే ఈ కామక్రోధములతో కూడిన వాడికి వాడి జ్ఞానం ఆవృతమైపోతుంది. అటువంటివాడు తప్పులు చేస్తున్నాడు. మరి పెద్దపెద్ద వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు కదా! అంటే ఆసమయంలో వారియొక్క జ్ఞానం ఆచ్ఛాదితమైపోతున్నది. వాటిని దూరం చేస్తేనే కానీ మనకు యోగ్యత రాదు. అందుకు మనం ప్రయత్నం చేయాలి. ఇవాళ ప్రయత్నం చేస్తే రేపే సిద్ధిస్తుంది అని చెప్పడానికి వీలులేదు. ప్రయత్నం మొదలెట్టాము అని అంటే ఎన్నటికో ఒకరోజుకి అది సిద్ధిస్తుంది. కానీ ప్రయత్నమే మొదలుపెట్టని వాడికి ఎన్నటికి సిద్ధిస్తుంది? అందువల్ల కామక్రోధములను దూరం చేసుకొని చిత్తమును పరిశుద్ధమును చేసుకున్నవాడు వేదాంత తత్త్వాన్ని సరిగా అర్థం చేసుకోగలుగుతాడు. వాడు అప్పుడు వేదాంతంలో చెప్పిన సాధనానుష్ఠానం చేసి ఆ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. ఇదే రాజమార్గం. దీనిని మనం సరిగా అర్థం చేసుకోవాలి. దానికి భగవదనుగ్రహం కావాలి. భగవంతా! నాయొక్క మనస్సు పరిశుద్ధమయేటట్లు చెయ్యి! నామనస్సులోని కామక్రోధములు దూరమయేటట్లు చెయ్యి! నన్ను తత్త్వజ్ఞానానికి అధికారిని చెయ్యి!  అని మనం భగవంతుని ప్రార్థించాలి. ఆ భగవంతుని కృపవల్ల మనయొక్క చిత్తం పరిశుద్ధమై తత్త్వజ్ఞానానికి అధికారులం కావాలి. అందరికీ భగవంతుడు ఆ విధమైన అనుగ్రహం చేసి అందరినీ కాపాడుగాక! అని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

హర నమః పార్వతీపతయే హరహర మహాదేవ!!