Thursday 30 January 2014

విష్ణువుకి ఏ పాత్రలో నైవేద్యం పెట్టాలో మీకు తెలుసా?


Subha Mantrala


విష్ణువుకి ఏ పాత్రలో నైవేద్యం పెట్టాలో మీకు తెలుసా?

did you know which metal container use naivedyam for lord vishnu

సాధారాణంగా ఆలయదర్శనానికి వెళ్ళినపుడు, అక్కడ అర్చకులు స్వామికి ఓ పాత్రలో నైవేద్యాన్ని పెడుతుండటాన్ని చూస్తుంటాం. ముఖ్యంగా శ్రీమహావిష్ణువుకు రాగిపాత్రలో నైవేద్యమంటే అమిత ఇష్టం. ఇందువెనుక ఒక కధ వుంది. ఆ కథను సాక్షాత్తు శ్రీమహావిష్ణువే చెప్పాడు. పూర్వం గుడాకేశుడనే రాక్షసుడుండేవాడు. అతడు పుట్టుకతో రాక్షసుడైనప్పటికి, ఎలాంటి రాక్షస లక్షణాలు లేకుండా దైవచింతనలో కాలాన్ని వెళ్ళబుచ్చుతుండే వాడు. గుడాకేశుడు విష్ణుభక్తుడు. నిరంతరం విష్ణునామాన్నే జపిస్తూ ధర్మకార్యాలను నిర్వర్తిస్తుందేవాడు.

ఇదిలాఉండగా, ఆ రాక్షసునికి విష్ణువును గురించి తపస్సుచేయాలనిపించింది. ఫలితంగా, ఆ రాక్షసుడు పదహారువేల సవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చేసాడు. అతని తపస్సు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. దానికి గుడాకేశుడు, తనకు ఏమి అక్కరలేదని, కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు. అలాగే తన మరణం విష్ణు చక్రం వల్ల సంభవించాలని, తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధాన మయ్యాడు. గుడాకేశుడు సంతోషించాడు.

విష్ణుమూర్తి అనుగ్రహించిన అనంతరం గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. వైశాఖ శుద్ద ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిశ్చయించుకుని, మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. తన కోరిక ఎప్పుడు నెరవేరుతుందా? అని ఎదురు చూస్తున్న గుడాకేశుడు మిక్కిలి సంతోషించాడు. విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించిది. వెంటనే అతడి మాంసమంతా రాగిగా మారిపోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారాయి. గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారైంది. ఆ పాత్రలో విష్ణువుకు నైవేద్యం సమర్పించబడింది. ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించదమంటే విష్ణువుకు ఎంతో ఇష్టం. అనంతరం తన భక్తులు కూడా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలని సూచించాడు విష్ణుమూర్తి.

రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులుంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలాడని విష్ణుమూర్తి సెలవిచ్చాడు. విష్ణుమూర్తికి రాగిపాత్రలో నైవేద్యాన్ని సమర్పంచడం వెనుక కధ ఇది. సత్యనారాయణస్వామికి ఎర్రగోధుమ నూక ప్రసాదం ఇష్టం. పరమశివునికి చిమ్మిలి, గణపతికి కుడుములు, మహాలక్ష్మికి పానకం, వదపప్పు, శ్రీలలితామాతకు గోక్షీరాన్నం, పులిహోర ఇష్టం. కృష్ణునికి అటుకులు, బెల్లం ఇష్టం. ఇలా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క ప్రసాదం ఇష్టం