Tuesday 10 April 2012

సుతుడు - పితరుడు

భగవద్గీతకు నాయకుడు శ్రీకృష్ణుడయితే శబరిమల కధానాయకుడు అయ్యప్ప. భగవద్గీతలో మురహరి ఆత్మసారాన్ని 18 అధ్యాయాల్లో చెబితే,అయ్యప్ప ఇదే ఆత్మసారాన్ని 18 పడిమెట్ల రూపంలో వివరించాడు. అంతర్గతంగా భగవద్గీత యోగసారమైతే అయ్యప్ప సన్నిధిలోని 18 మెట్లు జీవితానుభవసారం. భవగీతలోని 18 అధ్యాయాలకూ అయ్యప్ప గుడిలోని 18 పడిమెట్లకు ఎన్నో సారూప్య, సామీప్య జ్ఞాన, యోగ సంబంధాలున్నాయి. మోక్షసాధనకు, ఆత్మవిచారానికి శబరిమలేశుని సన్నిధిలోని 18 మెట్లు వంటివే భగవద్గీతలోని 18 అధ్యాయాలు, శబరిమలోనున్న 19 మెట్లయందు కొలువైన దేవతలూ, భగవత్గీతలోని 18 అధ్యాయాలు ప్రతిబింబిస్తున్న 18 మంది దేవతలూ ఒకరే కావటం ఒక విశేషం, వారు "-

శ్లో!! గీతాగంగా చ గాయత్రీ సీతా సత్యా సరస్వతీ,
...బ్రహ్మవిద్యా బ్రహ్మవల్లీ త్రిసంధ్యా ముక్తి గేహినీ,
అర్ధమాత్రా చిదానందా భవఘ్నే భయనాశినీ,
వేదత్రయా పరానంతా త్వత్త్వర్ధా జ్ఞానమంజరీ,
ఇత్యేతాని జపన్నిత్యం నరో నిశ్చలమానస,
జ్ఞానసిద్ధిం లభేత్ శీఘ్రం తధాంతే పరమంపదం.
వరాహపురాణం.
శ్రీరాముడు - అయ్యప్ప

శబరి మాతకు వరమిచ్చి మరికొంతదూరం వెళ్ళిన స్వామికి రామానామం అవిశ్రాంతంగా జపిస్తూ, రామధ్యానంలోనున్న ఆంజనేయుడు తారసపడ్డాడు. ఆంజనేయుని భక్తికి ముచ్చటపడిన మణికంఠుడు ఆంజనేయునికి మరొకసారి రాముని దర్శనం కలిగించాలని ఆశించాడు. ఆ వెంటనే నాయనా! ఆంజనేయా! ఇదిగో నీ రాముణ్ణి వచ్చాను. కనులు తెరిచి చూడు అంటూ ప్రశాంతంగా పలికాడు. కనులు తెరిచిన హనుమాంకు రాముడి బదులు వేరెవరో కనబడటం విసుగు కలిగించినది. నా రాముడినంటూ ప్రగల్భాలు పలకడం నీకు తగదు అని వారించాడు. నాయనా! నేను ప్రగల్భాలు పలకడం లేదు, ప్రశాంతంగా ఒక్కసారి కళ్ళు తెరిచి తీక్షణంగా చూడు. నీకు రాముడు తప్పక దర్శనమిస్తాడు. ఇదిగో నేనే నీ రాముణ్ణీ అని చిద్విలాసంగా పలికాడు మణికంఠుడు. ఈసారి కేసరీసుతుడు తదేకంగా చూసాడు. విల్లమ్ములు ధరించిన శ్రీరాచంద్రమూర్తి కనబడ్డాడు అయ్యప్పస్వామిలో. ఒక్క క్షణం జరిగినదేమిటో గ్రహించలేక తత్తరపడిన ఆంజనేయుడు ఆనందంతో లేచి స్వామికి అబివందనం చేసాడు. మనసారా ఆశీస్సులందించాడు ఆ శ్రీరామచంద్రమూర్తి. దేవదేవులు సైతం ఈ తతంగం చూసి ముచ్చటపడ్డారు. యుగాలు మారినా మారని ఆంజనేయుని శ్రీరామభక్తికి ఇదొక చక్కని తార్కాణం. అయ్యప్ప కరుణకు ఇదొక ఉదాహరణ, అలా ముందుకు సాగాడు మహోన్నతుడైన మణికంఠుదు
అయ్యప్ప స్వామి - ఇరుముడి

ఇరుముడి అంటే రెండు ముడులు అని అర్ధం, ఆ రెండిటిలో ఒకదానిలో నేతి కొబ్బరికాయని ఉంచుతారు.మరొక దానిలో భక్తులు దారిలో వండుకుతినటానికి కావలసిన పప్పుదినుసులు, దారిలో దేవుళ్ళకు కొట్టే కొబ్బరికాయలు ఉంచుతారు. నేతి కొబ్బరికాయతోనే స్వామికి అభిషేకం చేస్తారు. మూడు కన్నుల కొబ్బరికాయ పరిపూర్ణంగా శివ స్వరూపమే. ఏనెయ్యి అయినా విష్ణుస్వరూపంగా చెప్పబడుతుంది. ఇక,శ్రీమహాలక్ష్మిగా చెప్పబడేది ఆవునెయ్యి, అంటే నేతి కొబ్బరికాయ అంటే శివకేశవ. శ్రీమహాలక్ష్మిల సంపూర్ణ స్వరూపం అన్నమాట. అంటే సకల దేవతలను ఆరాధించడమే తన సంపూర్ణతత్వమని అలా ఏ బేధభావాలు లేనివారే తనకు అత్యంత ప్రీతి పాత్రులవుతారని స్వామి సందేశం. ఇలా దేవదేవుల పరిపూర్ణ స్వరూపం గనుకనే, నేతికొబ్బరికాయను పొందియుండే ఇరుముడిని ఎంతో పవిత్రంగా చూడాలని అంటారు. అందుకే, గురుస్వామిగనీ,లేదా శబరికొండకు మూడు సార్లుపైగా వెళ్ళి వచ్చిన వారు గానీ ఇరునుడిని క్రిందకు దించే అర్హతను పొందియుంటారే తప్ప కొండకు వెళ్ళే అందరూ ఎవరికి వారు ఇరుముడిని దించుకోవాడానికి అర్హతను పొందిఉండరు. ఏ బృందంలోనైనా మూడు సార్ల కంటే తక్కువగా వెళ్ళుతున్న వారి ఇరుముడిని గురుస్వామిగానీ, బృందంలో ఎక్కువసార్లు కొండకు వెళ్ళి స్వామిని దర్శించుకున్నవారుగానీ దింపుతారు. ఇరుముడి ఇంత శ్రేష్టమైనది గనుకనే, పూర్వపు రోజులలో అయితే, ఇరుముడి లేనివారిని అసలు స్వామి దర్శనానికి అనుమతించేవారు కానేకాదు. కానీ కాలంతో ఏర్పడిన మార్పులతో దేవాలయ విధానాలలో కూడా కొన్ని మార్పులు చొటుచేసుకోవడంతో ఇరుముడి లేని వారికి కొంత సర్దుబాటుతో దేవాల ప్రవేశార్హత కలుగజేస్తున్నారు.