Saturday 29 June 2013

సర్వజగత్తుకు సృష్టికర్త శ్రీజగజ్జననీ అమ్మవారు. సకల చరాచర జగత్తును సృష్టించినటువంటి తొలిదినాల్లో అమ్మవారు భూమండలంలోనే ప్రపంచంలో, భారతదేశంలో, జమ్మూకాశ్మీర్ హిమాలయ పర్వతాల్లో సముద్రమట్టానికి 19,500 అడుగుల ఎత్తులో విరాట్ స్వరూపంతో స్వయంభువుగా వెలసింది. ఈ ఆలయానికి దగ్గరలోనే మానస సరోవరం వుండేది. ఈ సరోవరంలో ముక్కోటి దేవతలందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరించి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళేవారని మన పురాణ గ్రంథాలు మరియు వేదాలు తెలియజేస్తున్నవి. కాపాలికావిథి, పూర్వాచారగాణా పత్యవిథి, వామకేశ్వరతంత్రం, కౌలాచార తంత్రం, శక్తిస్థల్, దేవీ భాగవత పురాణాలు, బ్రహ్మ, విష్ణు, శైవ, బ్రహ్మవైవర్త కార్తికేయ పురాణాల్లో శ్రీ జగజ్జననీ అమ్మవారి గురించి క్షుణ్ణంగా తెలుసుకొనవచ్చును. ఈ అమ్మవారికి భర్త అనేటువంటి శక్తి ఈ సృష్టిలో ఎక్కడా లేదు. తన ఇచ్ఛానుసారము భర్తగాను, భార్యగాను రూపాంతరం చెందుతూ వుంటుంది. తన నుంచి వచ్చిన అంశామూర్తులకే భర్త అనేటువంటి శక్తి వుంటుంది. పార్వతికి శివుడు, లక్ష్మికి విష్ణువు, సరస్వతికి బ్రహ్మ యిత్యాదిగా వుంటారు. ఈ అమ్మవారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో, ఒక్కొక్క రూపంతో వెలుస్తూంటుంది. కనుక ఈ అమ్మను మహామాయ, యోగమాయ, అదిపరాశక్తి అని కూడా పిలుస్తుంటారు. కాకపోతే జగత్తునంతా సృష్టించినటువంటి తల్లి కాబట్టి జగజ్జనని అనే పేరున ప్రసిద్ధమైంది. ఈ అమ్మవారు హిమాలయాల్లో విరాట్ స్వరూపంతో ఏ విధంగా ఐతే వెలిసిందో ఇప్పుడు మన నంద్యాల పట్టణంలో కలియుగంలో అదే విధంగా వెలసింది. అమ్మవారి కడుపులో పంచముఖశివుడు, పాదపీఠశాయిగా శ్రీ మహావిష్ణువు, మహావిష్ణువు నాభి నుండి పశ్చిమ భాగంలోని క్రింది చేతిలో చతుర్ముఖ బ్రహ్మ వుంటారు.

అమ్మవారి కుడవైపు ఒక చేతిలో చంద్రమండలం, 2వ చేతిలో భూమండలం, 3వ చేతిలో సూర్యమండలం, లక్ష్మి దేవి, అభయ హస్తంలో త్రినేత్రం, త్రిశూలం మరియు ఎడమ వైపు ఒక చేతిలో శంఖు, 2వ చేతిలో ఢమరుకం, 3వ చేతిలో ధనుస్సు, 4వ చేతిలో చతుర్ముఖ బ్రహ్మ వుంటారు.

శ్రీ మాతకు 17 తలల ఆదిశేషుడు పడిగ పట్టి వుంటాడు. సింహం వాహనంగా వుంటుంది. సృష్టికి మూలం తనేనని త్రిమూర్తులు, త్రిమాతలతో సహా ముక్కోటి దేవతలందరూ తమ కార్యకలాపాలను తన వీక్షానుమతితోనే సాగిస్తారని ప్రపంచానికి తెలిపే విరాట్ స్వరూపం జగజ్జనని.