Friday 7 February 2014

ఈరోజు నేడు పరమ పావనమైన నైమిత్తిక తిథి ’భీష్మాష్టమి’.

ఈరోజు నేడు పరమ పావనమైన నైమిత్తిక తిథి ’భీష్మాష్టమి’.

జీవితాంతం త్యాగం, ధర్మం, ఇచ్చినబాటకు కట్టుబడడం తప్ప అన్యమెరుగని ధీరుడు భీష్మాచార్యులవారు. తన ముందే తరాలు మారిపోతున్నా, సామంతుల బెడద లేకుండా హస్తినాపుర రాజ్యాన్ని కనురెప్పలా కాపాడుతూ, కురువంశాన్ని కాపాడిన మహానుభావుడు. అంత చేసీ చిన్నవాళ్ళయిన మనుమలచేతిలో అవమానాలకు గురైనా తన ధర్మం తప్పని మహా మనీషి ’భీష్మాచార్యులవారు’. యుద్ధంలో సంధ్యాసమయం దాటుతున్నదని అస్త్రాలను వదిలి నేల మీదకు దిగి సన్నని ఇసుకనే జలధారలుగా స్వీకరించమని సూర్యునికి నమస్కరించి ఇసుకతో అర్ఘ్యమిచ్చి సంధ్యావందనం చేసి చూపిన ధర్మాత్ముడు, దార్శనికుడు. ఈ రోజు తప్పకుండా తలచుకోవలసిన ధర్మాత్ముడు. భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
అలాంటి మహిమాన్వితమైన రోజున సూర్యోదయమునకు ముందే (ఐదు గంటలకు) లేచి పూజామందిరము, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరములను ముగ్గులతో అలంకరించుకోవాలి. తలంటుస్నానము చేసి, తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసముండి, రాత్రి జాగారం చేయాలి.

పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళములు, జాజిమాలతో అలంకరించుకోవాలి. నైవేద్యమునకు పాయసం, తీపిపదార్థాలు, ఆకుపచ్చ పండ్లు సిద్ధం చేసుకోవాలి. ముందుగా విష్ణు అష్టోత్తరం, నారాయణకవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణము లేదా "ఓం నమోనారాయణాయ" అనే మంత్రమును 108 సార్లు జపించాలి. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు పూజ చేసుకోవచ్చు.

యుద్ధ వ్యూహం పన్నినా, రక్షణ భారం నెత్తినేసుకున్నా, ఎదుటివాడి వ్యూహం ఊహించాలన్నా, మరొకరు ఆయన సాటి లేరు ఇచ్చినమాటకి కట్టుబడి నిండు యవ్వనంలో బ్రహ్మచర్య దీక్షని స్వీకరించి చివరివరకూ అలానే ఉన్నా.. రాజ్యం, స్త్రీలు వద్దు మొర్రో అంటున్నా ఏదో ఒక సంక్షోభ తలెత్తి తన పెద్దలే తనని వివాహం చేసుకుని రాజ్యం చేయమని బ్రతిమిలాడినా... మొక్కవోని దీక్షతో తన ప్రతిజ్ఞతప్పక, ధర్మం వీడక తన జీవితమే ఒక సందేశంగా జీవించిన మహోన్నతుడు, మహాత్మా భీష్మాచార్యులవారు.

ఆయనను తలచుకోవటం, మన సంస్కృతికి మన దేశానికి, మన సనాతనధర్మానికి భక్తితో ఒక పుష్పం సమర్పించటంలాంటిది. భగవద్గీతను బోధించిన పరమాత్మ తనంతతాను ఈ భీష్ముడు శరీరం వదిలితే ఈయనకన్నా ధర్మం తెలిసినవాడు, చెప్పగలిగినవాడు లేడు ఆయన దగ్గర అన్నీ తెలుసుకోమని ధర్మరాజాది పాండవులకు చెప్పారంటే భీష్ముడంటే ఏమిటో తెలుస్తోంది.

అసలు నేటికీ మనం పారాయణ చేసే ’విష్ణు సహస్రనామం’ భీష్మాచార్యుల భిక్షగానే కదా దొరికింది.
అవసరంలేని, అన్య మత,దేశాలనుంచి అప్పు తెచ్చుకున్న సంస్కారంతో, అవైదిక మతాదులపెద్దలకు నీరాజనాలు పట్టి బిరుదులిచ్చి, ఉత్సవాలు జరపడానికి సెలవులు (కనీసం ఐచ్చిక సెలవులు) ప్రకటించుకునే మనం కనీసం భీష్మాచార్యుల పేర ఒక్క మంచి పనీ చేయం. కనీసం నేడైనా వారిని తలచుకొని నమస్కరించడం మన విహిత కర్తవ్యం. ఆయన కున్నటువంటి ధీరోదాత్తత, మాటమీదనిలపడి దేశాన్నీ, ధర్మాన్నీ, రక్షించి, ప్రేమించే మనో ధైర్యం, ధర్మాచరణానురక్తి మనందరికీ కలగాలని భీష్మాచార్యులవారి పాదాలను శిరసున ధరించి కోరుకుంటున్నాను.