Monday 31 March 2014

. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ

Brahmasri Chaganti Koteswara Rao Garu.
చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని,
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ

ఈ శ్లోకం తాత్పర్యం తెలుసుకుందాం. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం. మొదటి నెల చైత్రం. మొదటి తిథి పాడ్యమి. మొదటి వారం ఆదివారం. ఆ వేళ ఈ సృష్టి ప్రారంభమైందని అర్థం. ప్రభవించిందని అర్థం. అందుకే తెలుగుసంవత్సరాలలో మొదటిది ప్రభవ. చివరిది క్షయ. నాశనమైందని. అంటే ఈ బ్రహ్మకల్పం అంతమయ్యే సంవత్సరం అన్నమాట. అందువల్ల చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. నిర్ణయసింధుకారుడుకూడా అదే చెప్పాడు. తత్ర చైత్రశుక్ర ప్రతిపదిసంవత్సరారంభ అన్నాడాయన. ఉగస్య ఆదిః ఉగాదిః అంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకు పగలు అంటే మనుషుల లెక్కల ప్రకారం 432,00,00,000 సంవత్సరాలు. రాత్రికూడా అంతే. అంటే బ్రహ్మకు ఒకరోజు అంటే… 864,00,00,000 సంవత్సరాలన్నమాట. ఇలాంటివి 360 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం అయినట్లు లెక్క. అంటే 3 లక్షల 11 వేల 40 కోట్ల సంవత్సరాలన్నమాట. ఇలా వందేళ్లు బ్రహ్మ ఆయుర్దాయం.

ఇప్పటివరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టికార్యాలు ముగించారు. ఏడవ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయపరార్థంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన వయస్సు 51 సంవత్సరాలన్నమాట. కలియుగం ప్రమాది నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమై 197,29,49,114 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాం. ఇది ప్రారంభమై 5114 సంవత్సరాలైంది. ఉగాదినాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని అంటారు. మహావిష్ణువు మత్స్యావతారము ధరించి సోమకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజుకూడా ఇదేనని ప్రతీతి. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజుకూడా ఉగాదే. వరాహమిహిరుడు పంచాగాన్ని జాతికి అంకితం చేసినది ఉగాదినాడే.

ఉగస్య ఆది: ఉగాది: - "ఉగ" అనగా నక్షత్ర గమనము - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి 'ఆది' 'ఉగాది'. అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయినది.
'యుగము' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది.
ఉగాది - వసంతములకు గల అవినాభావ సంబంధము, మరియు సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపము, అని విశదీకరిస్తూ,

''వసంతే కపిల స్సూర్యో గ్రీష్మే కాంచన సుప్రభః
శ్వేతో వర్షా సువర్ణేన పాండుశ్శధి భాస్కరః
హేమంతే తామ్ర వర్ణస్తు శిశిరే లోహితో రవిః
ఇతి వర్ణా సమాఖ్యా తాసూర్యసనతు సముద్భవా!

అని వక్కాణింప బడింది.
విష్ణు కిరణ ప్రభావితమైన వసంతం పసుపువర్ణంగాను - గోధుమ వర్ణంలోను ఉంటుంది. ఈ కిరణములు ఉత్తరాయణంలో వికాసం చెందుతాయి. గ్రీష్మమునకు కాంతులు హేతువు. అవి దక్షిణాయనంలో క్షీణత చెందును అని పై శ్లోకమునకు అర్థము.
భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని నారద పురాణం చెప్పుచున్నది.

''చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని
శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి
వత్సరాదౌ వసంతా రపి రాజ్యే తదైవచ
ప్రవర్తయామాస తదా కాల సగణనామపి
గ్రహన్నాగే నృతూన్మాసానేవత్సరానృత్యరాధిపాన్‌.

వసంతం ప్రారంభమైనపుడు చైత్రశుక్ల పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా ప్రజాపతి బ్రహ్మ ఈ రస జగత్తును సృష్టించాడట. కాల గణన, గ్రహ నక్షత్ర, ఋతు, మాస వర్షాలను, వర్షాధిపులను ప్రవర్తింప చేసాడట.

తెలుగువాళ్ల చాంద్రమానాన్ని అనుసరిస్తారు. కాలగమనంలో మార్పు తప్పదు. కల్పంలో మహాయుగాలు, యుగాలు ఉన్నాయి. ప్రతీవాటికి ధర్మాలు మారుతూంటాయి. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి. ఆయా సంవత్సరాల పేర్లనుబట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు. తెలుగు సంవత్సరాలు 60. ప్రభవనుంచి మొదలై అక్షయతో పూర్తయితే ఒక ఆవృతం పూర్తయినట్లు. మళ్లీ ప్రభవతో ప్రారంభమవుతుంది లెక్క.ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనుక విభిన్న వాదనలు ఉన్నాయి. ఒక ఐతిహ్యం ప్రకారం శ్రీకృష్ణుడికి 16100మంది భార్యలు. వారిలో సందీపని అనే రాజకుమారికి 60మంది సంతానం. వారిపేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు. నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారన్న మరో కథకూడా ప్రచారంలో ఉంది. దక్షప్రజాపతి కుమార్తెల పేర్లుకూడా ఇవేనని అంటారు. ఏదేమైనా ఈ ఉగాదితో ప్రారంభయ్యే విజయ తెలుగు సంవత్సరాలలో 27వది. విజయాలను మూటగట్టుకుని వచ్చేది. విజయోస్తు.

హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును.

ఉగాది శుభాకాంక్షలతో ...
-Admin
 — with Mudium Saiprasad and 5 others.