Tuesday 30 July 2013

మహాగ్రంథాలు - శ్రీ దేవీ భాగవతం



Brahmasri Chaganti Koteswara Rao Garu.
మహాగ్రంథాలు - శ్రీ దేవీ భాగవతం
వ్యాసపీఠం అంటే?

లోకంలోని ప్రజలు అనుకుంటున్నట్లుగా - వ్యాసుడు ఒక మహర్షి అని మాత్రమే గాక, ఇంకా లోతైన విషయం వారికి ఒకటి తెలియవలసి ఉంది....

అదేమిటంటే - వ్యాసపీఠం అనేది ఒక పదవి. ఒకానొక బృహత్తర కార్యక్రమ నిర్వహణ నిమిత్తం ఆ పదవిలో ఏ మహర్షి, ఏ మహానుభావుడు వస్తాడో అతడే వ్యాసుడు. అనగా - ఇక్కడ వ్యాసపీఠానికి ఒక కార్యక్రమం నిర్దేశితమై ఉంది. అది - వేదవిభజన; పురాణ సముద్ధరణ; పురాణగాథా సృజన - వ్యాప్తీకరణ. ఈ నిర్వహణ భారం అందరికీ సాధ్యం కాదు. ఏ మహనీయుడు దీనికి తగినవాడో, అతడు సాక్షాత్‌ విష్ణు భగవానుడే అయి వుండాలి.

అనగా, దీనిని ఇంకొక రూపంగా చెప్పవలసి వస్తే - "ప్రతి ద్వాపర యుగంలోను శ్రీమన్నారాయణుడే వ్యాసపీఠాన్నలంకరించి, ఈ ధరాతలం మీద ధర్మం నెలకొల్పడానికి పురాణ సృజన చేస్తాడు" అని చెప్పవలసి ఉంటుంది.

శ్లో|| ద్వాపరే - ద్వాపరే - విష్ను ర్వ్యాస రూపేణ సర్వదా |
వేద మేకం స బహుధా కురుతే హిత కామ్యయా ||

మనకు 4 యుగాలున్నాయని తెలుసు ! అవి 1. కృత , 2.త్రేతా , 3. ద్వాపర , 4.కలి. మరి, ప్రతి యుగ కాలపరిమితి కూడ తెలుసు! అవి తమ పరిమితి పూర్తి చేసుకోగానే పెనుప్రళయం సంభవించి, సమస్తం జలమయం - పెను చీకట్లు ఆవరిస్తాయనీ తెలుసు! తిరిగి మళ్ళీ నూతన సృష్టికి శ్రీకారం. అంటే - ఈ సృష్టి చక్రభ్రమణంలో మరోసారి ఈ నాలుగు యుగాలూ ఆవృత్తం అవుతాయి. ఇలా పునఃసృష్టికి మూల భూతుడైన పురుషుడే 'మనువు' అనీ - అతని పేరిట 'మన్వంతరాలు' ఒక క్రమ పరిణామమై విస్తరిస్తాయని గ్రహించాలి. ఇప్పటి వరకు ఈ సృష్టి చక్రంలో ఏడుగురు మనువులు తమ పేరిట మన్వంతరాలు నిర్వహించారు అనాల్సి ఉంటుంది. అలగే ద్వాపరయుగం ఇప్పటికి 27సార్లు ఆవృత్తమైంది. (7X4 = 28) మనం ఇప్పుడున్న వైవస్వత మన్వంతరంలో ఈ కలియుగానికిముందు యుగమైన ద్వాపరంలో వ్యాసపీఠిని అలంకరించిన వాడు - సత్యవతీ పుత్రుడు, సూత పౌరాణికుడి గురువు, కృష్ణ ద్వైపాయన మహర్షి అనే వ్యాసుడు. ద్వాపర యుగంలోనే, వ్యాసపీఠి నలంకరించే మహనీయులకు ఈ కలియుగం ఏ రీతిన ఉంటుందనే చింత - చింతన దివ్యదృష్టి వలన అవగతమవుతుంది. ఇది అన్ని మన్వంతరాలలోనూ, అందరు వ్యాసమహర్షులకు జరిగినదే!

కలియుగంలో మానవులకు ఆయుఃప్రమాణమూ అల్పమే! బుద్ధీ అల్పమే! పైగా బ్రాహ్మణేతరులకు - స్త్రీలకు వేదధ్యాయనాధికారం కాలగతిననుసరించి పరిహరించడమైనది. మరి వేదోక్త ధర్మాలు వీరికి అందేదెట్లా? అందువల్ల వేదాల్లోని ధర్మాలను ఎరుకపరచడానికే విస్తృత కథన గాథాత్మకంగా పురాణ సృజన జరిగింది. అంటే....ఒక విధంగా చెప్పాల్సివస్తే, వేద వ్యాఖ్యానమే పురాణ వాజ్మయం అంతా విస్తరించి ఉంది. దీనికో ఉదాహరణ : సకల ధర్మాల సారం అనదగ్గ మహా భారతాన్ని 'పంచమ వేదం' అనడమే!

ఈ (మనం ఉంటున్న) కలియుగనికి కృష్ణద్వైపాయన మహర్షి అందజేసిన పురాణవాజ్మయం ఉంది. అలాగే గడచిన 27 ద్వాపరయుగాలలోను 'వేద విభజన - పురాణ సృజన' అనే బృహత్కార్య భారం నిర్వహించిన వ్యాస భగవానులు 27 గురినీ ఇక్కడ స్మరించడం సముచితమే !

మొట్టమొదటగా 'స్వయం భువము' లయిన వేదాలకు ప్రచోదన కర్త 'బ్రహ్మ' తొలి వ్యాసుడు. తదుపరి వాటిని విభజించి విస్తృత పరచిన వ్యాస భగవానుల క్రమం ఇదీ : - 2. ప్రజాపతి, 3. ఉశనుడు, 4. బృహస్పతి, 5. సవితా దేవ, 6. మృత్యువు, 7. మఘవాన్‌, 8. వశిష్ఠ, 9. సారస్వతుడు, 10. త్రిధాముడు, 11. త్రివృషుడు, 12. భరద్వాజుడు, 13. అంతరిక్షుడు, 14. ధర్ముడు, 15. త్రయారుణి, 16. ధనుంజయుడు, 17. మేధాతిథి, 18. వ్రతి, 19. అత్రి, 20. గౌతమ, 21. ఉత్తమ, 22. హర్యాత్మ, 23. వేన, 24. సామ, 25. తృణబిందు, 26. భార్గవుడు, 27. జాతుకర్ణుడు, 28.(ప్రస్తుతం) కృష్ణద్వైపాయనుడు.

రాబోయే ద్వాపరయుగంలో ద్రోణుని పుత్రుడైన అశ్వత్థామ 29వ వ్యాసుడు".

అని చెప్పి సూతమహర్షి అర్ధనిమీలిత నేత్రుడై, తమ గురుదేవులవారి ప్రసక్తి వచ్చినందున మనసులోనే ఆ సాత్యవతేయుని స్మరించి, దేవీ భాగవత పురాణాన్ని ఏ ఉపాఖ్యానంతో ప్రారంభించాలా అని ఆలోచిస్తూండగా, శౌనకాది మహర్షులు సవినయంగా తమ సందేహాన్ని ఆయన ముందుంచారు.

"రోమహర్షణాత్మక పురాణ ప్రవక్తలైన తాము ఈ దేవీ భాగవత బృహత్‌ పురాణాన్ని, సాక్షాత్‌ సృజనకర్త వ్యాసమౌని ముఖనిర్గతం కాగా విని ధన్యులయ్యారు. మీతో పాటు ఈ పురాణాన్ని వ్యాసపుత్రులు - పుంభావ సరస్వతి, అరణి సంభవుడు అయిన శుకమహర్షి కూడ విని ఉన్నట్లు తాము వచించారు కదా! వ్యాసుల వారికి పుత్రజననం జరిగినది మొదలు సవిస్తరమయిన గాథగా మాకీ పురాణం వినిపించవలసిందిగా కోరుతున్నాము" అని శౌనకాదులు అడిగారు.

"కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నది నానుడి. ఈ బృహత్‌ పురాణాన్ని ఎక్కడ నుంచి ప్రారంభించాలా అని యోచిస్తుండగా " మీరు మంచి ప్రశ్నేవేశారు. సాక్షాత్‌ మా గురుదేవుల ప్రియపుత్రుని జన్మగాథతోనే దేవీ భాగవత పురాణశ్రవణానికి నాంది పలుకుతాను" అంటూ సూత మహర్షి సుకోత్పత్తి ఉపాఖ్యానం చెప్పసాగాడు.