Thursday 13 February 2014

సదా భగవత్ స్మరణ చేస్తూ పనులు సాగించండి. మీరు చేసే కార్యము యజ్ఞము అయిపోతుంది.

Jaji Sarma
సదా భగవత్ స్మరణ చేస్తూ పనులు సాగించండి. మీరు చేసే కార్యము యజ్ఞము అయిపోతుంది.
మరణసమయంలో కఫ, వాత, పిత్త దోషాలకు నేను లోనైతే నీ నామస్మరణకు గొంతు, భగవద్ధ్యానానికి మనస్సు అనుకూలంగా ఉంటాయో, ఉండవో చెప్పలేను, అప్పుడే స్మరిస్తానులే అని ఇప్పుడు మానలేను. ఎందుకైనా మంచిది. ఈ రోజే నీ పాదపద్మాలనే పంజరంలో నా మనస్సు అనే రాజహంసను ప్రవేశపెడతాను, ఆలస్యం చేయను అనే భావాన్ని కులశేఖరులు తమ ముకుందమాలలో-
‘కృష్ణ! త్వదీయ పదపంకజ పంజరాంత
మద్వైవ మే విశతు మానస రాజహంస
ప్రాణప్రయాణ సమయే కఫ వాత పిత్తై
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే’ అనే శ్లోకంలో వివరించారు.

అందుకే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఒంట్లో శక్తి ఉన్నప్పుడే, ఇంద్రియాలు బలంగా, పరిపుష్టంగా ఉన్నప్పుడే, ముసలితనం రాకముందు తనకు, ఇతరులకు శ్రేయస్సును కలిగించే పనులను చేయాలని మన పెద్దలు చెబుతుంటారు. తరువాత చేద్దాం, తొందరేముంది అని వాయిదా వేయవద్దు, సత్కార్య నిర్వహణకై తొందరపడాలి. సత్కార్యసాధనకై ఎక్కువగా ప్రయత్నించాలి.