Sunday 2 February 2014

. ఐతరేయోపనిషత్తు

Jaji Sarma
9. ఐతరేయోపనిషత్తు

ఐతరేయోపనిషత్తు ఎ వేదం లోనిది?
ఐతరేయోపనిషత్తు ఋగ్వేదం లోనిది.

ఐతరేయోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?
"ఇతర" అను పేరు గల స్త్రీ యొక్క కుమారుని పేరు ఐతరేయుడు. ఇతని పూర్తీ పేరు మహీపాల ఐతరేయుడని కొందరు, మహీదాస ఐతరేయుడని మరి కొందరు పేర్కొంటారు. ఈ ఉపనిషత్తులోని మంత్రాలకు ద్రష్ట ఐతరేయుడు గనుక దీనికి ఐతరేయోపనిషత్తు అను పేరు వచ్చింది.
ఇందులో ఎన్ని అధ్యాయాలలో ఉన్నాయి?
ఐతరేయ ఆరణ్యకం లోని 4, 5, 6 అధ్యాయాలను ఈ ఉపనిషత్తులోని మూడు అధ్యాయాలుగా గ్రహించారు. ఈ ఉపనిషత్తులోని మొదటి అధ్యాయంలో మూడు ఖండాలు ఉన్నాయి. రెండవ అధ్యాయంలో ఒక ఖండము, మూడవ అధ్యాయములో ఒక ఖండము ఉన్నాయి. మొత్తం మీద ఈ ఉపనిషత్తులో 5 ఖండములు ఉన్నాయి.

ఋగ్వేదానికి చెందిన మహావాక్యం ఈ ఉపనిషత్తులో ఉందంటారు. ఆ మహావాక్యం ఏమిటి? సంక్షిప్తంగా దాని అర్థం ఏమిటి?
"ప్రజ్ఞానం బ్రహ్మ" అనే మహా వాక్యం ఈ ఉపనిషత్తులోఉంది . దాని అర్థం - " సృష్టికి మూలమైన, నిరుపాధికమైన శుద్ధ చైతన్యమే పరబ్రహ్మ". బ్రహ్మము సర్వజ్ఞుడు, సర్వ శక్తివంతుడు అని ఈ ఉపనిషత్తు అభివర్ణించింది.

సృష్టికి పూర్వం ఏముంది?
ఆత్మ ఒక్కటే ఉందని ఈ ఉపనిషత్తు ఈ విధంగా వివరించింది.

ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ (1.1.1)
సృష్టికి పూర్వం ఉన్నది ఆత్మ ఒక్కటే. ఇది నిర్విశేషమైన ఆత్మ. ఈ ఆత్మ వ్యక్తమైనప్పుడు నామరూపాత్మకమైన జగత్తుగా భాసిస్తుంది. అవ్యక్తంగా ఉన్నప్పుడు ప్రత్యక్ష ప్రమాణానికి అందేది కాదు. విశ్వంగా వ్యక్తమైనపుడు ప్రత్యక్ష ప్రమాణానికి అందుతుంది. ఒకే ఆత్మను అవ్యక్తంగా ఉన్నప్పుడు 'ఆత్మ' అని, వ్యక్తమైనప్పుడు 'విశ్వం' అని అంటున్నాము. ఈ ఆత్మ మనలోనూ ఉంది. జాగ్రత్, స్వప్న, సుషుప్త్యవస్థలలోను ఆత్మ ఉంటుంది. దీనికి భూత, భవిష్యద్వర్తమానాలు లేవు. సృష్టికి ముందర ఏముంది అన్న ప్రశ్నకు అనుగుణంగా 'ఆత్మ' ఒక్కటే ఉందని సమాధానం చెప్పబడింది గాని, సృష్టికి తర్వాత, ప్రళయం సంభవించినప్పుడు ఆత్మ ఉండదని కాదు. ఆత్మ నిత్యమైనది.

సృష్టి కార్యం చెయ్యాలని పరమాత్మ ఎందుకు సంకల్పించాడు?
స ఈక్షత లోకాన్ను సృజా ఇతి (1.1.1)
అద్వితీయుడైన పరమాత్మ లోకాలను సృష్టించాలని అనుకున్నాడట. మరి ఆత్మ నిష్క్రియుడు కదా! ఆయన లోకాలను సృష్టించాలను కోవడం ఏమిటి? అనే ప్రశ్న వస్తుంది. శ్వేతాశ్వతరోపనిశత్తు (3.19) లో చేతులు లేకపోయినా గ్రహించేవాడు, కాళ్ళు లేకపోయినా వడిగా నడిచేవాడు, కళ్ళు లేకపోయినా చూచేవాడు పరమాత్మ అని ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు వర్ణించబడ్డాయి. అందుచేత ఆయనకు అసాధ్యం ఏదీ లేదు. అంతేకాక ఆయనలో క్రియాశక్తిగా మాయ ఉంది. ప్రళయం నాటికి జీవులు అనుభవించకుండా మిగిలిన కర్మలు అనుభవానికి వచ్చే సమయం ఆసన్నమయినపుడు మాయ సృష్టికి ప్రేరేపిస్తుంది. పరమాత్మ సృష్టికి ఉపక్రమిస్తాడు.

సృష్టి ఎన్ని అంచెలుగా జరిగినట్లు ఈ ఉపనిషత్తు ప్రతిపాదిస్తుంది?
సృష్టి రెండంచెలుగా జరిగిందని ఈ ఉపనిషత్తు చెప్తుంది. మొదట సమిష్టిగా (విరాట్ పురుషుడుగా - macrocosm) తరువాత వ్యష్టిగా (జీవజాలంగా - microcosm) జరిగిందని చెప్పింది. వ్యష్టిగా జీవజాలాన్ని సృష్టించి, అందులో ధర్మసాధనకు మానవ శరీరం అనువుగా ఉంటుందని మానవుణ్ణి సృష్టించడం జరిగింది. ఈ జీవజాలానికి కావలసిన ఆహారం కూడా సృష్టించబడింది. ఈ ఉపనిషత్తులో వివరించబడ్డ సృష్టి క్రమం ఆధునిక పరిణామవాదానికి కొంత వరకు అనుగుణంగా ఉండడం విశేషం. మరొక ముఖ్యమైన విషయం, ఈ సృష్టి మొదటి సృష్టి అని, చివరి సృష్టి అని అనడానికి వీలులేదు. సృష్టి, స్తితి, లయాలు నిరంతరం ఆవృత్తం అవుతూ ఉంటాయి.

శరీరంలోకి ఆత్మ ఎలా ప్రవేశించింది?
ఆ క్రమాన్ని ఉపనిషత్తు ఇలా అభివర్ణించింది.
స ఏతమేవ సీమానం విదార్య
ఏతయా ద్వారా ప్రాపద్యత
సైషా విదృతిర్నామ ద్వాః (1.3.12)
శరీరంలోకి జీవభావంతో ఎలా ప్రవేశించాలి? అని పరమాత్మ ఆలోచించి, చివరకు కపాలాన్ని చీల్చుకుని, అలా ఏర్పడిన రంధ్రం గుండా శరీరంలోకి ప్రవేశించాడు. ఈ రంధ్రాన్ని విదృతి అంటారు. జ్ఞాన రూపమైన జీవాత్మ శిరోభాగం నుండి ప్రవేశించిందని క్రియారూపమైన ప్రాణం పాదాల నుండి ప్రవేశించిందని ఈ ఉపనిషత్తు చెప్తుంది. జ్ఞానేంద్రియాలన్నీ శరీరానికి పై భాగంలోనే ఉండడం గమనార్హం