Friday 15 February 2013


అగ్ని పురాణం ప్రకారం మన శరీరంలో ఉండే మూలాధార చక్రం నుండీ నాడులు బయలుదేరతాయి. వీటిలో ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, హస్తిజిహ్వా, పృథా, యశా, ఆలంబుషా, కుహూ, శంఖిని అనేవి ప్రాణ వాయువులని ప్రసారం చేస్తాయి కావున ప్రముఖమయినవి. ఆ పది రకాల ప్రాణ వాయువులూ ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయాలు. వీటి స్థాన చలనాలు:

” హృది ప్రాణం గుదేపానం ఉదానో నాభి దేశకః
సమానో కంఠ దేశస్థః వ్యాన సర్వ శరీరగః
వాగ్ద్వారే నాగ ఆఖ్యాతః కూర్మాదున్మీలనం స్మృతం
కృకరాత్ క్షుధాజ్ఞేయః దేవదత్తాత్ విజృంభణం
మృతస్యాపి న జహాతి సర్వవ్యాపి ధనంజయః “

ప్రాణ వాయువు: హృదయంలో ఉంటూ జీవాత్మను వృద్ధి చేస్తుంది. ఇది శరీరంలో ఉండే శూన్యత్వాన్ని పూర్తి చేస్తూ మిగతా ప్రాణ వాయువులన్నిటినీ ప్రేరేపిస్తూ ఉంటుంది కావున ఇది మిగతా వాయువులన్నిటికీ అధిపతి. మన శ్వాస రూపములో ఉండేది ఈ వాయువే. ప్రాణి ఆయుర్దాయం తను తీసుకునే ఉచ్ఛ్వాశ, నిశ్వాసల మీద ఆధారపడి ఉంటుంది. వీటిని ప్రాణాయామం ద్వారా అదుపు చేయగలిగితే మనిషి ఆయుర్దాయం పొడిగించవచ్చును.

అపాన వాయువు: ఇది శరీరములో పశ్చిమ భాగములో (గుదము వద్ద) ఉంటుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి, మల, మూత్ర, శుక్ర రూపములో క్రిందకి తోసేది అపాన వాయువు. అపానయానం (తొలగించటం) చేస్తుంది కనుక అపాన వాయువు అయ్యింది.

ఉదాన వాయువు: ఇది నాభి (బొడ్డు) వద్ద ఉంటూ దేహములో సగ భాగాన్ని పెంచుతుంది. స్పందన (ముఖ, పెదాల, కళ్ళ కదలికలు, మొ.,) కలిగించే వాయువు ఉదానము.

సమాన వాయువు: ఇది కంఠము వద్ద ఉంటూ సర్వ నాడుల పని తీరుని చూసుకుంటుంది. తిన్న ఆహారాన్నీ, త్రాగిన ద్రవాలనీ, వాసన చూసిన వాటినీ రక్త, పిత్త, వాత, కఫములుగా మార్చి సర్వాంగాలకూ సమానముగా పంచుతుంది కనుక సమాన వాయువు అయ్యింది.

వ్యాన వాయువు: ఇది శరీరమంతా ఉంటుంది. శరీర భాగాలను పీడించటం, గొంతు బొంగురు పోయేలా చేయటం, వ్యాధిని ప్రకోపించటం దీని విధులు. వ్యాపన శీలంతో ఉండటం వలన వ్యానము అయ్యింది.

ఈ అయిదూ ప్రధాన వాయువులు కాగా మిగతా అయిదూ ఉప వాయువులు. అవే నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయాలు. వాగ్ద్వారము వద్దన ఉండి మాట వచ్చేలా చేసేది, త్రేన్పు, వాంతి వంటివి తెప్పించేది నాగ వాయువు. కూర్మ వాయువు మనం తిన్నవాటినీ, త్రాగినవాటినీ, మ్రింగటానికే కాక కను రెప్పలు మూసి, తెరవటానికి ఉపయోగపడుతుంది. ఆకలి, దాహం మొదలయిన వాటిని కలిగించేది, తుమ్ము తెప్పించేది కృకర వాయువు. ఆవలింతలు తెప్పించేది దేవదత్త వాయువు. ఇహ మనిషి చనిపోయాక కూడా మానవ శరీరంలోనే కొంతసేపు ఉండగలిగే వాయువు ధనంజయ వాయువు. ఈ ధనంజయ వాయువు వలననే చనిపోయిన శవం కొంతసేపటి తరువాత ఉబ్బుతుంది. ఇవే కాక, ప్రజాపత్య వాయువు అని ఒకటుంటుంది. ఆ వాయు పీడనం వలననే శిశువు తల్లి గర్భము నుండీ బయటకు వస్తుందనీ మార్కండేయ పురాణం చెప్తోంది. ఇలా బయటకు వచ్చే ప్రక్రియలో అలసిపోయిన శిశువుకు ఉత్తేజాన్ని ఇచ్చేది కూడా వాయువే కదా! అలసిన ఒంటికి చక్కని లాలన వాయువు.

curtosy :: రసజ్ఞ