Sunday 20 September 2015

 http://vibhaataveechikalu.blogspot.in/

పంచగవ్యము ---దాని ప్రాశస్త్యత

  పంచగవ్యము ---దాని ప్రాశస్త్యత పంచగవ్యము అంటే గోవు నుండీ లభించే అయిదు పదార్థాలతో చేసిన ఒక లేహ్యము వంటిది. అవి , ఆవుపాలు , ఆవుపాలు తోడుపెట్టిన పెరుగు , ఆవు వెన్నతో చేసిన నెయ్యి , గోమూత్రము మరియు గోమయము. ఈ అయిదింటినీ ఒక ప్రత్యేక నిష్పత్తిలో ఆయా మంత్రాలతో అభిమంత్రించి కలిపి , చేసిన ద్రవమునే పంచగవ్యము అంటారు. సనాతన ధర్మములో గోవుకున్న ప్రాముఖ్యత , గౌరవము , విలువా అంతాఇంతా కాదు. వేదములో అనేకచోట్ల , ’ గోబ్రాహ్మణ ’ అన్న పదము తరచూ వస్తుంది. బ్రాహ్మణుల , గోవుల హితము కొరకు పనిచేయుట చాలా పవిత్రమైన కార్యము. గోవులను పూజించుట వేలయేళ్ళ నుండీ వాడుకలో ఉంది.. అనేకులు ఋషులతో పాటు , భగవంతుని అవతారాలయిన శ్రీ కృష్ణుడు , శ్రీ రాముడు వంటి వారు కూడా గోపూజను చేసినవారే.. అట్టి గోవునుండీ లభించు పదార్థాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. మానవుడు చేసే అనేక పాపాలలో , పొరపాట్లలో ఎన్నింటికో , సనాతన ధర్మశాస్త్రములలో అనేక ప్రాయశ్చిత్తాలు విధింపబడినవి. పంచ గవ్యము యొక్క ప్రాశన ( తాగుట ) వాటిలో ఒకటి. దీనిని బట్టే గోవులకు గల ప్రాశస్త్యము ఎట్టిదో తెలుస్తున్నది. ఒక కపిల గోవు ( ఎర్రావు )పాల నుండీ చేసిన పంచగవ్యము ఇంకా ఫలవంతమైనది.

 

 పంచగవ్య పదార్థాలను కలపవలసిన నిష్పత్తి ఈ క్రింది విధముగా ఉండాలి.

:: గోక్షీరము ఎంత తీసుకుంటే , అంతే పెరుగు కూడా తీసుకోవాలి.. గోక్షీరములో సగము గోఘృతము ( ఆవు నెయ్యి ) , గోఘృతము లో సగము గోమూత్రము , గోమూత్రములో సగము గోమయము ( ఆవుపేడ ) ఈ పంచగవ్యాన్ని అనేక ప్రయోజనాలకోసము వాడతారు... * పాపనివృత్తియై , దేహము శుద్ధముగా ఉండుట కోసము పంచగవ్యమును స్వీకరిస్తారు.

 

, * యజ్ఞోపవీత ధారణ సమయములో శరీర శుద్ధి కోసము పంచగవ్యమును మొదట ప్రాశన చేస్తారు. * కొన్ని పూజలముందరకూడా పంచగవ్య ప్రాశన చేస్తారు...,

 * ఏదైనా ఒక శివలింగముకానీ , సాలిగ్రామము కానీ , రుద్రాక్షకానీ , లేక చిన్న విగ్రహముకానీ పూజగదిలో ఉంచి పూజించుటకు ముందు , వాటిని పంచగవ్యముతో మంత్ర సహితముగా అభిషేకము చేసి , ఆ తర్వాతనే పూజించాలి. పంచగవ్యమును

ఉపయోగించు విధము యే ప్రయోజనము కోసము పంచగవ్యమును వాడుతున్నామో , ఆ సంకల్పాన్ని మొదట చెప్పాలి,

 

ఉదాహరణకు , యజ్ఞోపవీత ధారణ సమయములో శరీర శుద్ధి కోసము చేస్తుంటే , మొదట ఆచమనము , ప్రాణాయామము చేసి , దేశకాల సంకీర్తనానంతరము , 1. "|| మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిధ్యర్థం , శరీర శుద్ధ్యర్థం , పంచగవ్య ప్రాశన -యజ్ఞోపవీత ధారణమహం కరిష్యే || తదంగ పంచగవ్య మేళనం యజ్ఞోపవీత సంస్కారమహం కరిష్యే ||| అని చెప్పాలి. తర్వాత , పంచగవ్యము కలుపవలసిన పద్దతి :- ఒక అరిటాకులోగాని , పళ్ళెం లో గానీ శుభ్రమైన బియ్యం పోసి , దానిపైన స్వస్తిక గుర్తు వేలితో రాయాలి. ఆ గుర్తుపైన ఒక మట్టి పాత్రగానీ , ఇత్తడి లేక కంచు లేక వెండి పాత్రగానీ పెట్టి , దానికి తూర్పు దిక్కున అటువంటిదే ఒక చిన్న పాత్రలో గోమూత్రాన్ని ఉంచాలి. దక్షిణాన ఒక పాత్రలో గోమయమునుంచాలి. పశ్చిమాన వేరొక పాత్రలో ఆవుపాలను పోయాలి. ఉత్తరాన అటువంటిదే ఇంకో పాత్రలో ఆవుపెరుగు పోయాలి . మధ్యలోని పాత్రలో ఆవునెయ్యి పోయాలి. ఇవికాక , వాయవ్యములో ఒక పాత్రలో కుశోదకం పోయాలి ( దర్భలు ఉంచిన నీరు ) . ఇప్పుడు అన్ని పాత్రలలోనూ , ఆయా పదార్థాల అధిదేవతలను ఆవాహన కింది విధంగా చేయాలి తూర్పు పాత్రలో , || గోమూత్రే ఆదిత్యాయ నమః ఆదిత్యమావాహయామి || ( అని పలకాలి ) దక్షిణ పాత్రలో , || గోమయే వాయవే నమః వాయుమావాహయామి || పశ్చిమ పాత్రలో , || గోక్షీరే సోమాయ నమః సోమమావాహయామి || ఉత్తర పాత్రలో , || గోదధ్ని శుక్రాయ నమః శుక్రమావాహయామి || ( గో దధి అంటే ఆవుపెరుగు ) మధ్య పాత్రలో , || ఆజ్యే వహ్నయే నమః వహ్నిమావాహయామి || ( వహ్ని అంటే అగ్ని ) వాయవ్య పాత్రలో , || కుశోదకే గంధర్వాయ నమః గంధర్వమావాహయామి || ఇలాగ ఆవాహన చేసి , కుంకుమ , గంధము , పూలతో పూజించాలి, తర్వాత మధ్యలో ఉంచిన పాత్రలో , ఒక్కొక్క పదార్థాన్నీ కింది మంత్రాలతో కలపాలి ( మంత్రము పూర్తిగా ఇవ్వడము లేదు , వాటిని స్వరముతో పలుకవలెను. మంత్రము రానివారు , ఆయా దేవతలకు ఆయా పదార్థాలతో అభిషేకం చేసినట్లు భావించుకుంటూ ) మధ్యలోని పాత్రలోకి , గాయత్రీ మంత్రం పలుకుతూ గోమూత్రాన్ని , " || గంధ ద్వారే ...|| " అను మంత్రముతో గోమయాన్ని , "|| ఆప్యాయస్వ ...|| " అనే మంత్రంతో గోక్షీరాన్ని , "|| దధిక్రావ్‌ణ్ణో....|| " అనే మంత్రముతో పెరుగునూ , " || శుక్రమసి జ్యోతిరసి.... || " అనే మంత్రముతో నేతినీ , " || దేవస్యత్వా సవితుః .....|| " అనే మంత్రముతో కుశోదకాన్నీ కలపాలి. దర్భలు తీసుకొని , " || ఆపోహిష్ఠా ... || " అనే మంత్రముతో మధ్యపాత్రలో కలయబెట్టాలి " || మానస్తోకే తనయే ....|| " అను మంత్రముతో అభిమంత్రించి , అందులోకి మరలా గాయత్రీ మంత్రము చెబుతూ సూర్యుడిని ఆవాహన చేయాలి. తర్వాత పంచగవ్యానికి పంచమానసపూజలు చేయాలి ( లం పృథివ్యాత్మనే నమః .... ఇత్యాది ) మరలా వ్యాహృతులతో గాయత్రీ మంత్రం జపించి ,

 

  || యత్త్వగస్థి గతమ్ పాపమ్ దేహే తిష్ఠతి మామకే ( ఇతరులకోసం చేస్తుంటే , ’ తావకే ’ ) || ప్రాసనం పంచగవ్యస్య దహత్వగ్నిరివేంధనం ||

 

  అని పలికి , ఓంకారము పలికి , పంచగవ్యాన్ని ప్రాశనము చేయవలెను ( త్రాగ వలెను ) శరీర శుద్ధికోసము అయితే ఇంతవరకే.

 2. యజ్ఞోపవీత ధారణ కోసమయితే పైదంతా చేసి , తర్వాత రెండుసార్లు ఆచమించి , కొత్త యజ్ఞోపవీతాన్ని ఎడమ చేతిలో ఉంచుకొని , " || ఆపోహిష్ఠా ..|| . మంత్రముతో మొదలుపెట్టి సంధ్యావందనములోని మార్జన మంత్రాలన్నీ చెప్పవలెను. తర్వాత , ఉదకశాంతి మంత్ర పాఠము అయినవారు , "|| పవమానః సువర్జనః .... నుండీ మొదలుపెట్టి , "

|| జాతవేదా మోర్జయంత్యా పునాతు ...||. " వరకూ చెప్పి , యజ్ఞోపవీతాన్ని నీటితో అభ్యుక్షణము చేసి ( మూసిన పిడికిలితో నీళ్ళను ప్రోక్షించి ) మూడు తంతువులలోకి వ్యాహృతులను , దేవతలను ఆవాహన చేయాలి. ప్రథమ తంతౌ ఓం భూః ఓంకారమావాహయామి , ఓం భువః ఓంకారమావాహయామి , ఓం సువః ఓంకారమావాహయామి , ఓం భూర్భువస్సువః ఓంకారమావాహయామి ,అని వ్యాహృతులను ఆవాహన చేయాలి. తర్వాత , ద్వితీయ తంతి లోకూడా ‘అలాగే వ్యాహృతులను ఆవాహన చేయాలి తృతీయ తంతౌ అగ్నిమావాహయామి , నాగమావాహయామి , సోమమావాహయామి , పితౄనావాహయామి , ప్రజాపతిమావాహయామి , వాయుమావాహయామి , సూర్యమావాహయామి , విశ్వాన్దేవానాహయామి... అని పలికి , మూడు సూత్రములలోనూ , బ్రహ్మాణమావాహయామి, విష్ణుమావాహయామి , రుద్రమావాహయామి , అని ఆవాహన చేసి అక్షతలు వేసి పూజించాలి. తర్వాత , "|| స్యోనా పృథివి...... సప్రథా || " అని పలికి , యజ్ఞోపవీతా(ల)న్ని కింద భూమిపైన గానీ ఒక పళ్ళెములోగానీ పెట్టవలెను. "|| ఓం దేవస్యత్వా సవితుః ....హస్తాభ్యామాదదే || " అనే మంత్రముచెప్పి చేతిలోకి తీసుకొని , "|| ఉద్వయం తమసస్పరి....... జ్యోతిరుత్తమం || " అనే మంత్రాలను పలికి యజ్ఞోపవీతాన్ని ఆదిత్యుడికి చూపించవలెను. తర్వాత హృదయాది న్యాసములు చేసి , " ముక్తా విద్రుమ ... " ధ్యాన శ్లోకము చెప్పి , ఒక్కొక్క యజ్ఞోపవీతాన్నీ పది సార్లు గాయత్రీ మంత్రముతో అభిమంత్రించి , " || యజ్ఞోపవీతమిత్యస్య పరబ్రహ్మ పరమాత్మా త్రిష్టుప్ ఛందః | శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థే యజ్ఞోపవీత ధారణే వినియోగః || " || యజ్ఞోపవీతం పరమం ... తేజః ||" అని పలికి యజ్ఞోపవీతాన్ని ధరించవలెను. మరలా ఆచమించి , || అజినం బ్రహ్మ సూత్రం

చ జీర్ణం కశ్మల దూషితం | విసృజామి సదా బ్రహ్మవర్చో దీర్ఘాయ్తురస్తు మే || అని పాత యజ్ఞోపవీతాన్ని తీసివేయవలెను. || అనేన మయాకృత పంచగవ్య ప్రాశన- యజ్ఞోపవీత ధారణ విధి కర్మణా శ్రీ పరమేశ్వరః ప్రీయతాం || మళ్ళీ ఆచమనము చేయాలి. 3. కొత్త శివలింగము , సాలిగ్రామము , విగ్రహము , రుద్రాక్ష మొదలగునవి మొదటిసారి ధరించుటకు ముందు , పైన చెప్పినట్లే పంచగవ్య మిశ్రణము చేసి , ఆ మిశ్రణముతో " పవమానస్సువర్జనః ..." అనే మంత్రములతోను , మలాపకర్షణ మంత్రములతోను , అభిషేకము చేయవలెను. తర్వాతనే వాటిని ఉపయోగించవలెను. 4. పంచగవ్యపు ప్రయోజనాలు ఇంకా చాలానే కలవు. వాటిలో ముఖ్యమైనది , ఇంట్లో అంటు , ముట్టు పాటించుటకు వీలు కాకపోతేనో , అంటు కలసిపోతేనో , ప్రతిరోజూ కానీ , నాలుగవ రోజుకానీ ఈ పంచగవ్య ప్రాసనము చేయాలి. చివరిగా , పంచగవ్యముతో క్రిమి నివారకాలను కూడా తయారు చేస్తారు || శుభం భూయాత్ ||